అనగనగా ఓ రాజ్యం..! ఆ రాజ్యాన్ని పాలిస్తున్న మహారాజుకి మంచి పేరుంది. స్త్రీల విషయంలో శ్రీరామ చంద్రుడిగానూ కీర్తి ఉంది…! అటువంటి రాజు కింద ఉండే సామంత రాజులు అలాగే ఉండాలని రాసి పెట్టి లేదుగా..! అందుకే కొన్ని చోట్ల సామంత రాజులు బరి తెగిస్తున్నారు. అలాగే ఓ సామంత రాజు మరింత తెగించి, విలువలు మరిచి, రాజరికానికే మచ్చ తెచ్చాడు..! ఆ కథే, ఈ కథ..!!
అనగనగా ఓ సామంత రాజు..! ఆయన కష్టపడ్డారు. అంచెలంచెలు పైకెక్కి ఓ ఉప రాజ్యానికి సామంత రాజుగా ఎదిగారు. కానీ సామంత రాజు కుర్చీ దక్కిన తర్వాత ఆ కళ్ళు నెత్తికెక్కాయి. ఆ రాచరికం స్థాయి మరిచింది. పాలన దారి తప్పింది. ఆ సామంత రాజు కళ్ళు స్త్రీలపై పడ్డాయి. స్త్రీ అంటే దేవతామూర్తిగా భావించే సమాజంలో ఉన్నామన్న ఇంగితం మర్చిపోయేలా చేశాయి. కుటుంబ విలువలు, మానవతా విలువలు లెక్కచేయకుండా చేశాయి. ఆ సామంత రాజు చీకటి బాగోతాలు కారణంగా ఆ మహారాజుకి మచ్చ వచ్చేలా ఉంది. ఇంతకూ ఆ సామంత రాజు ఏం చేశారో చెప్పుకుందామా..!!
ఆ ఉప రాజ్యం పేరు అంతఃపురం అనుకుందాం..! సామంతరాజు సుగంధాల చంద్రుడు అనుకుందాం..! ఆయన స్త్రీ లోలుడు. తాను మనువాడిన పట్టపురాణిని కాదనుకున్నాడు. శారీరకంగా, మానసికంగా వేధించాడు. ఆమె ఎన్ని పిర్యాదులు చేసినా.. సామంత రాజు కదా ఎవరూ పట్టించుకునే వారు కాదు. దీంతో అదే అలుసుగా భావించిన సామంతరాజు మరింత చెలరేగిపోయాడు.
* తన వద్ద రాచరికం శిక్షణ పొందిన ఓ స్త్రీని తన పట్టపురాణిగా చేసుకోవాలని ఆమె భర్తతో విడాకులు ఇప్పించాడు. కానీ చేసుకోలేదు. కొన్నాళ్ళు కలిసున్నాడు. పక్కన పెట్టాడు.
* తనతో పాటూ రాచరికం శిక్షణ పొందిన మరో స్త్రీనికి పట్టపురాణిగా చేసుకోవాలనుకున్నారు. ఆమెను లోబరుచుకున్నాడు. ఏకంగా తన అంతఃపురంలోనే అనధికార చీకటి కాపురం పెట్టేసాడు.
* ఈ సామంతరాజు గారి దగ్గరకు ఎవరైనా స్త్రీలు వస్తే రాజుగారి చూపులు మారిపోతాయి. అర్ధరాత్రి వేళ రాజుగారు లెక్కలు పుస్తకాలు తీసుకురావాలంటూ మహిళలను ఆదేశిస్తారు. అలా… ఆ సామంత రాజు తనివితీరా.., తనువుతీరా తీర్చుకునేవాడు. మహిళలు అంటే ఏ మాత్రం గౌరవం, భయం, భక్తి, కనీసం మర్యాద లేకుండా సామంత రాజుగా గడిపేస్తున్నాడు.
మహారాజు ఏం చేస్తారో..!!
ఆ మహారాజు ఇప్పుడిప్పుడే గద్దెనెక్కారు. చాలా కాలం శత్రువులతో పోరాడి, ప్రజాభిమానం చూరగొని కుర్చీ అధిష్టించారు. సుదీర్ఘకాలం అదే కుర్చీలో ఉండాలి అనుకుంటున్నారు. అందుకే కోరినా, కొరకపోయినా ప్రజలకు వరాలిస్తున్నారు. తనతో పాటూ తన మంత్రులు, ఉప రాజ్యాల్లో తన సామంతరాజులు చక్కగా పని చేయాలి అనుకుంటున్నారు. అటువంటి మహారాజు దగ్గర ఈ ఉపరాజ్యంలో సామంత రాజు చేసిన చీకటి పనులు ఇప్పుడు బహిర్గతమయ్యాయి. తన రహస్య విభాగం ద్వారా రాజుగారికి సమాచారం అందింది. తాజాగా ఓ పావురం ద్వారా సందేశం అందింది. మరి ఇప్పుడు ఈ మహారాజు ఏం చేస్తారు. రాజ్యంలో మరింత మంది సుగంధాల చర్యలు లేకుండా ఉండాలంటే ఇది ఇక్కడితో ఆగాలి. మరి చూద్దాం మహారాజు గారి స్పందన ఎలా ఉంటుందో..!!
(కథ అయిపొయింది. ఇక్కడ ఓ పెద్ద అనుమానం రావచ్చు. అంతఃపురానికి, అనంతపురానికి సంబంధం ఏమిటీ అనీ…?? ఏపీకి, అనంతపురానికి లింకు ఏంటి..? సీఎంకీ, కలెక్టర్లకు లింకు ఏంటి..? అర్ధం చేసుకున్నోళ్లకు చేసుకున్నంత..?!)
Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!