Telangana: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయి. సీఎం కేసిఆర్ తమ ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తుకు వెళ్లబోతున్నారు అనే వార్త రెండు మూడు వారాలుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందుకే రకరకాల సర్వే రిపోర్టులు, రకరకాల రాజకీయ అధ్యయనాలు బయటకు వస్తున్నాయి. ముందస్తు ఎన్నికలు వస్తే తెలంగాణలో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది “న్యూస్ ఆర్బిట్” ఇటీవల ఒక కథనం కూడా ఇవ్వడం జరిగింది. ఇదే సమయంలో తెలంగాణ లో రాజకీయ పార్టీలు యాక్టివ్ అయ్యాయి. బండి సంజయ్ తో సహా ఆ పార్టీ శ్రేణులు యాక్టివ్ అయ్యారు. జనాల్లో తిరుగుతున్నారు. రేవంత్ రెడ్డి టీమ్ యాక్టివ్ అయ్యింది. మరో పక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా యాక్టివ్ అయ్యారు. అటు బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీలు టీఎస్ఆర్ కు గట్టిపోటీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి. టీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి గెలుపుపై ధీమా ఉంది. మరో పక్క వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి మరో సారి పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు. వైసీఆర్ టీపీ, ఎంఐఎంలను పక్కన పెట్టినా ప్రధాన పక్షాలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల త్రిముఖ పోటీ నెలకొంటున్న నేపథ్యంలో ఎవరికి అధికారం దక్కుతుంది అనేది కష్టంగా కనబడుతోందని విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది.
Read More: KCR: కేసిఆర్ కి షాక్ ..తెలంగాణ షేక్ ..! సెన్సెేషన్ సర్వే రిపోర్టు ? ఎవరికి ఎన్ని..?
Telangana: మూడు పార్టీలు బలంగానే
ప్రస్తుతం తెలంగాణలో ఈ మూడు పార్టీలు బలంగా ఉన్నాయి అనేది అందరూ అంగీకరించాల్సిన అంశం. మూడు పార్టీలు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ప్రభావిత శక్తిగా ఎదిగాయి అని చెప్పవచ్చు. వాస్తవానికి కేసిఆర్ రాజకీయ వ్యూహాల్లో దిట్ట. మాటల మాంత్రికుడుగా పేరుంది. మాటలతోనే మెస్మరిజం చేయగలరు. కేసిఆర్ ఇంటెలిజెన్స్ టీమ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటోంది. జిల్లా, నియోజకవర్గాల స్థాయిలోనూ ఇంటెలిజెన్స్ వ్యవస్థను చాలా గట్టిగా పెట్టారు కేసిఆర్. ఏపి లాంటి రాష్ట్రాల్లో నియోజకవర్గానికి ఒకరు ఉంటుండగా, తెలంగాణలో నియోజకవర్గానికి పది మంది చొప్పున ఇంటెలిజెన్స్ క్యాడర్ పని చేస్తోంది. ఈ తరుణంలో కేసిఆర్ కు ఇంటెలిజెన్స్ రిపోర్టులు ఏ విధంగా వచ్చాయి అని చూసుకుంటే.. టీఆర్ఎస్ కు పూర్తి స్థాయిలో కష్టమేననీ, హంగ్ వచ్చే అవకాశం ఉందని అయినప్పటికీ టీఆర్ఎస్ యే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందట. టీఆర్ఎస్ కు మిత్ర పక్షం ఎంఐఎం ఉంది. ఎంఐఎం, టీఆర్ఎస్ కలిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. టీఆర్ఎస్ కు అంతర్గతంగా వచ్చిన రిపోర్టు ఈ విధంగా ఉందని సమాచారం. ఈ రిపోర్టు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తీసుకున్నారా లేక ప్రైవేటు సర్వే సంస్థల ద్వారా చేయిస్తే వచ్చిన రిపోర్టా అనేది స్పష్టంగా వెల్లడి కాలేదు.
Read More: KCR: కేసీఆర్ ధైర్యం అదేనా..!? | జగన్ హ్యాండ్ ఇస్తారా!?
Telangana: ఈజీగా గెలుస్తామన్న ధీమాతోనే కేసిఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి
వాస్తవానికి ఇంటెలిజెన్స్ రిపోర్టు అయితే ప్రభుత్వం వద్దనే ఉంటుంది, బయటకు లీక్ అయ్యే అవకాశం ఉండదు. అయితే ఇది టీఆర్ఎస్ కు అనుబంధంగా కేటిఆర్ కు ఒక పొలిటికల్ టీమ్ ఉంది. ఈ టీమ్ ప్రతి నెలా సర్వేలు చేస్తుంటుంది. ఈ సంస్థ ఇచ్చిన రిపోర్టు అయి ఉండవచ్చని తెలుస్తోంది. నిజానికి 2018లో ఉన్న గాలి ఇప్పుడు లేదు అన్నది టీఆర్ఎస్ కు తెలుసు. 2018 లో వాళ్లు 80 కిపైగా సీట్లు గెలుచుకుంటాము అని నిర్ధారణ అయిన తరువాతే ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. 88 సీట్లు గెలిచారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని టీఆర్ఎస్ కు తెలుసు. ఎందుకంటే వరుసగా రెండు సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత సాధారణంగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకతను తగ్గించుకోవడానికి టీఆర్ఎస్ ప్రయత్నాలు చేయకుండా కేసిఆర్ జాతీయ రాజకీయాల మీద పడ్డారు. తెలంగాణలో ఈజీగా గెలుస్తామన్న ధీమా కేసిఆర్ కు ఉండటం వల్ల జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు. సర్వే విషయాలను పక్కన బెడితే వాస్తవానికి మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ చాలా పుంజుకుందని అంటున్నారు. దానితో పాటు రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ ప్రాంతంలోనూ కాంగ్రెస్ స్ట్రాంగ్ గానే ఉందని సమాచారం.
Telangana: ఎంఐఎం మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు..?
తెలంగాణలో ఉమ్మడి పది జిల్లాల గురించి చెప్పుకుంటే.. రెండు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి ఇతర జిల్లాల్లో ప్రత్యర్ధి పార్టీకి వచ్చే సీట్ల కంటే ఎక్కువ స్థానాలు వస్తాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరో రెండు జిల్లాల్లో సమానంగా సీట్లు వచ్చే అవకాశం ఉందట. బీజేపీకి హైదరాబాద్, రంగారెడ్డి తో పాటు కరీంనగర్ లో మంచి ఓటు బ్యాంక్ ఉంది. వీటితో పాటు నిజామాబాద్ లో కూడా 50 – 50 స్థాయిలో ఉండే అవకాశం ఉంది. వరంగల్లు, ఖమ్మం, హైదరాబాద్ తో పాటు ఇతర జిల్లాలోనూ భారీగా సీట్లు వస్తాయని టీఆర్ఎస్ నమ్ముతోంది. మొత్తం 119 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 25 నుండి 30, బీజేపీ 15 నుండి 20 గెలుచుకున్నా మిగిలిన వాటిలో ఎంఐఎంలు ఏడు, ఎనిమిది పోగా మిగిలిన సీట్లు టీఆర్ఎస్ కైవశం చేసుకుంటుంది. ఎంఐఎం మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న నమ్మకంతో టీఆర్ఎస్ ఉంది. అది జరుగుతుందా లేదా, కేసిఆర్ నమ్మకం ఎంత వరకు నిలబడుతుంది అనేది తెలియాలంటే ఎన్నికల వరకూ వేచి చూడాలి.