TDP Janasena: పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కీలక వ్యాఖ్యలు టీడీపీలో ఒక రకమైన ఆశ, ఒక రకమైన ఆందోళన కల్గిస్తోంది. జనసేన – టీడీపీ పొత్తు ఉంటే ఎటువంటి సమస్యలు వస్తాయి..? మద్యలో బీజేపీ దూరితో జరిగే నష్టం ఏమిటి..? అనే విషయాలను పరిశీలిస్తే.. పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక శక్తులను ఏకం చేస్తామని అన్నారు. వైసీపీ వ్యతిరేక పార్టీ అంటే ప్రధానంగా టీడీపీ, జనసేన. ఇక బీజేపీ, వామపక్షాలు చిన్నచిన్న పార్టీలే. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీల్చనివ్వను అంటే టీడీపీతో జనసేన పొత్తుకు ఆయనకు సుముఖంగా ఉన్నట్లే లెక్క. జనసేన క్యాడర్ మాత్రం వాళ్ల వాస్తవ క్షేత్ర స్థాయి బలాన్ని అంగీకరించరు. పవన్ కళ్యాణ్ యే సీఎం, జనసేన అధికారంలోకి వస్తుందని అని భావిస్తుంటారు.
TDP Janasena: పార్టీ క్యాడర్ తో సమస్యలు
టీడీపీకి వాళ్ల బలం ఏమిటో తెలుసు. 14 సంవత్సరాలు అదికారంలో ఉన్న పార్టీ. సంస్థాగతంగా నిర్మాణంలో ఉన్న పార్టీ. పొత్తులో భాగంగా 25 – 30 సీట్లు తీసుకుని జనసేన పోటీ చేస్తే.. వీళ్ల వల్ల వాళ్లు, వాళ్ల వల్ల వీళ్లు కొన్నిచూట్ల గెలవచ్చు. కొన్ని చూట్ల ఓడిపోవచ్చు. దీంతో మా పార్టీ వల్లే మీరు గెలిచారు. మీకు అంత బలం లేదు, మీకు ప్రతి నియోజకవర్గంలో 20వేలు, 25వేలు ఓట్లు కంటే ఎక్కువ వచ్చే శక్తి లేదు అని అంటారు. పార్టీ క్యాడర్ లో ఈ సమస్యలు ఎదురవుతుంటాయి. జనసేన సోషల్ మీడియా, జనసేన అనుకూల వర్గాల నుండి పవన్ కళ్యాణ్ యే సీఎం అంటూ ప్రతిపాదన రెడీ అవుతోంది. పవన్ కళ్యాణ్ కు సీఎం ఇస్తామంటేనే పొత్తు పెట్టుకుంటారని అంటుంటారు. వాస్తవానికి జనసేనకు అంత సత్తా ఉందా.. ? అన్ని నియోజకవర్గాల్లో బలం ఉందా..? దాదాపు 25 నియోజకవర్గాల్లో జనసేన ప్రభావితమైన పార్టీ. జనసేన సోషల్ మీడియాలో టీడీపీని బాగా బ్లేమ్ చేసేలా పోస్టులు పెడుతుంటారు. టీడీపీ కౌంటర్లు ఇస్తుంటుంది. ఇది ఒక తలనొప్పి అంశం కాగా..
TDP Janasena: ఆ నియోజకవర్గాల్లో బీసీలు వ్యతిరేకం
జనసేన వల్ల టీడీపీకి 25 నుండి 30 నియోజకవర్గాల్లో ప్లస్ అవుతోంది. అదే సందర్భంలో జనసేన – టీడీపీ పొత్తు వల్ల కొన్ని నియోజకవర్గాల్లో నెగిటివ్ కూడా ఉంటుంది. 8 నుండి పది నియోజకవర్గాల్లో నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. కాపు సామాజికవర్గ ప్రభావం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో కొంత మంది బీసీలు టీడీపీకి గానీ జనసేనకు ఓటు వేయడానికి ఇష్టపడకపోవచ్చు. మరో పక్క పవన్ కళ్యాణ్ బీజేపీ రోడ్డు మ్యాప్ అన్నారు అంటే ఆ పార్టీతోనూ పొత్తు కొనసాగుతుందన్నట్లుగా చెప్పారు. అంటే జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేయాలన్నది పవన్ ఆలోచనగా కనబడుతోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి వారితో తెగతెంపులు చేసుకోకుండా టీడీపీతో కలిసి పోటీ చేయాలన్నది ఆయన భావనగా ఉంది.
TDP Janasena: మైనార్టీ ముస్లిం ప్రభావిత నియోజకవర్గాల్లోనూ..
ఇదే జరిగే ముస్లింలు ప్రభావితంగా ఉన్న 15 నుండి 20 నియోజకవర్గాల్లో టీడీపీ ఆ ఓటు బ్యాంక్ కోల్పోతుంది. ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉన్న కడప, కర్నూలు జిల్లాలలో పది నియోజకవర్గాలు, ఇతర ప్రాంతాల్లో 8 నుండి పది నియోజకవర్గాల్లో ఆ వర్గాల ఓట్లు దూరం అవుతాయి. దాదాపు 18 నుండి 20 నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు గెలుపు ఓటములను ప్రభావితం చేసే పరిస్థితి ఉంది. ఈ నియోజకవర్గాల్లో టీడీపీకి మైనస్ తప్పదు. మతతత్వ పార్టీగా ఉన్న బీజేపీని ముస్లిం మైనార్టీలు వ్యతిరేకిస్తారు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ వర్గాల్లో సీఎం జగన్మోహనరెడ్డి బలమైన నాయకుడుగా ఉన్నారు. ఆ వర్గాల్లో వైసీపీకి మంచి పట్టు ఉంది. ఆ నియోజకవర్గాల్లో వైసీపీ పట్టు తగ్గించి టీడీపీ గెలవాలంటే బీజేపీతో పొత్తు ఉంటే సాధ్యం కాదు. బీజేపీ వీళ్లతో కలవడం వల్ల నష్టం తప్పదు.
TDP Janasena: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం
బీజేపీ పొత్తు కారణంగా ముస్లిం మైనార్టీ ఓట్లు కోల్పోవడమే కాక, విశాఖలోనూ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్న నేపథ్యంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని టీడీపీ, జనసేన విశాఖ ప్రాంతంలో ప్రజల్లోకి వెళితే వారు ఓట్లు వేస్తారా..రాష్ట్రంలో బీజేపీకి అనుకూలత కంటే ప్రతికూలత ఎక్కువగా ఉంది. ఆ ప్రతికూలత ప్రభావం జనసేన – టీడీపీ పై పడే అవకాశం ఉంటుంది. అందుకే టీడీపీలో అంతర్గతంగా ఇదోక భయం. జనసేన – బీజేపీతో పొత్తుకు వెళితే ఆ ప్రభావం తమపై పడుతుందేమో అని టీడీపీ భయపడుతోంది. పొత్తుల విషయంలో టీడీపీ ఆతిచూసి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ సీనియర్ నేతలు భావిస్తున్నారు. .