మీడియా పై దాడి, మీడియా స్వేచ్ఛ అనే పదాలు చాలా పెద్దవిగా వినిపించడమే కాకుండా రీ–సౌండ్ కూడా ఇస్తూ ఉంటాయి. ఫోర్త్ ఎస్టేట్ అనే బిరుదు కలిగిన మీడియా ఈ రోజుల్లో కొద్దిగా తన ఉనికిని కోల్పోయినప్పటికీ సమాజంలో జరిగే అన్యాయాలను అక్రమాలను వెలుగులోకి తెచ్చి ప్రజలకు మేలు చేకూర్చే సంస్థలు కూడా ఇంకా అక్కడక్కడ ఉన్నాయనే చెప్పాలి. పాలకుల దృష్టికి ప్రజల సమస్యలు తీసుకువెళ్లేందుకు మీడియా ఇప్పటికీ మార్గంగానే పని చేస్తోంది.. ఇంకా మీడియా చూసి పాలకులు ఇంకా భయపడుతూనే ఉన్నారు..ఉండాలి కానీ… ఈ సిస్టమ్ సమర్థవంతంగా అమలు అవుతోందా..?
ముఖ్యంగా ఎక్కడ తప్పు చేస్తే మీడియా ద్వారా నిలదీస్తారో లేదా ప్రజలకు విషయం తెలిసి అభాసుపాలు అవుతామో అని ఆందోళన చెందుతున్న నేతలు చాలామంది ఉన్నారు కానీ ఇప్పుడు సదరు వ్యక్తుల వల్ల మీడియా అంటే ఎంతో భయం ఉండే పెద్ద పెద్ద నాయకులు మాత్రం వారిని చాలా లైట్ తీసుకుంటున్నారు. మీడియా అంటే ప్రస్తుతానికి భయం కాదు కదా కనీసం గౌరవం కూడా లేకుండా పోయింది. ఇక ఇటువంటి సమయంలో అప్పుడప్పుడు మీడియా స్వేచ్ఛ అనే పదాలు వినిపిస్తున్నప్పుడు ప్రజలతోపాటు మీడియా పాత్రికేయులకు కూడా అది కొద్దిగా కామెడీ గా అనిపిస్తుంది.
తమ వద్ద ఉన్న అధికారంతో మీడియా పై దాడులు చేయడం మరియు వారిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం ఇప్పుడు సదరు రాజకీయ పార్టీలకి బాగా అలవాటయిపోయింది. అంతేకాకుండా కొన్ని మీడియా యాజమాన్యాలు అదుపు తప్పడం, పక్షపాతంగా వార్తలు చదవడం, ప్రచురించడం , సామన్యుడిని తప్పుదోవ పట్టించడంతో జర్నలిజానికి, మీడియాకు జనాల్లో ఉన్న గౌరవ మర్యాదలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ నిజాయితీగా ఉన్న మీడియాపై కూడా పడుతోంది. అందుకే వారు చేసిన తప్పుకి వీరు తరచుగా బలి అవుతున్నారు. నిజాయితీగా న్యూస్ ప్రెజెంట్ చేసినప్పుడు పాలకుల ఆగ్రహానికి గురికావడం మరియు అనేక ఇబ్బందులు పడటం జరుగుతూ ఉంటుంది.
అసలు మీడియా అంటే గుర్తొచ్చేది దేన్నీ లెక్కచేయకుండా ఏకధాటిగా ముందుకు దూసుకుపోయే తత్వం. అటువంటి మీడియా కి ఇప్పుడు ఆ స్వేచ్ఛను ఎవరూ కల్పించలేకపోతున్నారు. ఖచ్చితంగా చెప్పాలంటే వారిలో ఎప్పుడూ ప్రవహించే ‘కరెంట్‘ ను తీసి పారేశారు. ఇక మీడియాలో పనిచేసే పాత్రికేయులు కూడా నెలకు జీతం వస్తే చాలు.. చెప్పిన వారికి భజన చేయాలి…. లేదా కావాల్సిన వారు దొరికితే విమర్శించేయాలి అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.
ఇక యాజమాన్యాల అభిపాయమే తమ అభిప్రాయం అన్నట్టుగా ఇప్పుడు జర్నలిస్ట్ లలో ఎక్కువమంది తయారయిపోయారు.ఉన్నది ఉన్నట్టుగా.. కట్టుకథలు అల్లకుండా, ధైర్యంగా చెప్పే జర్నలిస్ట్ లు ఇప్పుడెక్కడ ? ఒక పార్టీకి ప్రయోజనం చేకూర్చేలా మరో పార్టీ మీద బురద జల్లడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్న మీడియా సంస్థలకు … జర్నలిస్టులకు మీడియా స్వేచ్చ అని గొంతెత్తే అర్హత లేనే లేదు. ఇక ప్రజలకు న్యాయంగా, నీతిగా వార్తలే ఇవ్వలేని వారు సందేశాలు ఏం ఇస్తారు చెప్పండి.
Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!