రామోజీ… మీడియా మొఘల్… వేలకోట్ల సామ్రాజ్య అధిపతి… వందల ఎకరాల ఫిలిం సిటీకి అధినేత.. అనేక వ్యాపారాల సృష్టికర్త… తెలుగు మీడియాకు ఒక పెద్ద దిక్కు… తెలుగు దేశం పార్టీకి వెన్నుదన్ను… ఆ సామజిక వర్గానికి బ్రాండ్ అంబాసిడర్… ఇంకా ఎన్నెన్నో చెప్పుకోవచ్చు. ఇన్ని ఉన్న రామోజీ ఎన్నడూ ఓటమి చూడలేదు. కానీ తొలిసారిగా ఆయన ఓటమి వైపు వెళ్తున్నారు. ప్రింట్ మీడియా పని అయిపోతుందని ముందే గ్రహించిన రామోజీ మూడేళ్ళ కిందటే ఈటివి భారత్ కి సన్నాహాలు చేసారు. కానీ ఇది పోటీని తట్టుకోలేక ఆయన పెద్దన్న పాత్రకి గండి పెట్టింది. గడిచిన నాలుగు దశాబ్దాలుగా కనకపు సింహాసనం దిగని రామోజీ కి ఇప్పుడు వరుస నష్టాలు, ఓటములు, ఒత్తిళ్లు అన్నీ చుట్టుముట్టాయి. అన్నిటికీ మించి తన సామ్రాజ్యానికి సరైన వారసులు లేకపోవడం తనను బాగా ఇబ్బంది పెడుతోంది. ఈనాడు.., మార్గదర్శి సహా అన్నిటా ఇప్పుడు నష్టాలు రామోజీ కోటకు పగుళ్లిస్తున్నాయి. ఇది ఆషామాషీ విషయం కాదు, లెక్కలు, ఆధారాలు, మూలాలు చుస్తే అదే కనిపిస్తుంది.
తిరోగమనంలో ఈనాడు…!
రామోజీకి 25 రకాల వ్యాపారాలు ఉంటె ఉండొచ్చు గాక. కానీ ఆయనను సామ్రాట్ గా చేసింది మాత్రం ఈనాడే. ఆయనకు తెలుగునాట తిరుగులేని వ్యక్తిగా, జాతీయస్థాయిలో గుర్తింపునిచ్చింది ఈనాడే. అటువంటి ఈనాడు ఎన్నడూ లేని స్థితిలో ఇప్పుడు తిరోగమనంలో ఉంది. కరోనాకి ముందే ప్రింట్ మీడియా పని అయిపొయింది అనుకుంటూ ఉండగా, కరోనా వారి నెత్తిన పిడుగు వేసింది. కరోనా రాక ముందు ఆరునెలల్లో లక్ష కాపీలు సర్క్యులేషన్ కోల్పోయిన ఈనాడు కరోనా వచ్చిన తర్వాత మరో అయిదు లక్షలు కోల్పోయింది. ఇలా ఈనాడు తనకు పోటీనే లేదు అనుకునే దశ నుండి సాక్షి పైకి ఎదుగుతుంటే చూస్తూ దిగులు పడుతుంది. పోనీ యాడ్లు ద్వారా నెట్టుకొద్దామంటే అదీ లేదు. నెలకు రూ. 200 కోట్ల వరకు యాడ్స్ ఆదాయం రావాల్సింది, ఇప్పుడు కనీసం పాతిక కోట్లు కూడా లేదు. పత్రికకు ప్రధానమైన సర్క్యులేషన్, యాడ్స్ లేకపోతే ఇక నడపడం కష్టమే. అందుకే ఏ ఇబ్బంది లేకుండా జగన్ కు, కేసీఆర్ కి, బిజెపి కి భజనలు చేస్తూ నెట్టుకొస్తున్నారు. జగన్ భజనకు కాస్త పార్టీ, సామజిక అభిమానం అడ్డు వస్తున్నా వ్యాపార రీత్యా తప్పడం లేదు.
ఉద్యోగుల తొలగింపునకు సై…!
