NTR Bharatha Ratna: తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భాదవ వేడుకల సభలో పార్టీ అధినేత చంద్రబాబు చాలా విషయాలు చెప్పారు. తెలుగుదేశం పార్టీ యువతకు 40 శాతం సీట్లు ఇస్తుందని చెప్పారు. టీడీపీ తెలంగాణలోనూ ఫోకస్ పెడుతున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. యువతకు 40 శాతం ఇవ్వాలన్నది టీడీపీలో కొత్త పాయింటే. కానీ రాష్ట్రంలోని టీడీపీలో యువత ఎక్కడ ఉన్నారు..? రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎంత మంది ఇన్ చార్జిలు యువత ఉన్నారు..? కొత్తగా యువతను ఎక్కడ ప్రోత్సహిస్తున్నారు..? నాయకుల వారసులే యువతనా..? ఇప్పుడు ఉన్న సీనియర్ నాయకుల వారసులు వస్తే వారే యువ నాయకులా..? కొత్త నాయకులు ఎక్కడ ఉన్నారు..? కొత్త వాళ్లకు ఎక్కడ ఇవ్వగలుగుతున్నారు..? అనేది పార్టీ చూసుకోవాలి.
Read More: TDP Youth: 40% యువత కష్టమేగా బాబు..!? టీడీపీలో యువ టెన్షన్స్..!
NTR Bharatha Ratna: భారతరత్న విషయంలో ఒక పొలిటికల్ డ్రామా
తెలంగాణలో ఫోకస్ పెడతామని చెప్పిన చంద్రబాబు అక్కడ అధికార పార్టీని, టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై, కేసిఆర్ పై ఒక్క మాట మాట్లాడలేదు. ఈ విషయాలు ఎలా ఉన్నా ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ కు భారతరత్న విషయంలో ఒక పొలిటికల్ డ్రామా జరుగుతున్నట్లు అర్ధం అవుతోంది. టీడీపీకి కూడా ఈ డ్రామాలో బాధ్యత ఉంది. జనవరి 18న ప్రతి ఏటా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలను పార్టీ నిర్వహిస్తోంది. ప్రతి ఏటా ఆ రోజు టీడీపీ నేతలు ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి అంటూ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులైన పురందేశ్వరి, నందమూరి బాలకృష్ణ, అప్పట్లో హరికృష్ణ, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ లు మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి అంటుంటారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంలోనూ ఇదే డిమాండ్ ను వల్లెవేస్తుంటారు. ఇటువంటి వేడుకల్లో నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ లు ఇదే అంశంపై డిమాండ్ చేస్తూ వస్తున్నారు.
NTR Bharatha Ratna: అప్పుడు ఆమె ఎందుకు అడగలేదు..?
భారతరత్న ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వాన్ని వీళ్లు ఎప్పుడైనా అడిగారా..? 2014 నుండి 2018 వరకూ తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉంది. ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. అప్పుడు వీళ్లు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్రంతో సంప్రదింపులు ఎందుకు చేయలేదు..? అప్పుడు పురందేశ్వరి బీజేపీలో ఉన్నారు. అప్పుడు ఆమె ఎందుకు అడగలేదు..?ఇప్పుడు కూడా పురందేశ్వరి బీజేపీలోనే ఉన్నారు. జాతీయ స్థాయిలోనూ ఆమెకు పదవి ఉంది. ఆమె ఇప్పుడు ఎందుకు కేంద్రాన్ని అడగడం లేదు ? యుపిఏ అధికారంలో ఉన్నప్పుడు ఆమె కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. అప్పుడు తన తండ్రికి భారతరత్న ఇప్పించుకోలేదు. ఎన్టీఆర్ కు భారతరత్న రాకపోవడంలో పూర్తి స్థాయి పాత్ర ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరికీ ఉంది.
తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు సూన్యం
ఎన్టీఆర్ వర్ధంతి లేదా జయంతి రోజున మీడియా కనబడితే ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని అడగడం పరిపాటిగా మారింది. కానీ దానికి సరైన ప్రయత్నం చేయలేదనేది మాత్రం సుస్పష్టం. ఈ డిమాండ్ పై ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఎంపి గల్లా జయదేవ్ మాట్లాడారు తప్ప అంతకు ముందు పార్లమెంట్ లో అగడం గానీ ప్రధాన మంత్రి, రాష్ట్రపతిని కలిసి వినతి పత్రాలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఎన్టీఆర్ కు భారతరత్న అనేది తెలుగుదేశం పార్టీకి ఒక డిమాండ్ గా మాత్రం మిగిలిపోయింది. ఎన్టీఆర్ యుగ పురుషుడు అని కీర్తించడం తప్ప వారు చేస్తున్న ప్రయత్నాలు మాత్రం సూన్యం అని చెప్పవచ్చు.