Justice NV Ramana: ఒక ఆకు.. ఆ ఆకుని ఓ పురుగు తింటుంది.. ఆ పురుగుకి ఒక వైరస్ ఎక్కించాడు ఓ మనిషి.. ఫలితంగా ఆ పురుగు ద్వారా ఆకుకి సోకిన వైరస్ మొత్తం చెట్టుకి పాకి, చెట్టు నాశనమవుతుంది.. ఇప్పుడు ఆ చెట్టుని కాపాడాలంటే మనిషిని మార్చాలా..!? ఆ పురుగుని చంపాలా..!? ఆ వైరస్ ని లేకుండా చేయాలా..? ఆ ఆకుని తీసి పారెయ్యాలా..!?
మనిషినే వాడు ఘటికుడు. మారడు. తాను మారినట్టు చూపించి, ప్రత్యామ్నాయ మార్గంలో మళ్ళీ అదే పని చేస్తాడు.. మనిషిని మార్చే ప్రయత్నం చేసే బదులుగా… ఆ పురుగునో, ఆ వైరస్ నో చంపేసి.., ఆ ఆకుని తీసి పారేస్తే చెట్టు భద్రంగానే ఉంటుందిగా..! జస్టిస్ ఎన్వీ రమణ ఇప్పుడు అదే పనిలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. కాకపోతే ఆయన మనిషిని మార్చాలా..? పురుగుని చంపాలా..!? వైరస్ ని లేకుండా చేయాలా..!? ఆకుని పీకి పారెయ్యాలా…? అనే తడబాటులో ఉన్నట్టున్నారు. అర్ధమయ్యే ఉంటుందిగా మనం చెప్పుకుంటున్న అంశం దేని గురించి అనేది.. కాస్త వివరంగా, లోతుగా చూడాల్సిన అంశమే ఇది..!
Justice NV Ramana: రాజకీయ వ్యవస్థలపై.. ఎందుకో తొందర..!?
జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్ని సంచలన కామెంట్లు చేస్తున్నారు. కేసుల విచారణ సందర్భంగా కావచ్చు.., బయట వివిధ వేదికలపై కావచ్చు ఆయన లోతుగా మాట్లాడుతున్నారు. వ్యవస్థల్లో పేరుకున్న లోపాలను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నారు. తన చేతిలో ఉన్న అధికారాలతో కొన్నిటిని గాడిలో పెట్టె ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే.. ఆయన బాటలో ఆదిలోనే ముళ్ళు వస్తున్నాయి. న్యాయవ్యవస్థలకు భయపడి, చెప్పింది చేసి.., పరిపాలనలో కీలకమైన వ్యవస్థలను ఎన్వీ రమణ గాడిలో పెట్టె వీలుంది. కానీ న్యాయ వ్యవస్థని సైతం శాసించాలని చూసే, పెద్ద పెద్ద కుర్చీలనే మార్చేయాలని చూసే రాజకీయ వ్యవస్థలను గాడిలో పెట్టాలంటే మన లాంటి దేశంలో ఓ పాతిక మంది ఎన్వీ రమణలు కావాలి. అందుకే పైన మనం చెప్పుకున్నట్టు మనిషిలాంటి రాజకీయ వ్యవస్థలను మానేసి.., ఆకు, పురుగు, వైరస్ లాంటి పారిపాలన వ్యవస్థ(ఐఏఎస్), నేర శోధన వ్యవస్థ(ఐపీఎస్), మధ్యవర్తి వ్యవస్థ (మీడియా) లను మారిస్తే చాలు. ఈ మూడు న్యాయ వ్యవస్థలకు లొంగి ఉంటాయి. మార్చడం సులువు. ఈ మూడు మారితే ఆటోమేటిక్ గా రాజకీయ వ్యవస్థ ద్వారా జరుగుతున్న తప్పులు చాలా వరకు అదుపులోకి వచ్చేస్తాయి.
గాడిలో పడాల్సిన వ్యవస్థలు ఇవే..!
