Vangaveeti Radha: రాజకీయాల్లో ఎత్తుగడలు ప్రణాళికలు..వ్యూహాలు.. స్టాటజీల అర్ధాలు వేరు అయినా ఉద్దేశం మాత్రం ఒక్కటే. ఒకప్పుడు చంద్రబాబును మాత్రమే మంచి వ్యూహకర్తగా, అపరచాణిక్యుడిగా చెప్పుకునే వారు. కానీ చంద్రబాబు ప్రణాళికలు, ఎత్తుగడలు, వ్యూహాలు అన్నీ పాత పద్దతికి మరుగునపడిపోయాయి. ఆయన ప్రజల్లో ఒక అపనమ్మకాన్ని మూటగట్టుకున్నారు. అయితే జగన్ చంద్రబాబును మించి స్ట్రాటజీలు చేయగలరు, ప్రణాళికలు వేయగలరు అని కొంత కాలంగా నిరూపించుకుంటున్నారు. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే..రాష్ట్ర రాజకీయాల్లో మూడు రోజుల నుండి ఒక పెద్ద సంచలన అంశంగా మారిన వంగవీటి రాధా ఎపిసోడ్ తాత్కాలికంగా ముగిసినట్లే..! అయితే ప్రతిపక్ష పార్టీలో ఉన్న వంగవీటి రాధా తన హత్యకు కుట్ర జరిగిందనీ, రెక్కీ నిర్వహించారు అని చెప్పడం, ఆ వెంటనే సీఎం స్థాయిలోనే వైఎస్ జగన్ స్పందించి రాధాకు భద్రత పెంచేందుకు 2 ప్లస్ 2 గన్ మెన్ లను కేటాయించడం, ఆ తదుపరి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు రాధాతో ఫోన్ లో మాట్లాడటం, తనకు ప్రభుత్వం కల్పించిన గన్ మెన్ లను రాధా తిరస్కరించడం ఇవన్నీ జరిగిపోయి తాత్కాలికంగా ఈ వివాదాన్ని ముగించినప్పటికీ..దీనిలో ఎవరు ఫెయిల్ అయ్యారు..? ఎవరు ఎటు వంటి వ్యూహం వేశారు..? ఏమి జరిగింది..? అనేది కాస్త తెలుసుకోవాల్సిన అంశమే..!
సీఎం జగన్ ప్రణాళిక ఏమిటంటే..?
వంగవీటి రాధా మొత్తం వ్యవహారంలో ఎక్కడ మొదలైంది ? ఎక్కడ ముగిసింది ? ఎక్కడ ఏమి జరిగింది ? అనేది ఒక సారి గమనిద్దాం..! సీఎం జగన్ పరిపాలన చేపట్టి రెండున్నర సంవత్సరాలు దాటింది. అనేకవర్గాలను ప్రోత్సహిస్తున్నారు. సంక్షేమ పథకాల రూపంలో ఆదుకుంటున్నారు. అయితే అక్కడక్కడా అసంతృప్తులు, అసమత్తులు సహజంగానే ఉన్నట్లు జగన్ పరిపాలనా తీరుపట్ల కూడా ఉన్నాయి. అయితే వచ్చే ఎన్నికల నాటికి జనసేన – టీడీపీ పార్టీల పొత్తు ఉండబోతోందని ఒక కశ్చితమైన సమాచారం. అదే జరిగితే కాపు సామాజిక వర్గ ప్రభావితం ఎక్కువగా ఉన్న దాదాపు 60 నుండి 65 నియోజకవర్గాల్లో వైసీపీ కాస్త బలహీనపడే అవకాశాలు లేకపోలేదు. 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో దాదాపు అన్నింటిలోనూ 90 శాతంకు పైగా స్థానాల్లో వైసీపీ నెగ్గింది. టీడీపీ జనసేన పొత్తు ఉంటే మాత్రం ఆ కూటమికి కశ్చితంగా ఈ స్థానాల్లో కాస్త మొగ్గు ఉంటుంది. ఇది తెలిసిన సీఎం జగన్ ఆ కూటమిని రాజకీయంగా ఇబ్బంది పెట్టే క్రమంలో కొన్ని ప్రణాళికలు వేశారు. అందులో మొదటిది కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం. కాపు సామాజికవర్గానికి తాను గడచిన రెండున్నరేళ్లలో ఏమి చేశామో, ఎలా లబ్దిచేకూర్చామో తమ ప్రభుత్వం కాపుల సంక్షేమానికి ఏ విధంగా కట్టుబడి ఉంది అనేవి వివరించడం, కాపు సామాజిక వర్గంలో బలమైన నాయకులను వైసీపీలో చేర్చుకుని టీడీపీ – జనసేన కూటమి మీద పదేపదే విమర్శలు చేయించడం ఇవన్నీ సీఎం జగన్ ప్రణాళికలు. ఆ ప్రణాళికలు అమలు చేయాలంటే ఆ సామాజికవర్గంలో ఒక బ్రాండ్ ఉన్న వంగవీటి రాధా లాంటి నాయకులు వైసీపీలోకి రావాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ వ్యూహంలో భాగంగా కొడాలి నాని ద్వారా వంగవీటి రాధాను సంప్రదించినట్లుగా ఓ సమాచారం. అయితే దీనిలో అనేక మలుపులు ఉన్నాయి.
