MP RRR: రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ కు వస్తారా అని వైసీపీ ప్రభుత్వం ఎదురుచూస్తోంది..! వైసీపీ నాయకులు కొందరు కూడా ఎదురుచూస్తున్నారు..! ఎందుకంటే.. ఆయన మీద భీమవరం, ఆచంట, నరసాపురం ప్రాంతాల్లో ఇంతకు ముందే కొన్ని కేసులు పెట్టి ఉన్నారు. కొన్ని ఎఫ్ఐఆర్ లు నమోదు అయి ఉన్నాయి. ఆ విషయం రఘురామకృష్ణం రాజుకు తెలుసు. గత ఏడాది మే నేలలో అరెస్టు చేసిన కేసు వేరు. అది రాజద్రోహం కేసు. గతంలో పెట్టిన కేసులు మామూలు కేసులు. అందుకే రఘురామ కృష్ణంరాజు ఆంధ్రప్రదేశ్ కు వస్తే అరెస్టు చేయాలని ఎప్పటి నుండో చూస్తోంది. ఈ రెండు రోజులుగా ఆయన ప్రెస్ మీట్ లో తాను సంక్రాంతి పండుగకు సొంత నియోజకవర్గంకు వెళుతున్నట్లు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వారు ఎక్కడ ఉన్నా సంక్రాంతి పండుగకు ఖచ్చితంగా స్వగ్రామాలకు వెళతారు. ఈ పండుగ వేళల్లో ఆ జిల్లాల్లో కోడిపందాలు, ఆడటం చూడటం ఆనవాయితీ. కోడి పందాల కోసం లక్షలు కూడా ఖర్చు పెడుతుంటారు. కోడి పందాలను గోదావరి జిల్లాల్లో సంప్రదాయక క్రీడగానే భావిస్తుంటారు. భీమవరం, నర్సాపురం ప్రాంతాలు కోడి పందాలకు దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. కోడి పందాలను రఘురామ కృష్ణంరాజు ఆడతారు. అయితే రఘురామ సొంత నియోజకవర్గంకు బయలుదేరడానికి ఢిల్లీ నుండి ఒక రోజు ముందు హైదరాబాద్ కు చేరుకున్నారు. గురువారం భీమవరం బయలుదేరాల్సి ఉండగా ఒక రోజు ముందు ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్ లోని రఘురామ నివాసానికి చేరుకుని నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ నెల 17వ తేదీ విచారణకు హజరుకావాలని నోటీసులు అందజేశారు. ఈ నేపథ్యంలో రఘురామ తన భీమవరం పర్యటనను వాయిదా వేసుకుని రాత్రికి రాత్రి ఢిల్లీ పయనమై వెళ్లారు.
MP RRR: నాడు సుప్రీం కోర్టు ఆదేశాలతో కోడి పందాలు
2012లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కోడిపందాలకు అనుమతి ఇవ్వలేదు. దాంతో రఘురామ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. కోడి పందాలకు అనుమతి ఇవ్వాలి, ఇది మా సంప్రదాయం అంటూ పిటిషన్ వేశారు. మొదట హైకోర్టులో పిటిషన్ ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. దాంతో ఆయన రాత్రికి రాత్రి సుప్రీం కోర్టు లో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. సుప్రీం కోర్టును ఉత్తర్వులు రాకముందే నరసాపురం ప్రాంతంలో కోడి పందాలు మొదలు పెట్టేశారు. బోగి రోజు మధ్యాహ్నం 12 గంటల వరకూ ఆదేశాలు రాలేదు. దాంతో పందాలు ఎవరెవరు ఆడతారో వారిని ఏలూరు ఎస్పీ ఆఫీసులో బైండోవర్ చేశారు. అప్పటి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తదితర పెద్ద పెద్ద నాయకులను ఎస్పీ ఆఫీసులో కూర్చోబెట్టారు. తరువాత సుప్రీం కోర్టు ఆర్డర్ రావడంతో సాయంత్రం 5 గంటల తరవాత కోడి పందాలు నిర్వహించారు. దీనికి ప్రధాన కారణం రఘురామ కృష్ణంరాజు. అప్పట్లో ఆయన కాంగ్రెస్ లో ఉన్నప్పుడే ఇలా చేశారు. గత ఏడాది కరోనా నేపథ్యంలో రాలేకపోవడంతో ఈ సారి ఖచ్చితంగా వస్తాడని భావిస్తున్నారు.
