Jagan New Cabinet: ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కొత్త టీమ్ (మంత్రివర్గం) దాదాపుగా ఫైనల్ అయ్యింది. కాకపోతే బయటకు కనిపించే వైసీపీ అనుకునే జగన్మోహనరెడ్డి వేరు, లోలోపల ఆయనకు ఉన్న భయం, ఆందోళనలు, ఆయనకు వస్తున్న బెదిరింపులు, వత్తిళ్ల కారణంగా అసలు జగన్మోహనరెడ్డి వేరు అన్నట్లుగా ఉంది. గంట గంటకు లిస్ట్ లో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. నిన్న సాయంత్రం నుండి నూతన మంత్రులు వీరే అంటూ ఓ లిస్ట్ సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది. ఇదే లిస్ట్ ఈ రోజు పత్రికల్లోనూ వచ్చింది. అయితే అందులోనూ పేర్లు మారాయి. మారిన పేర్లతో సహా ఎవరెవరికి మంత్రి వర్గంలో అవకాశం ఉంది అనేది పరిశీలిస్తే..పాత మంత్రులు పది మందిని కొనసాగిస్తున్నారు. సిదిరి అప్పలరాజు, చెన్నుబోయిన వేణుగోపాలకృష్ణ, జయరాం, తానేటి వనిత, కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, శంకరనారాయణ, కురసాల కన్నబాబులను కొనసాగిస్తున్నారు.
Jagan New Cabinet: ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుండి కొత్తగా తెరపైకి కరణం ధర్మశ్రీ పేరు
మంత్రివర్గంలోకి స్థానం సంపాదించుకునే వారిలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుండి ధర్మాస కృష్ణదాసు స్థానంలో ధర్మాన ప్రసాదరావు ఉన్నారు. ఈ జిల్లా నుండి సిదిరి అప్పలరాజును కొనసాగిస్తున్నారు. తమ్మినేని సీతారామ్ ను స్పీకర్ గానే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. విజయనగరం జిల్లా నుండి బొత్స సత్యనారాయణ ను కొనసాగిస్తూ కొత్తగా సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొరను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు. ఈ రెండు జిల్లాల్లో ఇక ఏటువంటి మార్పునకు అవకాశం లేదు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుండి భాగ్యలక్ష్మి, గుడివాడ అమరనాథ్ పేర్లు ముందుగా ప్రచారం జరగ్గా అనూహ్యంగా జరిగిన మార్పు ఏమిటంటే గుడివాడ అమరనాథ్ పేరు పక్కకు వెళ్లి కరణం ధర్మశ్రీ పేరు తెరపైకి వచ్చింది.అందరూ గుడివాడ అమరనాథ్ కే అవకాశం అని భావిస్తుండగా కరణం ధర్మశ్రీ చాన్స్ కొట్టబోతున్నారు.చివరి నిమిషం లో మార్పు జరగకపోతే ధర్మశ్రీ, భాగ్యలక్ష్మిలకు అవకాశం దక్కనుంది. తూర్పు గోదావరి జిల్లా నుండి చెన్నుబోయిన వేణుగోపాలకృష్ణ ను కొనసాగిస్తూ కొత్తగా పి గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాలకు అవకాశం కల్పిస్తున్నారు.
Jagan New Cabinet: కృష్ణాజిల్లా నుండి కొత్తగా రక్షణ నిధి, జోగి రమేష్
పశ్చిమ గోదావరి జిల్లా నుండి ప్రస్తుతానికి ఇద్దరు ఆళ్ల నాని, శ్రీరంగనాధరాజులు మంత్రులుగా ఉన్నారు. వాళ్లు ఇద్దరిని తప్పించి వారి స్థానంలో తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాసరావు వస్తారు అనేది జరుగుతున్న ప్రచారం. కానీ కారుమూరి నాగేశ్వరరావుకు చాన్స్ లేదని తెలుస్తోంది. నర్సాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు కు చాన్స్ ఇస్తున్నట్లు సమాచారం. చివరి క్షణంలో మార్పు జరిగితే యాదవ సామాజికవర్గానికి ఇవాల్సి వస్తే కారుమూరు నాగేశ్వరరావుకు ఇచ్చే అవకాశం ఉంటుంది. కృష్ణాజిల్లా నుండి కొడాలి నానిని కొనసాగిస్తున్నారు. కొత్తగా తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధికి కన్ఫర్మ్ అయ్యింది. అలానే జోగి రమేష్ పేరు ప్రముఖంగా వినబడుతోంది. నిజానికి ఈ జిల్లా నుండి సామినేని ఉదయభాను కు ఇవ్వాల్సి ఉంది. ఆయన పేరు కన్పర్మ్ అయినట్లు గా వార్తలు వచ్చినా నిన్న సాయంత్రం నుండి ఆయన పేరు పక్కకు వెళ్లి జోగి రమేష్ పేరు వచ్చింది. మరో పక్క బీసీ సామాజికవర్గం నుండి జోగి రమేష్ కు ఇవ్వాలా లేక కొలుసు పార్ధసారధికి ఇవ్వాలా అన్న చిన్న కన్ఫూజన్ కూడా ఉంది. చివరి నిమిషంలో దీన్ని ఫైనల్ చేసే అవకాశం ఉంది.
ఆర్కే రోజాకు డిప్యూటి స్పీకర్ లేదా మరేదైనా కేబినెట్ ర్యాంక్
ఇక గుంటూరు జిల్లా వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పేరు కన్పర్మ్ అయ్యింది. తరువాత విడతల రజని, కొనా రఘుపతి లలో ఒకరికి చాన్స్ ఉండవచ్చు. ప్రకాశం జిల్లా నుండి ఆదిమూలపు సురేష్ ను కొనసాగిస్తున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డిని పక్కన బెడుతున్నారు. నెల్లూరు జిల్లా నుండి సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డికి దాదాపు ఫిక్స్ అయ్యింది. చిత్తూరు జిల్లా నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కొనసాగిస్తున్నారు. కొత్తగా ఆర్కే రోజాకు డిప్యూటి స్పీకర్, చీఫ్ విప్ గానీ లేదా మరేదైనా కేబినెట్ ర్యాంక్ పదవి ఇవ్వబోతున్నారు. కడప జిల్లా నుండి అంజాద్ బాషా, రైల్వే కోడూరు ఎమ్మెల్యే కోనుగుంట్ల శ్రీనివాస్ లను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు. కర్నూలు జిల్లా నుండి గుమ్మనూరు జయరాంను కొనసాగిస్తూ కొత్తగా శిల్పా చక్రపాణి రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు. అనంతపురం జిల్లా నుండి శంకరనారాయణను కొనసాగిస్తూ కొత్తగా జొన్నలగడ్డ పద్మావతిని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు. అధికారికంగా ప్రకటించే సమయానికి నాలుగైదు పేర్లలో మార్పులు చేర్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.