సాధారణంగా ఓటమి అంగీకరించని రామోజీ.., కింద పడినా పైకి లేచే రామోజీ… ఈనాడు విషయంలో చేతులెత్తేశారు. ఉన్న సర్క్యులేషన్ ని కాపాడుకుని…, యాడ్స్ తీసుకుని… ఉద్యోగులను సగం మందిని పంపించేసి… పరిమితంగా నడపాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఈనాడులో భారీ కసరత్తులు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు నెలల కిందట 107 మంది ఉద్యోగులను ఇంటికి పంపించేశారు. యాడ్స్, సర్క్యులేషన్ విభాగాల్లో క్షేత్రస్థాయిలో పని చేసే సిబ్బందిని దీర్ఘ కాళికా సెలవు పెట్టేయమన్నారు. ఎప్పుడు రావాలో చెప్తాము అన్నారు. దాదాపు 1200 మందికి ఉద్వాసనలో భాగంగా మొదట సెలవు పెట్టి పంపించేశారు. ఇక డెస్కుల్లో పని చేసే వారిపై కసరత్తులు మొదలయ్యాయి. జిల్లా ఎడిషన్లు లేకపోవడంతో డెస్కుల్లో ఉండే సిబ్బందిని సగానికి పరిమితం చేయనున్నారు. ఈ నెలాఖరు నాటికి 400 మంది సబ్ఎడిటర్లను పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇలా అన్ని విభాగాల నుండి దాదాపు 2 వేల మందిని తొలగించి నెలకు రూ. 150 కోట్ల వరకు ఖర్చులు మిగుల్చుకుని… జిల్లా ప్రింటింగ్ యూనిట్లలో ఉన్న మేషన్లు ఒకటి అమ్మేసి… కాస్త కుదుటపడాలని ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇది రామోజీ మానస పుత్రిక ఈనాడు పత్రిక పరిస్థితి. దీన్ని ఓర్చుకోలేని కొందరు ఉద్యోగులు కోర్టు పోరాటాలకు, నేరుగా పోరాటాలకు సిద్ధమవుతున్నారు. కానీ రామోజీ దగ్గర అవేమి చెల్లవని వారికీ తెలుసు.
ఇతర వ్యాపారాలు చిక్కుల్లోనే…!
రామోజీకి ఈనాడు కాకుండా మార్గదర్శి, ప్రియా పచ్చళ్ళు, డాల్ఫీన్ హోటళ్లు, కళాంజలి వస్త్ర వ్యాపారం.., ఈటీవి , ఈటివి భరత్… ఇలా దాదాపు 24 రకాల ఇతర వ్యాపారాలు ఉన్నాయి. అన్నిటి కంటే ముఖ్యంగా ఈనాడు పోతే పోయింది.. మీడియాలో తన పెద్దన్న పాత్ర కాపాడుకునే క్రమంలో ఈటివి భారత్ రామోజీ పెట్టారు. కానీ ఇది పోటీని తట్టుకోలేక చేతులెత్తేసింది. దీన్ని అందరికీ అలవాటు చేసే క్రమంలో తమకు గ్రౌండ్ లెవెల్లో పని చేసే ఫ్రీ లాన్స్ కంట్రిబ్యూటర్లకు ఒక ఫోన్ లో యాప్ ఇన్స్టాల్ చేయిస్తే రూ. పది పారితోషికం అంటూ ప్రకటించారు. దీంతో పోటీ పడిమరీ పని చేసారు. లక్షన్నర మందికి ఇంస్టాల్ చేయించారు. కానీ వార్తలు నచ్చక, వేరే యాప్ లు పోటీ ఉండడంతో చాల మంది మళ్ళీ తీసేసారు. ఇది ఊహించని ఈనాడు పెద్దలు కంగుతిన్నారు.
* ఈనాడు, ఈటీవి భారత్ పరిస్థితి అలా ఉంటె…. ప్రియా పచ్చళ్ళు కూడా సరైన పర్యవేక్షణ లేక రూ. వందల కోట్ల నష్టాల్లో ఉన్నాయి. దీంతో తన ముద్దుల కోడలు, మంచి వ్యాపార నేర్పరి మార్గదర్శి ఎండీ శైలజ కిరణ్ కి ప్రియా పచ్చడి బాధ్యత అప్పగించారు.
* మార్గదర్శి ప్రస్తుతం కోలుకున్నప్పటికీ… ఈ కేసుని మళ్ళీ తోడేందుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. ఇదే జరిగితే రామోజీకి రూ. 6 వేల కోట్ల వరకు వ్యాపార చిక్కులు వస్తాయని అంటున్నారు.
* కళాంజలి వస్త్ర వ్యాపారం, డాల్ఫీన్ హోటళ్లు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అందుకే ఇక రామోజీకి , ఆయన కుటుంబాన్ని, వారసత్వాన్ని నిలబెట్టాల్సింది ఫిలిం సిటీ, ఈటీవీ మాత్రమే. ఇవి బాగుంటే వాళ్ళు సామ్రాజ్యం బాగుంటుంది, లేకుంటే మరో సత్యం తరహా గెలిచి ఓడిన కథకు ఇది ఉదాహరణగా మారుతుంది.
Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!