దేశంలో రాజకీయ అవినీతి అపారం. కానీ ఆ రాజకీయ అవినీతి జరగడానికి కారణం ఐఏఎస్, ఐపీఎస్ లు. వీళ్ళు లేకుంటే.., వీళ్ళు సహకరించకుంటే అవినీతి అనేది జరగదు. సీఎం జగన్ కేసుల్లో చూసుకున్నా.., లాలూ కేసుల్లో చూసుకున్నా.., జయలలిత కేసుల్లో చూసుకున్నా వారితో పాటూ పని చేసిన ఐఏఎస్ లపై కూడా కేసులు నమోదయ్యాయి. అంచేత… డెక్కముక్క తినేసి బలిసిన రాజకీయ వ్యవస్థలను గాడిలో పెట్టాలంటే ముందు ఈ ఐఏఎస్, ఐపీఎస్ లను గాడిలో పెట్టాలి. అది జస్టిస్ ఎన్వీ రమణ లాంటి వారికి చాలా సులువు. సివిల్ సర్వీసెస్ అధికారుల అవినీతికి చాలానే ఉదాహరణలు ఉన్నప్పటికీ వారి శిక్షలకు అనేక అడ్డంకులు ఉన్నాయి. కొన్ని ప్రత్యేక అధికారాలు ఫలితంగా చాలా కేసుల్లో తప్పించుకుంటున్నారు.
* టీడీపీ హయాంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఏబీ వెంకటేశ్వరావు, కృష్ణ కిశోర్ ల అవినీతి ఇంకా నిరూపితం కాలేదు. వారికీ ఉన్న ప్రత్యేక హక్కులతో, కోర్టుల ద్వారా మళ్ళీ హోదాల కోసం పట్టుపడుతున్నారు.
* ఛత్తీస్ ఘర్ సీనియర్ ఐపీఎస్ అధికారి గుర్జేందర్ సింగ్ పై ఆదాయానికి మించి ఆస్తులు, రాజద్రోహం కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విచారణ జస్టిస్ రమణ బెంచీకి వెళ్ళింది.
* గడిచిన పదేళ్లలో దేశ వ్యాప్తంగా దాదాపు 150 మంది సివిల్ సర్వీసెస్ అధికారులపై అవినీతి కేసులు నమోదయ్యాయి. వీటిలో ఎక్కువగా రాజకీయ కోణం, రాజకీయ కారణాలే కనిపిస్తాయి.
* ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో సమర్థులుగా పని చేసిన ఐపీఎస్, ఐఏఎస్ లు పక్కకెళ్ళిపోయారు. భవిష్యత్తులో మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వస్తే ఇప్పుడున్న వాళ్ళు పక్కకెళ్లిపోవచ్చు. అంటే ఇక్కడ పార్టీలకు, రాజకీయాలకు ప్రాధాన్యత తప్పితే సమర్ధతకు లేదు. వారి తప్పులు వీరు, వీరి తప్పులు వారు వెతుక్కునే పనిలో ఐపీఎస్, ఐఏఎస్ లను బలిచేస్తారు. రాజధాని కేసులో చెరుకూరి శ్రీధర్ ని బలిచేసినట్టుగా… అందుకే మార్చాల్సింది, మారాల్సింది ఈ వ్యవస్థే..
“సివిల్ సర్వీసెస్ అధికారులు తప్పులు చేసి జైలుకి వెళ్తే అది భారత రాజ్యాంగానికే అవమానం. కానీ ఆ పరిస్థితికి కారణమూ రాజకీయమే. అందుకే తప్పులు చేయిస్తున్న వారిని, చేస్తున్న వారిని పెట్టుకోవాలంటే.. దానికి సహకరిస్తున్న వ్యవస్థలోనే మార్పులు రావాలి. ఆ కోవలోనే జస్టిస్ రమణ కూడా ఈడీ, సీబీఐ వ్యవస్థల లోపాలపై దృష్టి పెట్టారు. అదే పనిలో పనిగా నిర్ణయాధికారాల్లో ఉన్న సివిల్ సర్వీసెస్ అధికారులపైనా గట్టి దృష్టి పెట్టాలి. అప్పుడే ఆకుని తీసి, వైరస్ పోగొట్టి, పురుగుని చంపి చెట్టుని కాపాడినట్టు..!