రెండు తెలుగు రాష్ర్టాల్లో కొన్ని గమ్మత్తయిన పోలికలు ఉన్నాయి…! ఇవి ఇప్పుడే ఈ ఇద్దరు తెచ్చుకున్నవి కాదు…! నియంతృత్వ పాలన లక్షణాల్లో ఇవి కూడా కొన్ని…! తమిళనాట గతంలో జయలలిత…, తెలుగునాట చంద్రబాబు వీటికి బీజం వేయగా.., నేడు ఈ ఇద్దరూ ముఖ్యమంత్రులు తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు.
ముఖ్యమంత్రులు ఇద్దరికీ శాసనసభ పరంగా మంచి బలం ఉంది. శాసించే వ్యక్తిత్వం, బలగం ఉంది. ఎటొచ్చి పడ్డ చిక్కల్లా… బహిరంగంగా ఉండాల్సిన… ఉంచాల్సిన జీవోలు… భయం భయంగా రాత్రి వేళ గోప్యంగా విడుదల చేయటం. పాత్రికేయ సమావేశాలకు అనుకూల మీడీయాలకు మాత్రమే సమాచారం ఇవ్వటం. అంతా ‘ఫీల్ గుడ్’ తరహాలో అధికారులు ‘చెప్పేదే వేదం’లా వ్యవహరించడం. అధికారులు కూడా అందుకు తగ్గట్లుగా భజన చేయడం. వెరసి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ అసలు ‘నైజాలు’ వదిలేసి అధికారుల ‘జోల’ పాటలతో ముందుకు సాగటం. అంతర్లీనంగా ఇద్దరూ భయపడుతున్నారో… మీడియాని భయ పెడుతున్నారో.., ప్రలోభ పెడుతున్నారో అనేది మాత్రం అస్పష్టమే..! రెండు తెలుగు రాష్ట్రాలలో పూర్తిగా రంగుల మాయమైన మీడియాతో నిజాలు బయటపడడం లేదు. మీడియాలతో నెలకొన్న రహస్య దాగుడు మూతలపైనే ఈ కథనం.
కేసీఆర్ నాడు అలా.. నేడు ఇలా…!!
కేసీఆర్ ఒక పాలకుడు, ఒక సేవకుడు కంటే ఒక నాయకుడిగానే తెలంగాణకి తెలుసు. ఉద్యమ నేతగా రాష్ట్ర ప్రజలకు, మీడియాకు దగ్గరయ్యారు. నాడు ఉద్యమ సమయంలో అందరూ కావాలి. అధికారంలోకి రాగానే కొందరే అవసరం. ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్రికేయ సమావేశాలకు కేవలం ఓ వర్గం మీడియాకి మాత్రమే ఆహ్వానం ఉంటుంది..? మొన్న జరిగిన పాత్రికేయ సమావేశానికి కొందరు సీనియర్ పాత్రికేయులకు ఆహ్వానం లేదు. మెసేజ్ వచ్చిన వారికి మాత్రమే ప్రవేశం అంటూ… ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ అనంతరం లోపలికి అనుమతించారు. ఇప్పటికే జర్నలిస్టులకు ఎదురైన అవమానాలకు ప్రెస్ అకాడమీ స్పందించిన దాఖలాలు లేవు. పత్రిక ప్రకటనల విషయంలో ప్రభుత్వ వ్యవహారశైలి పూర్తిగా ఒక వర్గం. అక్కడ అనుకూల/ ప్రతికూల మీడియాతో నిజాలు బహిర్గతం కావడం లేదు.
* గండిపోచమ్మ ప్రాజెక్టు నెలరోజుల్లో ఎందుకు గండి పడింది..??
* కరోనా పరీక్షలు చేయడానికి అక్కడ ఏమిటీ సమస్య…??
* టిమ్స్, నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులు ఉన్నప్పటికీ అక్కడి మల్లారెడ్డి హెల్త్ విశ్వవిద్యాలయానికి ఎందుకు వెళ్తున్నట్టు..??
* వీడియోలు విడుదల చేసి మరణించిన కరోనా బాధితులు చెప్పిన వాటిలో నిజాలు ఏమిటి..? అనే అంతర్గత అంశాలను మీడియా శోధించడం లేదు. ఒకవేళ ఎవరైనా శోధించినట్టు తెలిస్తే వారికి ఒక సినిమా కనిపిస్తుంది.
