చెప్పడానికి మాటలు రావు. తొణుకుతయ్ ..! చదవడానికి కళ్ళు సహకరించవు. కన్నీటిని చిలకరిస్తయ్..! రాయడానికి చేతులు రావు. వణుకుతయ్..!! ఒక మహా గాయకుడు, తన కంఠంతో కోట్లాది మంది మదిలో గూడుకట్టుకున్న మహా మనిషి ఎస్పీ బాలు మరణం భారతీయ గేయ లోకం మర్చిపోలేదు. తెలుగు ప్రజానీకం జీర్ణించుకోలేదు..! ఈ మరణం చుట్టూ ప్రశ్నలు లేవు. కరోనా వచ్చింది, ఆరోగ్యం క్షీణించింది. సో.., మరణించారు..! కానీ.., బాలుకి కరోనా ఎలా సోకింది..? ఎక్కడ, ఎవరి వలన సోకింది..? అనేదే ప్రశ్న. “కరోనా అన్ లాక్ వచ్చిన వెంటనే.., ఇండోర్ షూటింగ్ ఆరంభించిన ఆ టీవీ పెద్దలు ఉన్నారా లేదా..? అనేది ఈ కథనంలో లోతుగా చూద్దాం. ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ అంటే ఆ టీవీలో ఈరోజు బాలు పాల్గొన్న కీలక ఎపిసోడ్ ప్రసారం అవుతుంది..!! నెటిజన్స్ కూడా “మీ చావుకి కారణమైన ప్రాగ్రాం” అంటూ కామెంట్లు పెడుతున్నారు..!
ఈటీవీ అంటే ఫక్తు కమర్షియల్. ఆ టీవీ పెద్దలు పెద్ద వ్యాపారస్తులు. తమకు ఏది లాభమో.. అదే చేస్తారు. ఎంతమంది, ఎలా మునిగిపోయిన పర్వాలేదు. అందుకే కరోనా అన్ లాక్ వచ్చిన వెంటనే ఇండోర్ షూటింగ్ ఆరంభించేసారు. కానీ “కరోనాని ఎదుర్కొనే ఒక నిబంధనలను (న్యూ నార్మల్ ఎస్ఓపి)” రూపొందించుకుని, అమలు చేయలేదు అనేది మాత్రం స్పష్టం. కొన్ని నామమాత్రపు సాధారణ విధానాలు మాత్రమే తీసుకున్నారు. బాలు గారికి కరోనా ఈటీవి స్టూడియోలో వచ్చింది. ఈటీవి కార్యక్రమం షూటింగ్ లో వచ్చింది. రామోజీ ఫిలిం సిటీలో వచ్చింది”..! కానీ అక్కడున్నది రామోజీ.., తెలుగు దిగ్గజం, మీడియాధిపతి. ఒక పెద్ద స్థంభం. అందుకే ఏం మాట్లాడితే ఏం వివాదం అవుతుందో అని అందరూ సైలెంట్ అయ్యారు.., కానీ..!!
“సామజవరగమనా” షూటింగ్ లోనే కరోనా…!?
ఆ మధ్య ఎస్పీ బాలు గారి మరణం తర్వాత ఈటీవీ కార్యక్రమం షూటింగ్ సందర్భంగానే బాలుకి కరోనా సోకింది అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలొచ్చాయి. ఏమో.. అవి నిజమో కాదో.. అని జనం కూడా పెద్దగా ఆలోచించలేదు. కానీ దీనికి సంబంధించిన కొన్ని అప్ డేట్స్ ఈ రెండు రోజుల్లో బయటకు వస్తున్నాయి. “సామజవరగమనా” ఈటీవీకి ప్రతిష్టాత్మక కార్యక్రమం. పాడుతా తీయగా, స్వరాభిషేకం తరహాలోనే “సామజవరగమనా” కూడా ఈటీవీ స్టార్ట్ చేసింది. దీనిలో శంకర్ మహదేవన్, బాలు, సునీత, మనో, మాళవిక వంటి అనేక సింగర్లతో స్టార్ట్ చేసింది. కానీ.. ఇక్కడ ఈటీవీ (రామోజీ) అతి తెలివి కమర్షియల్ బుర్రకి కొన్ని తట్టి… బాలు మరణం వెనుక తామే అనే పేరు తప్పుకోవాలని చూసింది.
* “సామజవరగమనా” కార్యక్రమం షూటింగ్ జులై 30, 31 న బాలు గారితో జరిగింది. దీనిలో అనేక మంది సింగర్లు, సంగీత కళాకారులు పాల్గొన్నారు. ఆగస్ట్ 1 న బాలు సింగర్ మాళవికకి ఫోన్ కి “నేను అలసిపోయాను, రెండు రోజుల షూటింగ్” అని చెప్పారు. ఆగస్ట్ 5 న బాలుకి కరోనా సోకినట్టు ఆయనే స్వయంగా ఒక వీడియో సందేశం బయటకు విడుదల చేసారు.
* “సామజవరగమనా” షూటింగ్ సమయంలో కరోనా అన్ లాక్ ఉండడం ఈటీవికి మంచి అంశమే. కాకపోతే కరోనా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదు. ఒకే మైక్, ఒకే స్టేజీ, ఒకే పాటల పేపర్ ఉండడం.., పక్కపక్కనే ఒక పోడియంపై ఇద్దరు పాడడం.., పక్కనే ఎక్కువగా సిబ్బంది ఉండడం.., ఇవన్నీ కరోనా సమయంలో ఉండాల్సినవి కాదు. కానీ ఆ షూటింగ్ లో అలాగే జరిగింది కాబట్టే అనేక మందికి కరోనా సోకింది అనేది తర్వాత వార్తలు వచ్చాయి.