ఏమనుకున్నారు..? ఏమి జరిగింది..?
వంగవీటి రాదా వైసీపీలోకి వస్తే అతనికి ప్రాధాన్యత ఇస్తారు. అతనికి కావాల్సిన నియోజకవర్గాన్ని ఇస్తారు. అతని ద్వారా మరి కొంత మంది కాపు సామాజికవర్గ నాయకులను కలుపుకుని జనసేన – టీడీపీ కూటమిని రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. అనేది ప్రణాళిక. కాకపోతే వంగవీటి రాధ మొదటి అడుగు బాగానే వేశారు. తనపై హత్యకు కుట్ర జరిగిందనీ, రెక్కీ కూడా నిర్వహించారని చెప్పారు. అందుకు ప్రాధమికంగా ఒక సమాచారం ఇచ్చారు. అది ఇచ్చిన వెంటనే సీఎం జగన్ హటాహుటిన స్పందించి 2 ప్లస్ 2 గన్ మెన్ లను కేటాయించారు. కానీ సాధారణంగా సీఎం జగన్ తటస్తులకు గానీ, రాజకీయ ప్రత్యర్ధులకు గానీ అంత ఈజీగా భద్రత పెంచడానికి అంగీకరించరు. కానీ వంగవీటి రాధా ఈ విషయం బయటపెట్టిన వెంటనే అతనికి భద్రత పెంచడం వెనుక రాధను వైసీపీ పట్ల ఆకర్షితుని చేయడం ఒక ప్రణాళిక అనుకోవచ్చు. కొడాలి నాని రాధతో మాట్లాడటం, ఆ వెంటనే స్టేజీ మీద రాధ మాట్లాడటం, వెంటనే సీఎం స్పందించడం, గన్ మెన్ లను కేటాయించడం ఇవన్నీ చకచెకా జరిగిపోయాయి. ఇక రాధ వైసీపీలోకి వస్తారని టీడీపీ కూడా ఒక రకంగా ఫిక్స్ అయిపోయింది. కానీ రాధాకు ఉన్న బ్రాండ్ కాపు సామాజికవర్గ ప్లస్ జనసేన – టీడీపీ పొత్తుపై ప్రభావితం చేసేలా వైసీపీ ఇటువంటి ప్రణాళికలు వేస్తుందన్న విషయం చంద్రబాబు పసిగట్టగలిగారు. అందుకే రాధాతో తాను నేరుగా ఫోన్ లో మాట్లాడారు. అంతే కాకుండా తన సామాజికవర్గంకు చెందిన కొంత మందిని రాధా వద్దకు పంపించి ఒప్పించగలిగారు. దానితో పాటు పవన్ కళ్యాణ్ చేత కూడా ఫోన్ లో మాట్లాడించి జనసేన పార్టీ ప్రతినిధులు కూడా రాధాను కలిసి మాట్లాడి ఒప్పించగలిగారు. అంటే జగన్ వేసిన ఎత్తుగడను టీడీపీ – జనసేన కూటమి మీద వైసీపీ కొట్టబోయే మొదటి దెబ్బను చంద్రబాబు ముందుగానే గ్రహించి ఆదిలోనే అడ్డుకట్ట వేశారని చెప్పుకోవచ్చు. సో.. ఈ మొత్తం వ్యవహారంలో రాధా ప్రస్తుతం వెనుకడుగు వేశారు. వైసీపీలోకి వెళ్లే ఆలోచనను విరమించుకున్నారు. కానీ వైసీపీకి ఉన్న స్ట్రాటజీలు, వ్యూహాలు ఏక్షణమైనా పని చేయవచ్చు. రాధా ఏ నిమిషమైనా సంచలన ప్రకటన చేయవచ్చు. ఆ అవకాశాలు లేకపోలేదు. కొడాలి నాని, వల్లభనేని వంశీ రూపంలో రాధాకు ఉన్న రాజకీయ మిత్రుల వత్తిడి ఉండనే ఉంటుంది. (రాధా ఒక వేళ వైసీపీకి వస్తే వంశీకి, నానిలకు వాళ్ల సొంత నియోజకవర్గంలో కొంత కలిసి వస్తుందన్న స్వార్ధం వాళ్లకు ఉంది.) రాధా ఏక్షమైనా ఏ నిర్ణయమైనా తీసుకునే అవకాశం లేకపోలేదు. తాత్కాలికంగా అయితే ప్రస్తుతానికి ఈ వివాదంలో టీడీపీ గెలిచినట్లే..! చంద్రబాబు వ్యూహం ఫలించినట్లే..!