తప్పులు చేయడం ఒక ఎత్తు.., వాటిని బయటకు రాకుండా దాచుకోవడం మరో ఎత్తు.., ఈ ఎత్తులన్నీ దాటేసి చేసిన తప్పులు బయటకు వస్తే.., వాటిపై అవినీతి కేసులు నమోదైతే… వాటిపై మీడియాలో వార్తలు రాకుండా ఆపేయడం ఇంకో ఎత్తు..! మొదటి రెండు ఎత్తుల్లో విఫలమైన ఓ న్యాయవాది, మూడో ఎత్తులో మాత్రం సఫలమయ్యారు.
తప్పో, ఒప్పో తర్వాత విషయం..!! కానీ భూములు కొంటాం..! ఏసీబీ కేసులు నమోదు చేస్తుంది..! ఈ విషయాలు, వార్తలు మీడియా రాయకూడదు అంటూ పిటిషన్ వేయడం, అనుకూల సంకేతాలు రావడం వెనువెంటనే జరిగిపోయాయి. అదీ ఏపీలో కొత్త పంథా..!! ఇది ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది. ఈ పిటిషన్ ని, ఈ సంకేతాన్ని జాతీయస్థాయిలో మీడియా పెద్దలు, ప్రముఖులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మీడియా గొంతు నొక్కేయడమే, మీడియా స్వేచ్చని హరించడమే అంటూ కామెంట్లు చేస్తున్నారు. “టీడీపీ హయాంలో ఓ కీలక హోదాలో ఉన్న న్యాయవాది అమరావతిలో భూములు కొన్నారు, ఇన్సైడర్ ట్రేడింగ్ లో భాగమయ్యారు, ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసింది. అదే జాబితాలో ఓ న్యాయమూర్తి కుమార్తెలు కూడా ఉన్నారు” అనేది వార్త. దీన్ని ప్రచురించకుండా మీడియా/ సోషల్ మీడియా/ వెబ్ మీడియాని నియంత్రించాలి అంటూ సదరు న్యాయవాది కోర్టుకెళ్లారు. ఆయన అనుకున్నట్టే జరిగింది. ఒకే. అంతా బాగానే ఉంది.
ఈ కేసు ఎవరిది..? పిటిషన్ ఎవరిది..? తీర్పు ఏమిటి అనేది పక్కన పెడితే..!! మీడియా మాట్లాడకూడదు అనేది మాత్రమే ఇక్కడి సారాంశం. సమాజంలో నాలుగో స్తంభంగా ఉన్న మీడియా దారి తప్పితే తప్పి ఉండవచ్చు గాక..! కులం, వర్గం, పార్టీగా విడిపోతే విడిపోవచ్చు గాక.., ఎవరి భజనలు వారు చేసుకుంటూ.., ప్రత్యర్థులపై బురద వేస్తే వేసి ఉండొచ్చు గాక..!! కానీ వార్తలు రాయడం అనే హక్కుకి భంగం కలిగించే హక్కు ఎక్కడిది..? ఒకరు అలా కోరడం.., అందుకు సానుకూల సంకేతాలు రావడమే తెలుగునాట విస్మయమైన వార్త. నచ్చకపోతే విమర్శిస్తారు.., మరీ నచ్చకపోతే కేసు వేస్తారు.., కానీ నాపై వార్తలు రాకుండా ఆపాలి అంటూ కోరడం బహుశా దేశంలో ఇదే మొదటి కేసు అయి ఉండవచ్చు. అదే ఇక్కడ ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం.
అన్నీ మూసేసుకున్న తెలుగు మీడియా..!!
ఈ పిటిషన్ వేయడం.., సానుకూలత రావడం చాలు.. తెలుగు మీడియా ఇక సైలెంట్ అయింది. అదిగో పులి అంటే.., ఇదిగో తోక అన్నట్టు పిటిషన్, పర్యావసానాలకు భయపడి సాక్షి కూడా ఏమి రాయలేదు. ఈనాడు, ఆంధ్ర జ్యోతి ఎలాగైనా రాయవు. కానీ రాసే అవకాశం ఉన్న సాక్షి కూడా చేతులెత్తేసింది. కనీసం పిటిషన్ లో సారాంశాన్ని కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. టివిలు, చానెళ్లు, అన్ని రంగుల మీడియాలు అన్నీ మూసేసుకుని అసలు విషయాన్నీ మర్చిపోయాయి.
పాపం సాక్షి..! కోరలు పీకేసుకుంది..!!
