మీడియాకు సెన్సేషన్ న్యూస్ దొరికితే.. అప్పటివరకూ ఊదరగొట్టేసిన అంశాన్ని పక్కనపెట్టేసి కొత్త వార్తపై విరుచుకుపడిపోవడమే తెలుసా..? ప్రస్తుతం జాతీయస్థాయి మీడియా తీరు చూస్తుంటే ఇది నిజమేనని అనిపిస్తోంది. నాలుగు నెలలుగా సుశాంత్ ఆత్మహత్య, రియా డ్రగ్స్, కంగనా వ్యాఖ్యలు.. ఇలా ఊకదంపుడు వార్తలనే తిప్పితిప్పి కొట్టింది ఈ మీడియా. ఇప్పుడు వారికే విసుగొచ్చిందో.. లేక కొత్త సెన్సేషన్ దొరికింది కదా అనుకున్నారో గానీ.. సుశాంత్, రియా, కంగనాను పక్కన పడేసి కొత్తగా ఏపీ సీఎం జగన్ పై న్యూస్ ను ఎత్తుకున్నారు. ప్రస్తుతం వారి వార్తలు, డిబేట్ లు అన్నీ సుప్రీం జడ్జి రమణపై సీఎం జగన్ చేసిన అభియోగాల గురించే..! ఇదే వారి అజెండా ఇప్పుడు.
జర్నలిస్టులే వార్తా నిర్దేశకులు అయ్యారా..
రిపబ్లిక్, ఆజ్ తక్, ఇండియా టుడే, ఎన్డీటీవీ.. ఇలా ఏ చానెల్ చూసినా ఇప్పటివరకూ వారు గొంతు చించుకుంటూ అరిచిన అరుపులు సుశాంత్ ఆత్మహత్య, రియా డ్రగ్స్, కంగనా ఆఫీస్ కూల్చివేత, బాలీవుడ్ గురించే. ప్రస్తుతం వారి కెమెరా సౌత్ వైపు.. ముఖ్యంగా ఏపీపై పడింది. సుప్రీం జడ్జి రమణపై సీఎం జగన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాయడం ఇప్పుడు జాతీయస్థాయి వార్త అయిపోయింది. ప్రముఖ జర్నలిస్టులు, అనలిస్టులు అయిన రాజ్ దీప్ సర్దేశాయ్, అర్ణబ్ గోస్వామి.. వంటి వారు ప్రస్తుతం ఇదే టాపిక్ పై డిబేట్లు పెడుతున్నారు. ఎవరికి తోచిన న్యూస్, వాదన వారు చేస్తున్నారు. ప్రశాంత్ భూషణ్ వంటి జాతీయస్థాయి న్యాయవాదులు కూడా ఇదే అంశంపై మాట్లాడుతున్నారు.
మీడియా తీరు ఇంతేనా..
సమాజ హితం కోసం కాకుండా సమాజంపై తమ భావజాలాన్ని రుద్దేయడమే నేటి జర్నలిజం అని నిరూపిస్తున్నారు. జగన్ సుప్రీం చీఫ్ జస్టిస్ కు లేఖ రాసిన తర్వాత సుశాంత్ బతికి వచ్చేశాడా, రియా డ్రగ్స్ తీసుకోవడం మానేసిందా, కంగనా ఆఫీస్ ను మహారాష్ట్ర ప్రభుత్వం కట్టి ఇచ్చేసిందా, పోలీసులు.. సీబీఐ తమ విచారణ ఆపేశారా..? మీడియా తీరు చూస్తే సగటు మనిషికి ఇవే ఆలోచనలు రావడం సహజం. చెరుకుగడ పిప్పి అయ్యేంత వరకూ దానిలో రసం తీసినట్టు.. కొత్త హాట్ న్యూస్ దొరికేవరకూ గత అంశాన్ని పీల్చేసి.. ఇప్పుడు కొత్త విషయాన్ని పిప్పి చేయడమే మీడియానా..? అనేది వారికే తెలియాలి.