కోడి పందాల్లో పాల్గొంటే అరెస్టు తప్పదా..?
అయితే రఘురామ కృష్ణంరాజు రాష్ట్రానికి వస్తే అరెస్టు చేస్తారా..? చేయారా..? అనే దానిపై సర్వత్రా అనుమానాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ రఘురామ కృష్ణంరాజుపై కొన్ని కేసులు ఉన్నాయి. ఇప్పుడు కోడిపందాలు అడితే ఇంకా చాలా కేసులు నమోదు చేయవచ్చు. జీవహింస చట్టం కింద, ఏపి గేమింగ్ యాక్ట్ కింద, అలానే గ్యాంబ్లింగ్ యాక్ట్ పెడతారు. ఇవన్నీ చిన్న చిన్న కేసులే కానీ వీటితో పాటు డబ్బులతో ఆడితే చీటింగ్ తదితర సెక్షన్ ల కింద కేసులు నమోదు చేస్తుంటారు. ఒక వేళ ఆయన కోడి పందాల్లో పాల్గొంటే సంక్రాంతి పండుగ తరువాత అయినా అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇవన్నీ రఘురామకు తెలియని కావు. ఆయన కు తెలుసు ప్రభుత్వం ఏమి చేస్తుందో..అందుకే ఆయన ముందస్తుగానే తన మీద ఉన్న కేసులపై ముందస్తు బెయిల్ తీసుకుని ఉన్నారు. సంక్రాంతి సందర్భంగా ఆయనపై ఎటువంటి కేసులు నమోదు చేస్తారు అనేది రఘురామకు అవగాహన ఉంటుంది. సో.. ఒక వేళ కోడి పందాలకు సంబంధించి ఏమైనా కేసులు కట్టినా కోర్టుకు పెట్టడానికి ఉండదు. స్టేషన్ బెయిల్ ఇచ్చేవే.
సంక్రాంతి ముచ్చట తీరేటట్లు లేదుగా..?
అయినా సరే ప్రభుత్వం వేరే కేసులు ఏమైనా నమోదు చేస్తే, గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తాజాగా ఫిర్యాదు తీసుకుని అరెస్టు చేస్తే దానికి సంబంధించి కూడా లీగల్ గా ఎదుర్కొనేందుకు ఆయన లీగల్ టీమ్ కూడా నరసాపురం ఆయనతో పాటు వస్తోంది. సంక్రాంతికి కోడి పందాలే కాదు ఇప్పుడు అసలైన పందెం రఘురామ కృష్ణంరాజు, వైసీపీ మధ్య కనబడుతోంది. రఘురామ కృష్ణంరాజును అరెస్టు చేస్తారా..? లేదా..? ప్రభుత్వం పెట్టే కేసుల నుండి, ప్రభుత్వం వేసే వల నుండి రఘురామ కృష్ణంరాజు తప్పించుకుని సక్సెస్పుల్ గా కోడి పందాలు ఆడి మళ్లీ తిరిగి ఢిల్లీకి వెళతారా..? వెళ్లరా..? లేక ఇక్కడే ఉంటారా..? అన్నదే పెద్ద ప్రశ్న. ఇప్పటికే ఆయన రాజీనామా చేస్తాను, ఉప ఎన్నికలకు వెళతాను అని ప్రకటించారు. సంక్రాంతి మూడు రోజులు తన గ్రామంలో సన్నిహితులతో గడపితే అది ఒక తీపి గుర్తుగా ఉంటుంది. రెండు సంవత్సరాల పాటు దూరంగా ఉన్నందుకు ఎంతో కొంత ఫలితం ఉంటుంది.