* ఈటీవి ఏ కార్యక్రమం మొదలు పెట్టినా అది బాలుతోనే మొదలవుతుంది. అది కాంట్రాక్టు. ఈటివి సంస్థలు – ఎస్పీ బాలుకి మధ్య ఒక అగ్రిమెంట్ అది. నిజానికి ఇది ఇద్దరికీ మంచి చేసింది. సింగర్ గా బాలుకి సెకండ్ లైఫ్ ఇవ్వగా.., మంచి సంగీత కార్యక్రమం గా ఈటీవిని ఓ స్థాయిలో నిలబెట్టింది. ఇప్పటికీ పాడుతా తీయగా, స్వరాభిషేకం వంటి కార్యక్రామాలు యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ వస్తుంటాయి.
“సామజవరగమనా” అనే కార్యక్రమం కూడా మొదట బాలుతోనే ప్రారంభించాలని ఈటీవీ పెద్దలు అనుకున్నారు. అందుకే జులై 30 న షూటింగ్ చేసారు. కానీ అప్పటికే అక్కడ చాల మందికి కరోనా సోకిందన్న విషయం గ్రహించలేదు. తద్వారా బాలుకి కూడా కరోనా సోకింది. అనంతరం బాలు మృత్యువుతో పోరాడి, పోరాడి సెప్టెంబర్ 25 న మరణించారు.
* ఇక్కడ ఈటీవీ తెలివిగా ఏం చేసిందంటే..? బాలుతోనే మొదటి ఎపిసోడ్ స్టార్ట్ చేయాలనుకున్న ఈటివి.. బాలు కరోనాతో చావు బతుకుల మధ్య ఉండడంతో.., తమ వల్లనే కరోనా సోకింది అనే ప్రచారం అప్పటికే ఉండడంతో సెప్టెంబర్ 20 న మొదటి ఎపిసోడ్ ని “శంకర్ మహదేవన్” తో రిలీజ్ చేసేసింది. అలా కొందరి సింగర్లు అయిన తర్వాత 9 , 10 ఎపిసోడ్లుగా బాలు గారి పాటలు విడుదల చేసింది. అంటే.. ముందే బాలు పాటలు, కార్యక్రమం టెలికాస్ట్ చేస్తే.. “ఈటీవీ లో షూటింగ్ కారణంగా బాలుగారికి కరోనా సోకింది” అనే ప్రచారం నిజం అనుకుంటారేమో అని భయపడి.., కొన్నాళ్ళు ఆగి.. బాలు మరణం గురించి మరచిపోతున్న సమయంలో తమ కమర్షియల్ బుర్రని ప్రయోగించి ఇప్పుడు టెలికాస్ట్ చేస్తుంది. లేకపోతే బాలు గారి చివరి ప్రాగ్రాం అంటూ కమర్షియల్ గా ఉపయోగించుకునేదీ… కానీ అప్పటికే జనాలకు ఈటీవీ స్టూడియోలోనే బాలుగారికి కరోనా అనే డౌటు రావడంతో ఈ మాత్రం జాగ్రత్తలు తీసుకుంది.
ఈ కార్యక్రమం పై సింగర్ మాళవిక ఏమన్నారో చుడండి..!!
బాలు గారికి కరోనా సోకడం.., తన వల్లనే అని ఆరోపణలు రావడంతో సింగర్ మాళవిక ఒక వీడియోలో ఇలా స్పందించారు. “జులై 30 , 31 న రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరిగింది. బాలు గారు పాల్గొన్నారు. ఆగస్ట్ 1 న బాలు గారు “బాగా అలసిపోయాను” అని మెసేజ్ చేశారు. ఆగస్ట్ 5 న కరోనా వచ్చింది. “సామజవరగమనా” షూటింగ్ లో పాల్గొన్న కొంతమంది సంగీత కళాకారులకు కూడా కరోనా వచ్చింది అని నాకు తెలిసింది” అని చెప్పారు.
ఇక్కడ ఈటీవీ- రామోజీ చేసిందేమిటి..!?
ఒకటి మాత్రం నిజం. బాలు మరణం కరోనా కారణంగానే. బాలు మరణానికి ఈటీవి, రామోజీరావు మాత్రమే కారణం అనడం నైతికత కాదు. అది మా ఉద్దేశం కాదు. కానీ.., ఈ షూటింగ్ సందర్భంగా ఈటివి (రామోజీ) చేసిన కొన్ని తప్పులు మాత్రం చెప్పుకోవాల్సిందే. కరోనా అన్ లాక్ లో ఇండోర్ షూటింగ్ టైం లో షూటింగ్ కి అనుమతులు వచ్చినప్పటికీ.. కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. పాటల షూటింగ్ అంటే చుట్టూ అనేక మంది ఉంటారు. దీనికి సంబంధించి ఒక నిబధనల పట్టిక, సూచీ” రూపొందించుకోలేదు. అందుకే ఆ కార్యక్రమంలో అనేక మందికి కరోనా సోకింది. కరోనా సమయంలో పూర్తిగా అద్దాల భవనంలో ఉన్న రామోజీ ఎవ్వరికీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఆయన కుటుంబం కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ తన సిబ్బంది పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. కనీసం కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇవ్వలేదు. కరోనా సోకినా వారికి సెలవులు కూడా ఇవ్వలేదు. అలాగే.. ఈ క్రమంలో తన టీవీ కార్యక్రమాలు ఆగకుండా, అందర్నీ పిలిపించి షూటింగులు చేసేసారు. అదిగో అదే “ఆ స్వార్ధ కమర్షియల్” కోణమే బాలుకి కరోనాకి కారణం అయింది, ఆయన్ను బలితీసుకుంది..!!