Nellore Municipality: ఏపిలో బద్వేల్ ఉప ఎన్నిక పూర్తి అయిన వెంటనే మరో కీలకమైన ఎన్నికలకు రంగం సిద్ధం అయ్యింది. రాష్ట్రంలో ఎనిమిది నెలల క్రితమే మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. అయితే సాంకేతిక కారణాలు, గ్రామాల విలీనం తదితర సమస్యల కారణంగా నిలిచిపోయిన 12 మున్సిపాలిటీలకు, ఒక కార్పోరేషన్ కు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. నామినేషన్ల స్వీకరణ కొనసాగుుతోంది. నవంబర్ 15వ తేదీ పోలింగ్ జరుగుతుంది. 17వ తేదీ ఫలితాలను వెల్లడించనున్నారు. ఏయే మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతుందో తెలిసిందే. కాగా నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్ లో రాజకీయ పరిస్థితులు ఏమిటి అనేది గమనిస్తే..!
Nellore Municipality: మంత్రి అనిల్ కుమార్ కి ప్రతిష్టాత్మకం..!!
నెల్లూరు కార్పోరేషన్ ఎన్నిక ఆ జిల్లా మంత్రి అనిల్ కుమార్ కు ప్రతిష్టగా మారింది. మంత్రి అనిల్ కుమార్ పై కొన్ని వర్గాల్లో కొంత అసంతృప్తి ఉంది. సొంత పార్టీ నేతలే ఆయన ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్నారనే టాక్ ఆ జిల్లాలో, సొంత నియోజకవర్గంలో ఉంది. ఈ కారణంగా నెల్లూరు కార్పోరేషన్ ఎన్నికల్లో వైసీపీ కి ఇబ్బందులు తప్పకపోవచ్చు అన్న వార్తలు షికారు చేస్తున్నాయి. ఇక టీడీపీ విషయానికి వస్తే ఆ పార్టీ శ్రేణులు ఇప్పుడిప్పుడే చురుకవుతున్నారు. కాకపోతే నెల్లూరు పట్టణంలో మొదటి నుండి టీడీపీకి పెద్దగా బలం లేదు. 2014 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా చాలా మున్సిపాలిటీలు, కార్పోరేషన్లను టీడీపీ గెలిచినప్పటికీ.., కడప, నెల్లూరు కార్పొరేషన్లు ఓడిపోయింది. నాడు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి బలమైన గాలి వీచినప్పుడు కూడా నెల్లూరులో నాడు కేవలం 17 డివిజన్ లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు అధికార బలం వైసీపీ వైపు ఉంది. మంత్రి ఉన్నారు. సామాజిక బలం ఉంది., అధికార యంత్రాంగం మొత్తం సహకరించడానికి ఉంది. గతంలో 33 డివిజన్ లు వైసీపీకి వచ్చాయి. ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉండటంతో పాటు పై ఫ్యాక్టర్ లు అన్నింటి కారణంగా 33 డివిజన్ ల కంటే ఎక్కువగా వస్తాయని ఆ పార్టీ భావిస్తోంది. క్లీన్ స్పీప్ చేస్తుందని వైసీపీ లెక్కలు వేసుకుంటోంది. అయితే టీడీపీకి మాజీ మంత్రి నారాయణ వచ్చి తిరిగి ప్రచారం చేస్తే కొంత కలిసి రావచ్చు అంటున్నారు.. గతంలో ఆయన చేసిన మంచి పనులు, అభివృద్ధి.. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయినా సానుభూతి కలిసొస్తుందని నమ్ముతున్నారు.. కానీ నారాయణ వచ్చే పరిస్థితి ప్రస్తుతం లేదు.. ఆరు లేదా ఏడూ వార్డుల్లో ఆయన ప్రభావం బాగా పని చేస్తుంది.
Nellore Municipality: ఆ వర్గాల ఓట్లు కీలకం..!
