Ramoji Rao: తెలుగు మీడియాలో గానీ, తెలుగు రాజకీయాల్లో గానీ రామోజీరావు అంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మీడియా మోఘల్ అని ఆయనను గౌరవంగా సంభోధిస్తుంటారు. జాతీయ స్థాయిలోనూ ఆయనకు మీడియా పరంగా మంచి స్థానం ఉంది. పైగా ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం పద్మ విభూషన్ పురస్కారాన్ని ఇచ్చింది. అంతటి పెద్దాయన ఈ మద్య కాలంలో దిగజారుతున్నారు. ఆయనకు ఆయన తన ప్రతిష్టను దిగజార్చుకుంటున్నారు. వాస్తవానికి ఆ పెద్దాయనను విమర్శించాలన్నది ఇక్కడ ఉద్దేశం కాదు. కానీ ప్రస్తుతం ఆయన ప్రవర్తనలో మార్పును న్యూస్ ఆర్బిట్ పాఠకుల ముందు ఉంచుతోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఇటీవల కల్వకుంట్ల కవిత ఎన్నికైయ్యారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని రామోజీ ఆమెకు అభినందనలు తెలియజేస్తూ లేఖ రాశారు.
Ramoji Rao: కవితకే అభినందన లేఖ
ఇటీవల అటు తెలంగాణలో, ఇటు ఆంధ్ర ప్రదేశ్ లో ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ అయ్యాయి. అటు టీఆర్ఎస్,. ఇటు వైసీపీ నేతలు ఏకగ్రీవంగా ఎమ్మెల్సీలుగా ఎన్నికైయ్యారు. అయితే తెలంగాణలో ఆరుగురు ఎమ్మెల్సీలు ఎన్నికైతే ఏ ఒక్కరికీ రామోజీ లేఖలు రాయలేదు. కానీ సీఎం కేసిఆర్ కుమార్తె అయిన కల్వకుంట్ల కవితకు మాత్రం రామోజీ లేఖ రాసి అభినందనలు తెలియజేశారు. ఆరు నెలల క్రితం కేటిఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కూడా ఆయనకు రామోజీ శుభాకాంక్షలు తెలియజేస్తూ లేఖ రాశారు. కేటిఆర్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని రామోజీ ఆకాంక్షిస్తూ లేఖ రాశారు. మీ నాయకత్వ లక్షణాలు జాతీయ స్థాయిలో ఆదర్శవంతమని కితాబు కూడా ఇచ్చారు. ఆ రోజు కేటిఆర్ కు రాసిన లేఖలో ఇలా బిస్కెట్ లు బాగానే వేశారని విమర్శలు వచ్చాయి. ఈనాడు సంస్థలు, రామోజీ ఫిలిమ్ సిటీ ఇలా అనేక పెద్ద వ్యాపార సామ్రాజ్య అధిపతి అయిన ఆయన తన స్థాయిని తగ్గించుకుని ముఖ్యమంత్రి కుమారుడు, కుమార్తెలకు అభినందనలు, శుభాకాంక్షల లేఖలు రాస్తూ బిస్కెట్ లు వేయడంపై తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
టీఆర్ఎస్ సర్కార్ కాలు దువ్వకుండా ఉండాలనే..?
85 సంవత్సరాల వయస్సు కల్గిన రామోజీ తను తల్చుకుంటే కేంద్రంలో పెద్ద పెద్ద పదవులను అధిష్టించే అవకాశం ఉంది. అటువంటి ప్రముఖుడు తెలంగాణలో ఉన్న తన వ్యాపార సామ్రాజ్యం జోలికి టీఆర్ఎస్ సర్కార్ కాలు దువ్వకుండా ఉండాలనే ఇలా వారిని ప్రసన్నం చేసుకునేందుకు తాపత్రయపడుతున్నారని ఆయన ప్రత్యర్ధులు విమర్శిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రామోజీ ఫిలిమ్ సిటీలో అసైన్డ్ భూములు ఉన్నాయని ఆరోపణలు చేసిన టీఆర్ఎస్ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ భూముల్లో లక్ష నాగళ్లతో దున్నిస్తామని కూడా హెచ్చరించారు. ఆ తరువాత ఏమి జరిగిందో ఏమో కానీ ప్రభుత్వం జోలికి వీళ్లు పోలేదు. వీరి జోలికి వాళ్లు రాలేదు.