ఎనకటికి ఊర్లో గెలవలేనమ్మ ఎక్కడెక్కడో ఊరేగి ఎగిరిందట..! అలాగే ఇప్పుడు మన పీకే పరిస్థితి తయారయింది. ఈ పీకేకి దేశమంతటా ఉన్న ఖ్యాతి సొంత రాష్ట్రంలో లేకపోయింది..!? లాజిక్కులు, మ్యాజిక్కులు ఆలోచించే ఈ పేద్ద నేతలు ఓ చిన్న లాజిక్కు మర్చిపోయి పీకేకి పెద్దపీట వేస్తున్నారు..! (ఇక్కడ మనం చెప్పుకుంటున్న పీకే అంటే పవన్ కళ్యాణ్ అయితే కాదు అర్ధమయ్యే ఉంటుంది)..!
సీట్లు.., ఓట్లు శాసిస్తూ.., సీఎంలను గెలిపిస్తున్న బిల్డప్ కొడుతున్నది ఎవరు..? రాజకీయాల్ని లాజిక్కులతో మార్చేస్తూ.., ఎన్నికలకు ముందే డబ్బు పనులు చేయిస్తున్నది ఎవరు..? రాజకీయాల్లో పాతుకుపోయిన కులాలు, మతాలు, ప్రాంతాలను బలహీనతలుగా వాడుకుంటున్నది ఎవరు..? ఎన్నికల స్ట్రాటజీ పేరు పెట్టుకుని వందల కోట్ల కార్పొరేట్ వ్యాపారం చేస్తున్నది ఎవరు..? పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్..!! ఆ మహానుభావుడైన పీకే.., తన సొంత రాష్ట్రం బీహార్ లో ఎందుకు చక్రం తిప్పలేదు. తన శత్రువులను ఎందుకు ఓడించలేదు. తన శత్రువుల, శత్రువులతో ఎందుకు చేతులు కలపలేదు..!? కనీసం వారిని ఎందుకు గెలిపించలేదు..!?
పీకే X నితీష్ అయిదేళ్లుగా..!!
నితీష్ కుమార్ కి పీకే మాంచి సన్నిహితుడు. ఒక రకంగా పీకేనే తన రాజకీయ వారసుడు అంటూ నితీష్ చెప్పేసారు కూడా. కానీ.. 2017 నుండి ఈ ఇద్దరికీ బాగా చెడింది. అప్పటి వరకు బీజేపీతో కూడా అంటుకుంటూ తిరిగిన పీకే (2014 లో మోడీకి స్ట్రాటజిస్టు).. 2017 నుండి దూరమయ్యారు. కేంద్రం తీసుకువచ్చిన కొన్ని బిల్లులను వ్యతిరేకిస్తూ.. ముఖ్యంగా CAA బిల్లుని తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పటికే బీజేపీతో బంధం ఆరంభించిన నితీష్ కుమార్, ఈ పీకేని పార్టీ నుండి పీకేశారు. నాటి నుండి ఈ ఇద్దరు రాజకీయ శత్రువులుగా మారిపోయారు. అలా బీహార్ లో పీకే రాజకీయ ప్రస్థానం మలుపులు తిరిగింది.
రాజకీయ యాపారం సొంత రాష్ట్రంలో ఎందుకు లేదు..!!
పీకే ఫక్తు రాజకీయ వ్యాపారి. రాజకీయాన్ని వ్యాపారంగా చూసే నేతలను చూసాం కానీ.., రాజకీయంతో వ్యాపారం చేసే ఇటువంటి పీకీలు అరుదుగా ఉంటారు. అందుకే ఆయనకు అంత క్రేజు. ఏపీలో జగన్ గెలుపు.., ఢిల్లీలో కేజ్రీవాల్ గెలుపుతో పీకే ఖ్యాతి జాతీయానికి చేరింది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో మమతకు పని చేస్తున్నారు. అక్కడి వరకు బాగానే ఉంది.., కానీ ఈ పీకే తన సొంత రాష్ట్రంలో ఎందుకు రాజకీయ వ్యాపారం చేయలేదు. కనీసం రాజకీయం కూడా చేయలేదు. తన శత్రువులను ఓడించలేదు. ఓడించే స్ట్రాటజీలు కూడా వేయలేదు. వారి ప్రత్యర్థులతో చేతులు కలపలేదు. అన్నదే ప్రశ్న..!?
* బీహార్ లో ఎంజీబీకి.., ఆర్జెడీకి మొన్నటి ఎన్నికలు చావోరేవో అనే పరిస్థితిలో ఉన్నాయి. కానీ ఓడిపోయారు. ఈ పార్టీలకు ప్రశాంత్ కిషోర్ సహకరించి.., నితీష్, బీజేపీ ఓటమికి పని చేయాల్సింది కదా..!? ఒకవేళ ఆ పార్టీలు ఆహ్వానించకపోయినా..? ఈ పీకేనే స్వయంగా వెళ్లి, మాట్లాడి ఓడించే ప్రణాళికలు వేయాల్సింది..!
* అసలు పీకే సొంత రాష్ట్రంలో ఎందుకు ఎన్నికలను పట్టించుకోలేదు. అసలు ట్విష్టు ఏమిటంటే..? ఎన్నికలకు ముందు నాలుగు నెలల నుండి ఈ పీకే వారు కనీసం తన రాష్ట్ర రాజకీయంపై ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. కనీసం తన అభిప్రాయాన్ని కూడా చెప్పలేదు.
* జాతీయస్థాయిలో ఖ్యాతి పొందిన ఒక రాజకీయం వ్యాపారి.. తన సొంత రాష్ట్రంలో రాజకీయమూ చేయలేదు.. వ్యాపారమూ చేయలేదు. కానీ ఇతర రాష్ట్రాల్లో మాత్రం తన బుర్రతో శాసిస్తున్నాడు. వహ్వా ఏం బీహారివయ్యా..!? తనకు రాజకీయ కాంట్రాక్టులిస్తున్న నాయకులకు కూడా ఈ డౌటు ఎందుకు రాలేదో..!?