TDP Office Attacks: టీడీపీ కార్యాలయం (Telugu Desam Party Office).., ఆ పార్టీ నేత పట్టాభి (Pattabhiram) ఇంటిపై అల్లరి మూకల దాడుల వెనుక ఉన్నదెవరు..? ఆ దాడి ఎందుకు జరిగింది..? అసలు కారణాలేమిటి..? అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయింది. ఇది తెలుగుదేశం పార్టీ (TDP) గానీ, రాష్ట్రంలోని రాజకీయ విశ్లేషకులు కానీ.., పార్టీల నేతలు కానీ అస్సలు ఊహించలేదు. కానీ ఒక ప్లానింగ్, పకడ్బందీ స్ట్రాటజీ ప్రకారమే దాడి జరిగినట్లు అర్ధం అవుతుంది. అయితే దీని వెనుక ఉన్న ఉద్దేశం, స్ట్రాటజీలు ఎవరికీ వారు లెక్కలేసుకుంటున్నారు..!
TDP Office Attacks: డైవెర్షన్ ముందు వ్యూహం..!
ప్రస్తుతం రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్ష మీడియా పేట్రేగిపోతోంది. ప్రభుత్వ తప్పులను ఉన్నదీ ఉన్నట్టు కాకుండా.. అధికంగా మసాలా వేసి చూపిస్తున్నారు. ఒక వైపు రాష్ట్రంలో ఆర్ధిక సంక్షోభం, ప్రతిపక్ష మీడియా గోల, పట్టాభి లాంటి వాళ్ళ నోటి దురుసు, రాష్ట్రంలో కోర్టుల గొడవలు అన్నీ వైసీపీకి చికాకు తెప్పిస్తున్నాయి. పాలనపై దృష్టి పెట్టనీయడం లేదు. ఓ వర్గం మీడియా ప్రచారంతో ప్రజలు కూడా ఒక గందరగోళంలోకి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. సర్వేలు, వైసీపీ వ్యతిరేకం అంటూ కాకి గోల చేస్తున్నారు. ఎప్పుడో ముగిసిపోయి.. కేంద్రం కూడా ఏపీకి సంబంధం లేదు అని చెప్పిన హెరాయిన్ కథని ఇంకా ఏపీకి ముడిపెడుతూ.., వైసీపీకి అంతకడుతూ.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టె ప్రయత్నాలు చేస్తున్నారు. వీటన్నిటి నుండి డైవర్ట్ చేయాలంటే.., టీడీపీని అదుపు చేయాలంటే.., మీడియా గోలని ఆపాలంటే అధికార పార్టీలో కొందరు నాయకులకు ఇదే సరైన దారిగా అనిపించి ఉండవచ్చు. సీఎం వద్ద మార్కుల కోసమో.., వైసీపీపై అధిక ప్రేమతోనో.. కొందరు నేతలు తమ అనుచరగణంతో ఈ దాడి చేయించి ఉండవచ్చు.. అధికార పార్టీ ఫ్రెష్టేషన్ తీరడంతో పాటూ.., ప్రతిపక్షాలు భయంతో అదుపులో ఉండాలనేది ఈ దాడి అంతర ఉద్దేశం కావచ్చు..!
TDP Office Attacks: ముప్పేట దాడి.. మరో మార్గం లేదేమో..!?
ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంపై ఉద్యోగుల్లో, ప్రజల్లో కొంత వ్యతిరేకత వస్తోందని వార్తలు వస్తున్నాయి. పలు సర్వే నివేదికలు కూడా వైసీపీకి 2019 లో ఉన్న పరిస్థితి లేదని చెబుతున్నాయి. నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలను విస్తృత స్థాయిలో పంపిణీలు చేస్తున్నా వైసీపీ ప్రభుత్వం పై వ్యతిరేకత రావడం ఏమిటనేది పార్టీలో పెద్దల ప్రశ్న. తాజాగా వచ్చిన “సీ ఓటరు” ఫలితాలు కూడా వైసీపీకి వ్యతిరేకంగా వచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో 28 శాతం ప్రజలు ఎమ్మెల్యేల పనితీరు పట్ల వ్యతిరేకంగా ఉన్నారుట. జగన్మోహనరెడ్డి పనితీరు వ్యతిరేకంగా 25 శాతం మంది ప్రజలు ఆగ్రహంతో ఉన్నారట. ఇది బయటకు వస్తే టీడీపీ అనుకూల మీడియాలు మరింత రచ్చ చేయడం ఖాయం. పట్టాభి లాంటి నేతలు మరీ దిగజారి, శృతిమించి మాట్లాడడం.., ఈ సర్వేలు ఇలా ఉండడం వైసీపీపై ముప్పేట దాడిగా పరిణమించాయి. నిజానికి వైసీపీ కొన్ని విషయాల్లో తప్పులు చేస్తుంది. కొన్ని విషయాల్లో మంచి చేస్తుంది. కొన్ని అంశాలు అవి కోర్టు మెట్లు ఎక్కడంతో వీగిపోతున్నాయి. ఈ తప్పులను ప్రతిపక్ష టీడీపీ బూతద్దంలో ప్రజలకు చూపిస్తోంది. దీంతో ఫ్రెస్టేషన్ వస్తుందని అంటున్నారు. దీంతో రాష్ట్రంలో ఈ టాపిక్ నుండి డైవర్ట్ చేయడం కోసం ఒక కారణం అయితే టీడీపీని భయపట్టాలి అన్నది రెండవ కారణంగా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళగిరి, విశాఖ, తిరుపతి, హిందూపుర్ టీడీపీ కార్యాలయలపై దాడులు జరిగాయి. ఇంత పకడ్బందీగా ఇన్ని చూట్ల ఒకే సారి చేశారు అంటే ఇది పక్కా వ్యూహమేనని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.
వైసీపీ కొత్తకోణం..! ఆలోచనీయమే..!?
“వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ వాళ్లే సానుభూతి కోసం పార్టీ కార్యాలయాలపై వారే దాడి చేయించుకున్నారు.. ఇది టీడీపీ కుట్ర అంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. ఈరోజు సాక్షి లో కూడా ఇదే టాపిక్ కవరేజీ వచ్చింది. సో… ఈ అంశాన్ని కూడా కొట్టిపారేయలేం. నాలుగున్నర దశాబ్దాల అనుభవమున్న బాబొరి మెదడు చాలా షార్ప్. చాలా కన్నింగ్. అందుకే ఈ తరహా సానుభూతి డ్రామాలు, సానుభూతి వ్యూహాలు వేసినా వేస్తారు.. అందుకే ఈ అంశాన్ని వైసీపీ తెరపైకి తెచ్చింది..!
టీడీపీ చేతిలో ఆధారాలు..!?
అయితే వైసీపీ చేస్తున్న ఆరోపణలు.. చంద్రబాబు రాజకీయ కన్నింగ్ ఆలోచనలు పక్కన పెడితే.. దాడి జరిగిన చోట సీసీ కెమెరాలు ఉంటాయి. అవి నిజాన్ని చెప్పేస్తాయి. అందుకే వైసీపీ వాళ్ళే దాడి చేయించారు అని టీడీపీ ధీమాగా ఉంది. ప్రజల ముందు నిరూపించగలమనే ధీమా వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ ల అనుచరులు, వారి వాహనాలు అధికంగా ఉన్నట్టు టీడీపీ ఆరోపిస్తుంది. సీసీ కెమెరాల్లో కూడా వారి వాహనాలు రికార్డ్ అయినట్టు పేర్కొంటున్నారు. సో.. అటు వైసీపీ ఆరోపణలు.., ఇటు టీడీపీ చేతిలో ఆధారాలతో ఏది గెలుస్తుంది.. ఎవరి వాదనకు బలం చేకూరుతుంది..? ఎవరికీ నష్టం, ఎవరికీ కష్టం అనేది ఒక్క నాలుగైదు రోజుల్లో కచ్చితంగా తేలే అవకాశం ఉంది..!