అమరావతి ఉద్యమం ఏడాది దాటింది..! అందులో నిజమైన రైతుల ఆవేదన వర్ణనాతీతం. అందులో నిజమైన త్యాగధనుల బాధ తీర్చలేనిది..! ఉద్యమం బాగుంది. చక్కగా “సా…గు”తుంది. నిరంతరాయంగా.., నిర్విశ్రాంతంగా.., నిష్కులంగా జరుగుతుంది..! కానీ ఒక్కటే రాష్ట్ర సగటు మనిషి డౌట్..! రాజధాని అంటే రాష్ట్రం మొత్తానికి సంబంధించినది.., కానీ కేవలం అమరావతిలో మాత్రమే ఉద్యమం ఎందుకు జరుగుతుంది..!? అయితే దీనికి సమాధానాలు అందులో కొందరికి.., రాష్ట్ర ప్రభుత్వంలో కొందరికి.., ఒకరకంగా చంద్రబాబుకీ, జగన్ కి కూడా తెలుసు. అందుకే జగన్ సీరియస్ తీసుకోవడం లేదు, చంద్రబాబు ఆపడం లేదు..! ఇక అసలు విషయానికి వస్తే అమరావతిలో “అతి మతి” గురించి ఓ సారి చెప్పుకోవాలి..!
ఒక జస్టిస్ రిటైర్ అయ్యారు. న్యాయ కోవిదులు, సహచరులు, న్యాయవాదులు, సిబ్బంది సత్కరిస్తారు.., పొగుడుతారు.. అది అతి సహజం. కానీ ఈ అమరావతి మహిళలకు ఏం సంబంధం..!? “జస్టిస్ రాకేష్ కుమార్ రిటైర్ సందర్భంగా ఈరోజు అమరావతిలో జరిగిన కొన్ని సన్ని”వేషాలు” కచ్చితంగా అనుమానాలు కలిగించేవే..! “జస్టిస్ రాకేష్ కుమార్ కి అమరావతి రైతులు, మహిళలు ఘనమైన వీడ్కోలు అందించారు. ‘లాంగ్ లీవ్ రాకేష్ కుమార్, గాడ్ ఆఫ్ జస్టిస్ రాకేష్ కుమార’ అంటూ నినాదాలు చేసారు. ఆయన వీడ్కోలు సమయంలో కొందరు మహిళలు కన్నీరు పెట్టుకోగా, వారిని చూసి జస్టిస్ రాకేష్ కుమార్ కూడా భావోద్వేగానికి గురయ్యారు.
జస్టిస్ కి వాళ్లకి ఏంటి సంబంధం..!?
జస్టిస్ రాకేష్ కుమార్ ఏమి అమరావతి కేసులో విచారించలేదు. అమరావతి ఉద్యమానికి అనుకూలంగా తీర్పు ఇవ్వలేదు. అమరావతి ఉద్యమంలో కూర్చోలేదు. వృత్తిపరంగా ఆయన అమరావతి ఉద్యమానికి చేసిందేమి లేదు. కొన్ని సందర్భాల్లో.., కొన్ని కేసుల్లో ఆయన జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు, తీర్పు ఇచ్చారు. అంతే తప్ప అమరావతికి ఆయన చేసిందేమి లేదు. కానీ ఈరోజు అంత సన్నివేశం జరగాల్సిన అవసరం ఏముంది..? మహిళలు ఆయనను చూసి కన్నీరు పెట్టుకోవడం ఏమిటి..? ఆయన భావోద్వేగానికి గురవ్వడం ఏమిటి..? ఒక సినిమాటిక్ గా కొన్ని సీన్స్ సృష్టించి సోషల్ మీడియాల్లో వదలడం ఏమిటి..? అందుకే దీన్ని అతిమతి @ అమరావతి అనుకోవాల్సిందే.
మొదటి నుండి అంతే..!!
అమరావతిలో ఉద్యమం నిజానికి దేశ చరిత్రలో నిలిచిపోవాలి. ఒక అంశం కోసం, ఒక లక్ష్యం కోసం ఏడాదికిపైగా రైతులు, మహిళలు ఉద్యమం చేస్తున్నారంటే దేశ చరిత్రలో లిఖించదగిన పరిణామమే..! కానీ ఉద్యమ తీరు సక్రమంగా లేదు. ఎన్నో కోణాలు, ఎన్నో చిత్రాలు, ఎన్నో వేషాలు, ఎన్నో సినిమాటిక్ డ్రామాలు..! అందుకే దేశం కాదు కదా రాష్ట్రంలో ఇతర ప్రాంతాలు కూడా దీని అంత సీరియస్ గా తీసుకోలేదా. ప్రభుత్వం కూడా లైట్ తీసుకుంటుంది, వైసీపీ నేతలు చులకనగా మాట్లాడుతున్నారు అంటే ఇవే కారణాలు. కేవలం ఒక పార్టీ గొడుగు కింద.. కొందరు నాయకుల డైరెక్షన్లో జరుగుతుంది అంటున్న వైసీపీ ఆరోపణలకు బలాన్నిచ్చేలా ఇటువంటి సినిమాటిక్ డ్రామాలు ఎన్నో ఉన్నాయి. అందుకే అతిమతి @ అమరావతి !!
* రాష్ట్ర కీలక అంశం రాజధాని కోసం ఏడాదిగా జరుగుతున్న ఉద్యమం ఎందుకు రాష్ట్రం మొత్తం పాకలేదు..? ఏడాది పూర్తయిన సందర్భంగానూ సభలో రాజకీయ నేత, రాజకీయ ప్రసంగాలు తప్ప
వారి ఆవేదన, వారి కోరిక, తపన తెలియజేసే ప్రయత్నాలే లేవు.
* కొన్ని బలమైన మీడియా (ఈనాడు – ఈటివి, ఏబీఎన్- ఆంధ్రజ్యోతి, టీవీ 5 ) మద్దతు ఉన్నా కూడా దేశంలో, కనీసం రాష్ట్రంలో పక్క జిల్లాల్లో కూడా మద్దతు ఎందుకు కూడగట్టుకోలేదు. కేవలం టీడీపీ గొడుగు ఉన్న కొందరు నేతలే “అమరావతి పరిరక్షణ సమితి”గా ఏర్పడి నామమాత్రంగా ఇటీవల ర్యాలీలు చేసారు.
* సీఎం జగన్ ఆ దారిలో వెళ్తుంటే ఎందుకు ఛీత్కారాలు ఇవ్వాలి..? జస్టిస్ లు ఆదారిలో వెళ్తుంటే ఎందుకు భజనలు చేయాలి..? రాజ్యాంగ బద్ధమైన కోరికతో ఉద్యమం చేస్తున్నప్పుడు ఈ డ్రామాలు, ఈ అతిమతి ఉపయోగించడం ఎందుకు..? అందుకే ఈరోజే జరిగిన ఘటనలకు అమరావతి ఉద్యమంలో జరుగుతున్నా అతికి, జస్టిస్ కూడా సాక్ష్యం.