సీఎం జగన్ తోలి లక్ష్యం అవినీతి నిర్ములన… మలి లక్ష్యం కూడా అవినీతి నిర్మూలన…! ఆయన అడుగులు ఆ దిశగానే పడుతున్నాయి. ప్రతీ విభాగంలోనూ ముందు, వెనుకా అవినీతి వ్యవహారాలను తవ్వుతూ తమకు ఆ మరకలు పడకుండా జాగ్రత్తలు పడుతున్నారు. కానీ ఈ మధ్య వచ్చిన ఓ 307 కోట్ల అవినీతి వ్యవహారంలో జగన్ తేరుకుని సరిచేయకపోతే మాత్రం ఇది మచ్చగా మిగిలే అవకాశం ఉంది. ఆయన లక్ష్యానికి, ఆయన పేరుకి, ఆయనపై జనం పెట్టుకున్న నమ్మకానికి ఇదే తొలి మచ్చగా మిగిలిపోనుంది. ఆపత్కాలంలో, ప్రాణాపాయంలో మనకు టపీమని గుర్తొచ్చే నంబర్ 108 అంబులెన్సు. “కుయ్ కుయ్ కుయ్” అంటూ వచ్చి వాలిపోయి ప్రాణాన్ని నిలబెడతాయి. రాజశేఖర్రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు వచ్చిన ఈ అంబులెన్సులు, రాష్ట్రంలో లక్షలాది ప్రాణాలు నిలబెట్టాయి.
తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు వీటిని అంతగా పట్టించుకోలేదు. మల్లి జగన్ సీఎం అయ్యాక వీటిని సమర్ధవంతంగా అమలు చేసే ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే ఆ కాంట్రాక్టు కేటాయింపుల్లో జగన్ నీడగా ఉన్న విజయసాయిరెడ్డి వేలు పెట్టి, బంధువులకు కట్టబెట్టారనేది ఆరోపణ. అంతే ఏకంగా రూ.307కోట్లను దోచేశారని ఆరోపణ.
108 ముందు కథ ఇదే…!
108 అంబులెన్సులు ముందుగా ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టింది మంత్రం సత్యం రామలింగరాజు. జూన్ 27, 2001న రామలింగ రాజు తండ్రి బైర్రాజు సత్యనారాయణ రాజు పేరిట ‘‘బైర్రాజు ఫౌండేషన్’’ను ఆరంభించి, రెండేళ్ల తర్వాత ‘‘సహాయ’’ పేరుతో ప్రయోగాత్మకంగా ఉచిత అంబులెన్సులు ఏర్పాటు చేసారు. వైద్యపరమైన అత్యవసర సహాయ సేవలను పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలంలోని 19 గ్రామాలకు పనికొచ్చేలా ఏర్పాటయ్యాయి. ఇవి బాగా విజయవంతం కావడంతో 2005న అప్పటి కేంద్ర మంత్రి దయానిధి మారన్, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిలు వీటిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు. తర్వాత అనేక రాష్ట్రాలు వీటిని ఫాలో అయ్యాయి.
వైసిపి వచ్చాక ఏమైందంటే…!
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక కీలక అంశాల్లో పాట నిర్ణయాలను, కాంట్రాక్టులను రద్దు చేసి, తాజాగా ఇస్తుంది. దీనిలో భాగంగా 108 అంబులెన్స్ నిర్వహిస్తున్న బీవీజీ ఇండియా లిమిటెడ్ ని తప్పించి.. అరబిందో ఫౌండేషన్కు అప్పగించింది. బీవీజీ సంస్థ ఒక్కో అంబులెన్స్ నిర్వహణకు.. నెలకు రూ. లక్షా 31వేలు ఇచ్చింది. అరబిందో ఫౌండేషన్ కు ఒక్కో అంబులెన్స్ కు రూ. లక్షా 78వేలు ఇచ్చేందుకు అంగీకరించారు. అంటే.. ఒక్కో అంబులెన్స్కు నెలకు రూ. 47వేలు ఎక్కువ ఇవ్వడం మొదలైయింది. ఇలా 300 అంబులెన్స్లు ఉన్నాయి. అంటే.. ఏడాదికి రూ. 17 కోట్లు ఎక్కువ. కొత్తగా మరో 412 అంబులెన్స్లను కొనుగోలు చేసింది. వాటి నిర్వహణకు మరింత ఎక్కువగా రూ. 2 లక్షల 21వేలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుంది. అంటే.. ఇక్కడ ఏటా మరో రూ. 21 కోట్లు ఎక్కువ. పాత, కొత్త వాహనాలకు కలిపి ఏడాదికి రూ. 38 కోట్లు ఎక్కువ చెల్లిస్తున్నారు. ఇక ఇతరత్రా మెయింటెనెన్స్ లు కలిపి మొత్తం రూ. 307 కోట్ల కుంభకోణంగా తెదేపా ఆరోపణలు చేయడం మొదలు పెట్టింది. ఈ ఆరోపణల్లో కూడా పస ఉండడంతో విరిసిపి ఇరుకున పడింది.
