Ramoji Rao: దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాజ్యాంగ వ్యవస్థలు పలచన పడుతున్నాయి.. బలహీన పడుతున్నాయి.. ప్రాభవం కోల్పోతున్నాయి.. అయితే అది స్పష్టంగా బయటకు చూసేది, కనిపించేది కాదు.. బీజేపీ చేయాల్సింది అంతా చాలా రహస్యంగా, చాలా సైలెంట్ గా, చాలా జాగ్రత్తగా, చాలా పకడ్బందీగా ఆ ద్వయం నరేంద్ర మోడీ, అమిత్ షా చేసుకెళ్లిపోతున్నారు.. వాళ్ల సంస్కరణల పేరిట చాలా వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో కొన్ని ప్రజలకు మంచి చేస్తే, కొన్ని చేటు చేశాయి. ముఖ్యంగా వ్యవస్థలను చేతిలో పెట్టుకోవడం ద్వారా శాసిస్తున్నారు. ఇప్పుడు దేశంలో ఉన్న అత్యున్నత వ్యవస్థల్లో ఒకటి న్యాయవ్యవస్థ.. అది ఇప్పుడు దేశంలో ఎలా ఉందో అందరికీ తెలుసు. అమిత్ షాకు ఎన్ని కేసుల్లో క్లీన్ చిట్ వచ్చిందో తెలుసు. గోద్రా అల్లర్ల కేసులో మోడీకి క్లీన్ చిట్. ఇకపోతే గవర్నర్ల వ్యవస్థ. అది కూడా బీజేపీ చేతిలోనే ఉంది. కొన్ని రాష్ట్రాల్లో రాత్రికి రాత్రి సీఎంలను మార్చేసిన ఘనత బీజేపీ మూటగట్టుకుంది. వచ్చే ఎన్నికల సమయానికి కొన్ని ఆర్ధిక శక్తులను, మీడియా శక్తులను గుప్పిట్లో పెట్టుకోవాలనేది బీజేపీ యోచన.. అందుకు కొన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేసినట్టు సమాచారం..!
Ramoji Rao: ఫార్మా లొంగిపోయింది.. ఎన్నికలకు సమకూరుస్తుంది..!?
“హెటేరో డ్రగ్స్ బ్లాక్ మనీ వ్యవహారం ఉంది కదా.. రెండు మూడు రోజులు నుండి వార్తల్లో హాట్ టాపిక్ గా ఉంది. రెమిడిస్విర్ మందు తయారీ, అమ్మాకాల్లో బాగా పేరు వినిపించి ఆస్తులు కూడబెట్టుకున్న ఫార్మా దిగ్గజ కంపెనీ హెటిరో. దేశంలోనే ధనవంతుల జాబితాలో టాప్ ఫైలో హెటిరో పార్థసారధి పేరు ఉంటుంది. ఆ కంపెనీ మీద నాలుగైదు రోజుల నుండి ఐటీ సోదాలు జరిగాయి. దాదాపుగా రూ. 550 కోట్లు లిక్విడ్ క్యాష్ దొరికిందని వార్తలు వస్తున్నా అధికారికంగా మాత్రం సుమారు రూ. 140 కోట్లకుపైగా దొరికాయని చెబుతున్నారు. దీనిపై ఐటీ శాఖ కేసు నమోదు చేసింది, ఆయనను ఆరెస్టు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే అనేక వ్యవస్థల మీద ఆధిపత్యంతో కార్పోరేట్ శక్తులు బీజేపీకి దాసోహం అయ్యాయి. అంబానీ, ఆదానీ, ధమానీ వీరందరూ బీజేపీకి దాసోహంగా ఉన్నట్లు తెలుస్తూనే ఉంది కదా. ఇక దేశంలో అత్యంత అవినీతి వ్యవస్థ, కార్పోరేట్ వ్యవస్థ, ధనిక వ్యవస్థ గా ఉన్న ఫార్మా రంగం రెండు సంవత్సరాల నుండి బాగా బలపడుతోంది.