సరే.., తెలుగు మీడియా సంగతి పక్కన పెడితే కేవలం జగన్, వైసీపీ కోసమూ…, టీడీపీని ఆడిపోసుకోవడానికి పుటిన సాక్షి కూడా ఈ విషయంలో చేతులెత్తేసింది. పాపం..! ఈ పిటిషన్, పర్యావసానాలు సాక్షికి అతీ, గతి లేకుండా చేశాయి. ఏం చేయాలో తెలియక కొన్ని అర్ధ రహిత వార్తలు రాసి, ప్రచురించింది. నిన్న సజ్జల ప్రెస్ మీట్ పెట్టి ఈ పిటిషన్, పర్యావసానాలను విమర్శించారు. కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసారు. చివరికి సాక్షి కనీసం ఆ వ్యాఖ్యలను కూడా ప్రచురించలేదు. మార్పులు చేసుకుని, పూర్తిగా టీడీపీ పై చేసిన విమర్శలను మాత్రమే రాసింది. మరీ విడ్డురం ఏమిటంటే.. సజ్జల పిటిషన్ ని, పర్యావసానాలను విమర్శిస్తే.. ఈయన టీడీపీ ని, టీడీపీ పార్టీనే మీడియాని నియంత్రిస్తుంది అని మాట్లాడినట్టు సాక్షిలో రాశారు. బహుశా ఈ పుష్కర కాలంలో సాక్షికి ఇంత జాగ్రత్త పడాల్సిన పరిస్థితి ఇదే మొదటి సారెమో..! అది కూడా అధికారంలో ఉండగాను..!!
జాతీయ స్థాయిలో గళమెత్తిన ప్రముఖులు..!!
ఈ మొత్తం వ్యవహారంపై.., కొందరు జాతీయ మీడియా ప్రముఖులు మాత్రం స్పందించారు. ఇదేమి అన్యాయం ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.. పత్రికా స్వేచ్ఛ, సమాచార హక్కుకు వ్యతిరేకం అంటూ మేధావులు ప్రముఖులు తమ అభిప్రాయాలు చెప్పారు
“సుప్రీంకోర్టు న్యాయమూర్తి వరసలో ఉన్న వ్యక్తి కుమార్తెలు ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడినట్టు కేసు నమోదు కావడమా? భారత న్యాయ వ్యవస్థ ఎక్కడకు వెళ్తోంది?” – వినోద్ కె.జోస్, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, ద కారవాన్..! వాళ్లు మీడియాను నియంత్రిస్తారా అంటూ ధన్యా రాజేంద్రన్, ఎడిటర్ ఇన్ చీఫ్, ద న్యూస్ మినిట్..! “ఈ తీర్పు అసాధారణం. భూ కొనుగోళ్ల కుంభకోణంపై ఏపీ ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను విషయంలో ఇది అసాధారణం. బలవంతులు అన్నింటి నుంచి బయట పడతారు”. – రాహుల్ శివశంకర్, ఎడిటర్ ఇన్ చీఫ్, టైమ్స్ గ్రూప్…!! “న్యాయ స్థానం ఉత్తర్వులను పాటించాల్సిందే. కానీ ఎలాంటి తీవ్ర పరిణామాలకు దారితీస్తాయోనన్నది విస్మయ పరుస్తోంది” – ఉమా సుధీర్, ఎన్డీటీవీ…! “ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి స్థానం లేదు”
– సునీల్జైన్, మేనేజింగ్ ఎడిటర్, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్…! “ఏపీ ఏసీబీ నమోదు చేసిన ఉత్తర్వులు ప్రచురించకూడదు అనడం రాజ్యాంగం కల్పించిన వాక్, పత్రికా స్వేచ్ఛకు విరుద్ధంగా ఉన్నాయి” – ప్రముఖ వార్తా సంస్థ ‘ద వైర్’ కథనం…! “ఈ ఎఫ్ఐఆర్ను తొక్కిపెట్టిన వారే అధికారం చలాయిస్తున్నారు. ఏపీ భూ కుంభకోణాల ఎఫ్ఐఆర్కు నివాళి. మీడియాలో రిపోర్ట్ చేయనివ్వలేదు. దానిపై దర్యాప్తును అడ్డుకున్నారు.” – సిద్ధార్థ్ వరద రాజన్, ఎడిటర్ ఇన్ చీఫ్, ద వైర్…!! ఇలా భిన్నస్థాయి వ్యక్తులు, కొందరు జర్నలిస్టులు స్పందించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?