కాంట్రాక్టు ఇచ్చాక ప్రభుత్వ బాధ్యత ఏముంది..??
కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థ ఏదైనా పెరగబోయే ఖర్చులు.. మిగలబోయే సంపదకు బాధ్యత తీసుకుంటుంది. ప్రభుత్వం తీసుకోదు. కానీ ఇక్కడ నిర్వహణ ఖర్చులు పెరగబోతున్నాయని అందుకే.. రేట్లు పెంచామని చెబుతున్నారు. అంబులెన్స్ లో పని చేసే డ్రైవర్లు, ఇతర మెడికల్ టెక్నిషియన్లకు జీతాలు పెంచుతారని.. ఏడేళ్లలో ఇంధన ధరలు భారీగా పెరుగుతాయని,.. నిర్వహణ వ్యయం పెరుగుతుంది. కాబట్టి ఎక్కువ రేటు కేటాయించాల్సి వచ్చిందని వాదిస్తోంది. పాత వాహనాలకు ఎక్కువ రిపేర్లు వస్తాయి కాబట్టి కొత్త, పాత వాహనాలకు వేర్వేరు రేట్లు చెల్లిస్తున్నామని ప్రభుత్వం తరపున ఆరోగ్య శాఖ వివరణ ఇస్తుంది. ఇక్కడ కొత్త వాహనాలకే ఎక్కువ నిర్వహణ వ్యయం చెల్లిస్తూండటం విశేషం.
విజయసాయిరెడ్డి పాత్ర ఏమిటంటే…!
అరబిందో సంస్థ అధినేత రాం ప్రసాద్ రెడ్డి. ఈయన స్వయానా విజయసాయిరెడ్డికి వియ్యంకుడు. జగన్ అక్రమాస్తుల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి. ఈ మధ్యనే ఆయన, ఆయన భార్య సునీలా రాణిలతో పాటు సంబంధిత సంస్థలపై ఇన్ సైడర్ ట్రేడింగ్ నిబంధనల ఉల్లంఘన కింద సెబీ రూ. 22 కోట్ల రూపాయల జరిమానా విధించింది. పైగా దేశానికి వేలకోట్లు పన్ను ఎగవేసి వాటిని విదేశాల్లో పెట్టుబడులు పెట్టిన పలువురు ప్రముఖుల బాగోతాన్ని బయటపెట్టిన పనామా పేపర్స్ జాబితాలో ఈయన పేరు కూడా ఉంది. ఇన్ని ఆరోపణలు ఉన్న అరబిందో ఫార్మా కంపెనీ అధినేత వారసుడు రోహిత్ రెడ్డికి కాంట్రాక్టు ఇచ్చారు. ఈయన విజయసాయిరెడ్డి అల్లుడు.
వివరణలో డొల్లతనం…!
ఈ ఆరోపణలపై ప్రభుత్వం ఇస్తున్న వివరణ కూడా డొల్లతనంతో ఉంది. “2020 జనవరి 8న రివర్స్ టెండరింగ్లో అరబిందో ఫార్మా ఫౌండేషన్ సంస్థను ఎంపిక చేశామని.., నిర్వహణ కోసం కొత్త వాహనంపై రూ.3.12 లక్షలు, ప్రస్తుత వాహనంపై రూ.3.87 లక్షలు అవుతున్నప్పటికీ .. తాము నెలకు ఒక్కో కొత్త వాహనానికి రూ.1.78 లక్షలు, పాత వాహనానికి రూ.2.21 లక్షలు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. (మెయింటెనెన్స్ లు అదనం). అంటే. రివర్స్ టెండరింగ్ వల్ల ఏడేళ్లకు కలిపి రూ.213.87 కోట్లు ఆదా అయిందని ప్రభుత్వం లెక్కలేసి చెపుతోంది. వేతనాల పెంపు, ఇతర నిర్వహణ ఖర్చు వల్ల 108 అంబులెన్సుల నిర్వహణ వ్యయం పెరిగిందని ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన వివరణలో పేర్కొంది. ఇవన్నీ ఇప్పుడు చర్చనీయాంశాలుగా మారాయి. ఏది..? ఏమిటి..? ఆరోపణలు ఎంత వరకు ఉన్నా… కాంట్రాక్టు కట్టబెట్టింది మాత్రం విజయసాయిరెడ్డి బంధువుకి అనేది స్పష్టమయింది. అదే పెద్ద తలనొప్పి, ఎన్ని వివరణలు ఇచ్చుకున్నా ఇది వదిలే మరక మాత్రం కాదు.