రాజకీయానికి మీడియాకి దగ్గరి సంబంధాలుంటాయి..! మీడియాలో రాజకీయాలుంటాయి. రాజకీయంలో మీడియా ఉంటుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం. మీడియా వలన ఎదిగిన రాజకీయ నాయకులు కంటే.., చెడిపోయిన రాజకీయ నాయకులే ఎక్కువగా ఉన్నారు..! ప్రస్తుతం టీడీపీతో ఏబీఎన్/ ఈనాడు/ టీవీ 5 వంటి సంస్థలు దోస్తీ చేస్తుండగా.., జగన్ తో సాక్షి ఉంది. సాక్షి వలన జగన్ వచ్చిన ప్రయోజనం ఏమి లేదు. జగన్ తన ఛరిష్మా, అధికారాలతో దాన్ని పోషించాలి. అలాగే ఏబీఎన్ వలన చంద్రబాబుకి వచ్చిన లాభం ఏమి లేదు. పైగా అన్నిట్లో దూరి, తప్పుడు రాతలు రాసి టీడీపీకి నష్టం చేస్తున్నాడు రాధాకృష్ణ..!!
“ఈ రాధాకృష్ణ దిక్కులేని రాతలతో మైండ్ పోతుంది. మా బాబుగారికి చెప్పినా వినడు. రాధాకృష్ణ తెలిసి తెలిసి పార్టీకి నష్టం చేస్తున్నాడు. అన్నిట్లో వేలు పెట్టేసి తప్పులు రాసేస్తాడు. ఢిల్లీలో అమిత షా – జగన్ భేటీలో వాస్తవాలు కప్పేసి, మా పార్టీ భజన వార్తలు రాసాడు. దాని వలన మాకు యూజ్ ఏమి లేకపోగా.., నష్టం జరుగుతుంది” – ఇదీ ఆంధ్రజ్యోతి రాతలపై “న్యూస్ ఆర్బిట్” వద్ద ఓ టీడీపీ ఎమ్మెల్యే ఆవేదన.
ఇదిగో పిచ్చి రాతలు..!!
“జగన్ ని మోడీ ఎందుకు పిలిపించాడు..? ఈ ఇద్దరి భేటీ ఎందుకు జరుగుతుంది..? ఇది తెలియక పెద్ద పెద్ద నాయకులు, జర్నలిస్టులు తలలు పట్టుకుంటున్న వేళ ఈ ఆంధ్రజ్యోతి లో మాత్రం “జీఎస్టీ బకాయిలు ఇవ్వలేము అని బీజేపీ యేతర సీఎంలను బుజ్జగించే ప్రయత్నాల్లో జగన్ ని మోడీ పిలిపించాడట” ఇదీ జ్యోతిలో రాసింది. పాపం..! పిచ్చి జనాలు అదే చదివేసి అదే నిజమనుకునే ధోరణికి వెళ్తే.. “మరి మమతా బెనర్జీని, కేజ్రీవాల్ ని, నవీన్ పట్నాయక్ నీ, కేసీఆర్ ని ఎందుకు వదిలేసినట్టు” అని లోలోపల ప్రశ్నించుకుంటున్నారు. జగన్ ని చులకన చేసే క్రమంలో రాధాకృష్ణ రాసె రాతలు ఇవి. అక్కడ జరిగే నిజాలు వేరు. సంభాషణలు వేరు, ఇక్కడ ఆర్కే రాసేవి వేరు. జగన్ ని చులకన చేసి, టీడీపీని ప్రసన్నం చేసుకునే ఉద్దేశాలు తప్ప ఇంకేం ఉండదు.
అమిత్ షాతో భేటీ వార్త తప్పు దారిన..!!
ఈరోజు మాత్రమే కాదు. ఇటీవల జగన్ వెళ్లి అమిత్ షాని రెండు సార్లు కలిశారు. ఒక్కరోజు వ్యవధిలో రెండు సార్లు కలిసి చాల టైం చర్చించుకున్నారు. దీనిపై రాధాకృష్ణ “జగన్ ని అమిత్ షా తిట్టాడు. క్లాస్ తీసుకున్నాడు. న్యాయవ్యవస్థపై ఏంటి దాడులు చేషిస్తున్నావ్. హిందూ దేవాలయాలపై దాడులు ఏంటి..? నీకేమైనా బుద్ధి, జ్ఞానం ఉందా..? అంటూ అమిత్ షా వీరావేశంతో జగన్ ని క్లాస్ పీకేసినట్టు ఆర్కే వారు రాశారు. కానీ అక్కడ జరిగిన భేటీ వేరు. జగన్ – అమిత్ షాల మధ్య జరిగిన చర్చ వేరు, జాతీయ మీడియా చెప్పింది వేరు. ఎన్డీఏలో జగన్ చేరికపై కీలక చర్చలు జరుగుతున్నాయి. కానీ ఆర్కే తన పత్రికలో మాత్రం జగన్ ని చులకన చేస్తూ.., టీడీపీకి నచ్చినట్టు రాసుకున్నారు.
పాఠకులకు నచ్చేది వార్తా..? నిజమే వార్తా..??
ఇంతకూ ఏది వార్త..? ఏది రాయాలి..? ఇప్పుడు తెలుగునాట మీడియాలు ఇది తెలుసుకోలేకపోతున్నాయి. ఏ వార్త.., ఎలా రాయాలి.., నిజాలు ఎంత మేరకు రాయాలి..? అనేది వదిలేసి… తమ పాఠకులకు, తమ కులస్తులకు, తమ మద్దతు పార్టీ వాళ్లకి నచ్చితే చాలు అదే వార్త అనుకున్న స్థాయికి దిగజారిపోయారు. “పాఠకులకు నచ్చినా, నచ్చకపోయినా నిజం రాస్తేనే వార్త. నిజం రాసి, దాన్ని విశ్లేషించి, దాని పర్యవసానాలు చెప్తేనే వార్త. అదే నిజమైన జర్నలిజం. కానీ ఇప్పుడు తెలుగునాట ఆంధ్రజ్యోతి, సాక్షి, ఈనాడు పత్రికలు పూర్తిగా మర్చిపోయాయి. తమ వర్గాలకు నచ్చేలా రాసుకుంటూ, నిజాలను దారితప్పిస్తున్నాయి. దాని వలన ఆ పార్టీలకే నష్టం అని గ్రహించలేకపోతున్నారు. “అంతా బాగుంది. జగన్ పథకాలు భేష్ అంటూ సాక్షి రాయడం వలన ఉపయోగం ఏంటి..? జగన్ పథకాలు భేష్, అంతా బాగుంది అనేది జగన్ ఆటోమేటిక్ గా ఫీల్ అవ్వాలి..!? అప్పుడు వాళ్లే స్వయంగా ఓటేస్తారు. జగన్ ని నెత్తిన పెట్టుకుంటారు.” కానీ సాక్షి ఇటువంటి రాతలు ఆపదు. ఉత్తుత్తి డప్పు కొడితే వచ్చేది ఏమి ఉండదు..!!