Journalist Death: వార్త అత్యంత బలీయమైనది. వ్యవస్థలను శాసించగలదు. ప్రాణాలు నిలబెట్టగలదు. వ్యక్తులను శక్తిమంతులను చేయగలదు. మనసులను మార్చగలదు.. ప్రతి వార్త వెనుక ఒక జర్నలిస్టు ఉంటాడు. ఆ జర్నలిస్టు ఆలోచనలే, ప్రనితీరె వార్తగా బయటకు వస్తుంది.. ఆ వార్తల జర్నలిస్టుకీ కరోనా వస్తుంది. చంపేస్తుంది. కుటుంబాలను రోడ్డున పడేస్తుంది.
* కుమార్ యాదవ్ (31 ) అనే యువకుడు.. ఈనాడులో మూడేళ్ళుగా పని చేస్తున్నారు. కరీమ్ నగర్ లో రిపోర్టర్. అతనికి రెండు వారాలు కిందట కరోనా సోకింది. ప్రభావం ఎక్కువగా చూపించి, ఊపిరి ప్రమాదంలోకి వెళ్ళింది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. 8 రోజులకు రూ. 9 లక్షల వరకు బిల్లు అయింది. చివరికి బిల్లు కట్టే ఓపిక లేకపోవడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడకు వెళ్లిన మరుసటి రోజునే ఆయన మరణించారు. అతనికి ఏడాదిన్నర బాబు ఉన్నారు. డబ్బులు పోయాయి. మనిషి మిగలలేదు. ఆ కుటుంబం అనాధగా మిగిలింది.
* ఈయనే కాదు. తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టుల పరిస్థితి ఈయన ఒక ఉదాహరణ మాత్రమే. ఏపీ, తెలంగాణాలో కలిపి ఈ నెల రోజుల్లో 40 మంది వరకు మరణించి ఉంటారు. ఈ మరణాలపై అధికారిక లెక్కలు ఉండవు.
Journalist Death: ఏపీలో జర్నలిజంపై జగన్ వైఖరి వెరైటీ..!!
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని మీడియా ప్రభావం ఏపీలో ఉంది. ఇక్కడ సీఎంపై మీడియా ఫోకస్ ఎక్కువ ఉంటుంది. అలాగే సీఎంకీ మీడియా ఫోబియా ఉంటుంది. వార్త విలువ బాగా తెలిసిన వ్యక్తి సీఎం జగన్. అందుకే ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రోజునే అదే వేదికపై మీడియాలో వచ్చే వార్తలు విషయంలో తన వైఖరి ఎలా ఉండబోతుంది అనేది చెప్పారు. అయితే ప్రతీ వార్త వెనుక జర్నలిస్టు అనే ఒక వ్యక్తి ఉంటాడని.. ఆ వ్యక్తికి ఒక ప్రాణం.. అతనిపై ఆధారపడి ఒక కుటుంబం ఉంటాయని.. అతనికి కరోనా సోకుతుందని.. ఊపిరి అందకుండా చేస్తుందని.. ప్రాణాలు పట్టుకెళ్లిపోతుందని కూడా జగన్ కి బాగా తెలుసు. * జర్నలిజం గురించి .., జర్నలిస్టు గురించి జగన్ కి తెలిసినంతగా వేరే ఏ సీఎం కీ తెలియదు. ఇదే సందర్భంలో జర్నలిస్టునీ సీఎం జగన్ ఇబ్బంది పెడుతున్నంతగా దేశంలో ఇతర ఏ సీఎం ఇబ్బంది పెట్టలేదు..! పైగా ఏపీ ప్రభుత్వంలో ఉన్న సలహాదారుల్లో కీలకమైన సజ్జల రామకృష్ణ రెడ్డి ఒక జర్నలిస్టు. జీవీడి కృష్ణ మోహన్ ఒక జర్నలిస్టు. మూడు నెలల కిందట రాజీనామా చేసిన వెళ్లిపోయిన మరో సలహాదారు రామచంద్రమూర్తి కూడా ఒక జర్నలిస్టు. ఏపీ క్యాబినెట్ లో మంత్రుల్లో ఇద్దరు జర్నలిస్టులు ఉన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, పేర్ని నాని ఇద్దరూ వార్త గురించీ, ఆ వెనుక జర్నలిస్టు గురించి తెలిసిన వారే. ఏపీలో ఇంతమంది పెద్దలు ఉన్నప్పటికీ ఎంత దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయంటే.. గడిచిన నెల రోజుల్లో 18 మంది జర్నలిస్టులు మరణించారు.
రెండేళ్లుగా గుర్తింపు లేదు.. భరోసా లేదు..!!
జర్నలిస్టుపై మీడియా యాజమాన్యాలు పట్టించుకోవు. కాస్త డెస్కు, జిల్లా స్థాయి అయితే వేతనం, గుర్తింపు కార్డు ఇస్తాయి. కానీ మండల స్థాయి.., పట్టణ స్థాయి జర్నలిస్టులకు మాత్రం మేనేజ్మెంట్ ఏ మాత్రం పట్టింపు ఉండదు. ఏపీలో ప్రభుత్వం కూడా జర్నలిస్టులపై చిన్నచూపుతోనే ఉంది. ఇక్కడ రెండేళ్లుగా జర్నలిస్టులకు ఒక అక్క్రిడేషన్ కార్డు లేదు. ఒక గుర్తింపు లేదు. హెల్త్ కార్డు లేదు. వారి పట్ల కనీస బాధ్యత చూపించడం లేదు. గతంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడూ ఈ పరిస్థితి లేదు. సీఎంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. జర్నలిస్టుల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుని.., వారితో స్నేహంగా ఉండేవారు. తరచూ మీడియా ముఖాముఖి నిర్వహించేవారు. తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు కూడా మీడియా, జర్నలిస్టుల పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకుని, ప్రత్యేక పథకాలు ఇచ్చేవారు. అక్కడ కేసీఆర్ ఒక తరహాలో ఇబ్బంది పెడుతుంటే.. జగన్ అన్ని తరహాలో ఇబ్బంది పెడుతున్నారు. అయితే ఇక్కడ యాజమాన్యాలు కూడా జగన్ ని ఇబ్బంది పెట్టాలను చూడడం కొసమెరుపు. అందుకే జర్నలిస్టులు బలైపోతున్నారు..!