దేశంలో కరోనా వచ్చినప్పటి నుండి బాగా పుంజుకుంటుంది, బాగా సంపాదించుకుంటున్నది ఫార్మా రంగం మాత్రమే. సామాన్య, మధ్యతరగతి వర్గాలలో అనేక మంది సంవత్సరాల తరబడి కూడబెట్టుకున్న డబ్బును కూడా కరోనా కాలంలో వైద్యానికి, మందులకు ఖర్చు పెట్టేశారు. అందుకే ఇప్పుడు ఫార్మా రంగంపై కేంద్ర బీజేపీ కన్నుపడింది. కేంద్రం దృష్టి అంటే రాజకీయంగా వాళ్లను ఎలా వాడుకోవాలి అన్నదాని మీద. ఇప్పుడు ఫార్మా కంపెనీలపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా హెటిరో పై రైడ్స్ చేశాయి. ఫార్మా అంటే హెటిరో ఒక్కటే కాదు రెడ్డీస్, అరబిందో ఇంకా ఏ కంపెనీ అయినా దాసోహం అవ్వాల్సిందే. వీళ్ల దగ్గరే పెద్ద ఎత్తున బ్లాక్ మనీ ఉంటుంది. అనేక లొసుగులు, లోపాలు, తప్పుడు లావాదేవీలు ఉంటాయి. అందుకే వీళ్లు దాసోహం అవ్వాల్సిందే. దానిలో భాగంగా ఇప్పుడు హెటిరో డ్రగ్స్ లో లెక్కల్లో లేని ధనం చాలా బయటకు వచ్చింది. వీళ్ల మీద కేసు పెట్టారు కాబట్టి వీరు కశ్చితంగా బీజేపీ పెద్దల వద్దకు వెళతారు. వీళ్ల ప్రయోజనం వీళ్లది, వాళ్ల రాజకీయ ప్రయోజనం వాళ్లది. ఏదో అక్కడ జరిగిపోతుంది.
రామోజీపై అలా గురి పెట్టారా..!?
ఫార్మా రంగంలో దేశ వ్యాప్తంగా ప్రముఖంగా వినిపిస్తు పేర్లలో భారత్ బయోటెక్ ఒకటి. కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన దేశీయ సంస్థగా భారత్ బయోటెక్ ఉంది. కోవ్యాగ్జిన్ ఉత్పత్తి చేసి దేశంలో పెద్ద ఎత్తున పంపిణీ చేసింది. దేశంలో ఇప్పటి వరకూ 95 కోట్ల మందికి వ్యాక్సిన్ వేస్తే అందులో 30 నుండి 35 కోట్ల వరకూ కోవ్యాగ్జిన్ ఇచ్చారు. అందే దాదాపు 35 నుండి 40 శాతం కోవ్యాగ్జిన్ టీకాలు పంపిణీ చేస్తున్నారు. ఇన్ని కోట్ల వ్యాక్సిన్ లు ఇచ్చారు కాబట్టి ఎంత సంపాదించి ఉండాలి..? ఎంత అమ్ముడుపోయి ఉండాలి..? వాళ్లు వ్యాక్సిన్ తయారీకి ఎంత ఖర్చు పెట్టారు..? ఎంతకు విక్రయించారు? ఎంత లాభాన్ని ఆర్జించారు..? అనే దానిపై ఐటీ చూపు ఉంటుంది కదా. ఐటీ నిఘా కళ్లు ఇప్పుడు భారత్ బయోటెక్ మీద ఉంటాయి. ఆ భారత్ బయోటెక్ ఎవరిదో అందరికీ తెలుసుకదా. ఈనాడు గ్రూపు అధినేత రామోజీరావు కుమారుడు కిరణ్ వియ్యంకుడిది. భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎళ్ల కుమారుడికి రామోజీ మనుమరాలిని ఇచ్చారు. దీనిలో రామోజీ సంస్థల పెట్టుబడులు కూడా ఉన్నట్టు బహిరంగ రహస్యమే.. కరోనా నేపథ్యంలో మీడియా రంగం దెబ్బతినడంతో ఫార్మా రంగంపై దృష్టి పెట్టారని అంటున్నారు. ఐటీ చూపు ఉందని వాళ్లకు తెలిసి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, వాళ్లు వస్తే ఎక్కడైనా తప్పుడు లెక్కలను బయటకు తీయగలుగుతారు. దీని ద్వారా కేంద్రంలోని బీజేపీ వీళ్లను టార్గెట్ చేస్తే రాబోయే ఎన్నికల నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ పెద్ద మీడియా తమ అదుపులోకి తీసుకున్నట్లు అవుతుంది. ఇప్పటికే దేశంలో అనేక మీడియా సంస్థలు బీజేపీకి దాసోహంగానే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వైసీపీకి, టీడీపీకి అనుకూల మీడియాలే ఉన్నాయి కానీ కాషాయం పులుముకున్న పత్రికలు లేవు. సో..భారత్ బయోటెక్ ను అదుపులోకి పెట్టుకోవడం ద్వారా ఆ మీడియా సంస్థను తమ పార్టీకి అనుకూలంగా మరల్చుకోవడానికి కేంద్ర బీజేపీ ఆలోచనగా ఉందని భొగట్టా.