ఏమిటో ఆ యాడ్లు కుమ్మరింపు….!
కరోనా సమయంలో ప్రకటనలు లేక పత్రికలు మూతపడుతున్నాయి కదా? మరి ఏపిలో ఏ పత్రిక పరిస్థితి ఎలా ఉంది..? కరోనా కాలంలోనూ ఓ ప్రధాన పత్రికకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫుల్ పేజీ, జాకెట్(ముందు,ఎనక పేజీలు) యాడ్లు వచ్చాయి.. కరోనా నష్టం ఆ పత్రిక అలా కవర్ చేసుకుంది. కరోనా వైరస్ తో ప్రజలు అల్లాడుతుంటే ఆ పత్రిక మాత్రం ప్రకటనల పండగ జరుపుకుంటున్నది. ‘ముఖ్యమంత్రికి అండగా ఉందాం’ అంటూ ఇప్పటికే నాలుగు ఫుల్ పేజీ యాడ్లు విడుదల అయ్యాయి. వీటి అర్ధం తెలీదు. ఒక్కో యాడ్ ఖరీదు అక్షరాలా కోటీ 36 లక్షల రూపాయలు. ముఖ్యమంత్రి ఫొటో ప్రముఖంగా సంబంధిత శాఖ మంత్రి ఫొటో కింద వచ్చే ఈ ప్రకటనలో కరోనా పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. ఇందులో ముఖ్యమంత్రికి అండగా ఉండటం ఏమిటో అర్ధం కాదు.! వీటి విలువ రూ. 5.40 కోట్లు. ఏ శాఖలో డబ్బులు ఉంటే ఆ శాఖ లోని ఆ విభాగానికి ఆ పత్రిక బిల్లు పంపుతుంది. దాన్ని అక్కడ నుంచి చెల్లించే ఏర్పాటు చేసుకుంటున్నారు.
* గత నెల 8వ తేదీన విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేరుతో యాడ్ వచ్చింది. కోటీ 36 లక్షల రూపాయలు చెల్లించేస్తారు. పాపం ఆ శాఖకు చెందిన సమగ్ర శిక్షలో పని చేసే వారికి రెండు మూడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. పని చేసేవారికి జీతాలు ఇచ్చేందుకు చేతులు రావడం లేదు కానీ పత్రికలకు మాత్రం యాడ్లు వచ్చేస్తున్నాయి. ‘ముఖ్యమంత్రికి అండగా ఉందాం’ అని లలితా జువెలర్స్ వారు ఫస్టు ఒక పత్రికకు యాడ్ ఇచ్చారు. వామ్మో ఇదేదో కాన్సెప్టు బాగుందని అన్ని ప్రభుత్వ శాఖలూ క్యూ కట్టేశాయి.
మంచి మర్చిపోయాయేమో…!!
ఇక ప్రభుత్వ వ్యతిరేక పత్రికల సంగతి చూద్దాం. పనికి మాలిన వి షయాలను భూతద్దంలో చూపించి.., పనికొచ్చే విషయాలను పెద్దగా పట్టించుకోరు. సీఎం జగన్ చేసే ప్రతి అడుగుని ఆరా తీసి తప్పులను వెతుకుతూ హైలైట్ చేసుకునే ఈ పత్రికల్లో నిజమైన జర్నలిజం లేదు. ప్రజలకు కీలక అంశాల్లో ప్రభుత్వాలు చేస్తున్న పొరపాట్లను గుర్తించడం లేదు. కరోనా కేసులు పెరుగుతున్నాయి, మరణాలు భయనస్థితికి వెళ్లాయి..! దీనిపై అప్రమత్తత లేదు. ఈనాడు వంటి పత్రికలో అంతర్గత కుమ్ములాటలతో వార్తలు, కథనాలు వంటి అంశాలను పక్కన పెట్టేసారు. యాడ్లు ఇవ్వడం లేదనే సాకుతో కనీస ప్రభుత్వ సంక్షేమ వార్తలు, మంచి వార్తలను చంపేశారు. బాబు అనుకూల వార్తలు, జగన్ వ్యతిరేక వార్తలతో నింపేస్తున్నాయి. ప్రభుత్వ లోపాలను విధాన పరంగా విమర్శించడం, అడ్డుకోవడంలో నైజం వెళ్లడవుతుంది.
Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!