ఇక నెల్లూరు కార్పోరేషన్ లో మొత్తం 54 డివిజన్ లు ఉన్నాయి. వీటిలో క్షేత్ర స్థాయి పరిశీలన, గత ఎన్నికల ఫలితాలను క్రోడీకరించగా అక్కడి పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. మొత్తం 54 డివిజన్ లలో 8 నుండి పది డివిజన్ లలో ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కువ. ఆ డివిజన్లలో అభ్యర్ధుల గెలుపు ఓటములను నిర్దేశించేంది ముస్లిం ఓటర్లే. 26,30,33,,42, 43,47,48,52, 54. డివిజన్ లు అన్ రిజర్వుడ్ అయినా, బీసీలకు రిజర్వుడ్ అయినా ముస్లింలే పోటీ చేసి గెలుస్తుంటారు. ఇక బడుగు బలహీన వర్గాలు (బీసీ) గెలుపు ఓటములను నిర్దేశించి డివిజన్ లు సగం ఉన్నాయి. దాదాపు సగం డివిజన్లలో 25 నుండి 27 డివిజన్ లలో బీసీల ఓటింగ్ ఎక్కువ. ఈ డివిజన్లలో ఎస్సీ ఓటింగ్ ఉన్నప్పటికీ బీసీలే గెలుపు ఓటములను డిసైడ్ చేస్తుంటారు. మరో పక్క కాపు సామాజికవర్గ ఓటర్లు గెలుపు ఓటములను డిసైడ్ చేసే డివిజన్ లు ఏడు ఎనిమిది ఉన్నాయి. ఎస్సీ సామాజికవర్గం డిసైడ్ చేసే డివిజన్ లు అయిదు. రెడ్డి సామాజికవర్గం డిసైడ్ చేసే వార్డులు అయిదు, ఆరు ఉన్నాయి.
గతం ఇలా… ఇప్పుడు ఎలా..!?
2014 లో నెల్లూరు కార్పోరేషన్ ఫలితాలను పరిశీలిస్తే..మొత్తం 54 డివిజన్ లకు గానూ వైసీపీకి 33 డివిజన్లు గెలుచుకుంది. టీడీపీకి 17 డివిజన్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి ఒకటి, బీజేపీకి రెండు, సీపీఎం గెలుచుకున్నాయి. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో టీడీపీ మాత్రం గతంలో కంటే ఎక్కువ డివిజన్ లు కైవశం చేసుకోవాన్న ఆలోచనతో ఉంది. కానీ నామినేషన్ల దగ్గర నుండి పోల్ మేనేజ్ మెంట్ వరకూ అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు, వ్యూహాలకు టీడీపీ తట్టుకుంటుందా అనేది కూడా చూడాలి. వారి అంతర్గత సంభాషణల్లో 20 నుండి 22 వరకూ గెలుస్తామని చెప్పుకుంటున్నారు. ఇక వైసీపీ విషయానికి వస్తే గతంలో 33 డివిజన్ లు గెలిచారు కాబట్టి ఇప్పుడు వారు 45 డివిజన్ లు గెలవాలన్నది లక్ష్యంగా ఉంది. నెల్లూరు జిల్లా రాజకీయం అంటే వైసీపీకి అనుకూలం అనేది అందరికీ తెలిసిందే. 2019 ఎన్నికల్లో జిల్లాలోని అన్ని ఎమ్మెల్యే స్థానాలను వైసీపీ కైవశం చేసుకుని క్లీన్ స్వీప్ చేసింది. నెల్లూరు టౌన్ లోనూ 2014, 2019లో అనిల్ కుమార్ గెలిచారు. అంతకు ముందు 2009లో స్వల్ప ఓట్ల తేడాతోనే అనిల్ కుమార్ ఓడిపోయారు. ఇప్పుడు అనిల్ కుమార్ మంత్రిగా ఉన్నారు.
వైసీపీకి ఇక్కడ అనేక అంశాలు అనుకూలంగా ఉన్నప్పటికీ మంత్రి అనిల్ కుమార్ వైఖరి కారణంగా సొంత పార్టీలోనే వ్యతిరేక వర్గం తయారు అయ్యింది. ఆయన పట్ల అసంతృప్తి వాదులు ఎక్కువగా ఉన్నారు. సీనియర్ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ఆయనతో పడదు. అనం రామనారాయణ రెడ్డి నగరంలో అయిదు ఆరు డివిజన్ లలో ప్రభావితం చేయగలిగే పరిస్థితి ఉంది. ఆయన సహకరించకపోతే ఆ అయిదారు వార్డులు వైసీపీ ఖాతాలోకి రావడం కష్టమే. అలానే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా మంత్రి అనిల్ కుమార్ పై అసంతృప్తిగా ఉన్నారు. ఈ ఎమ్మెల్యే కు కూడా నగరంలో పట్టు ఉంది. ఈ సమస్యలు ఉన్నప్పటికీ మంత్రి అనిల్ కుమార్ అన్నీ అధిగమించి 45 డివిజన్లలను గెలుచుకోవాలన్న లక్ష్యంతో ఉన్నట్లు సమాచారం. ఫలితాలు ఏ విధంగా ఉంటాయో వేచి చూద్దాం.