టీడీపీ కష్టాల్లో ఉంది. చంద్రబాబు రాజకీయం చిక్కుల్లో ఉంది. లోకేష్ భవితవ్యం సంక్లిష్టంలో పడింది. దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీ ఎన్నడూ లేని విధంగా వెనక్కు వెళ్తుంది..! ఎవరేమనుకున్నా ఉన్నదీ ఉన్నట్టు చెప్పుకోవాలంటే ఒక పార్టీ పునాదులు, ఆ వెనుక ఒక సామాజికవర్గం మూలాలు ఏపీలో కదులుతున్నాయ్..! దీన్ని సమర్ధంగా ఎదుర్కోకపోతే.., పరిష్కరించుకోకపోతే.., తిప్పికొట్టకపోతే భవిష్యత్తు అంధకారమే..! అందుకే ఈ కీలక వ్యక్తులందరూ ఏకమయ్యారు. ఆ పార్టీలోని, ఆ సామాజికవర్గంలోని పెద్దలు అందరూ కలుస్తున్నారు. వారికి పెద్దదిక్కు అయిన రామోజీ కోటలో ఇటీవల కలుస్తున్నారు. చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలలో లోతు బయటకు రాలేదు కానీ.., సారాంశం మాత్రం ఇదే..!!
ట్రబుల్ షూటర్ ఇప్పుడే ఎందుకు అవసరం..!?
టీడీపీకి ఇప్పుడు ట్రబుల్ షూటర్ కావాలి. పార్టీలో జవసత్వాలు నింపి, మళ్ళీ పునరుత్తేజం ఇవ్వగల నాయకుడు కావాలి. ఆ నాయకున్ని నడిపించే మేథస్సు కావాలి. మరో ఏడాదిలో దీన్ని తయారు చేసుకుని, జనంలోకి వదలకుంటే పార్టీ వచ్చే ఎన్నికల నాటికి కూడా కోలుకోవడం కష్టమే. అందుకే ఇప్పుడే.., రెండు, మూడు నెలల వ్యవధిలో పార్టీకి పెద్ద దిక్కుని రంగంలోకి దించాలి. చంద్రబాబు ఒక కొమ్ము, రామోజీ ఒక కొమ్ము, ఆ సామాజికవర్గ పెద్దలు కొన్ని కొమ్ములు పట్టుకుని ఆ నాయకున్ని, ట్రబుల్ షూటర్ ని నడిపించాలి. అయితే ఆ నాయకుడు ఎవరు..? ఆ ట్రబుల్ షూటర్ ఎవరు అనేదే ప్రస్తుతం చర్చ..!
రామోజీ కోటలో కీలక మంతనాలు..!!
రామోజీ అందరికీ తెలిసి మీడియా పెద్ద. కానీ ఆయన ఒక కుల పెద్ద. ఒక పార్టీకి తెర వెనుక పెద్ద. 1995 సంక్షోభంలో తెరవెనుక వ్యూహాలన్నీ వేసిన పెద్ద. నాడు ఈ పార్టీ ఎన్టీఆర్ నుండి చంద్రబాబు చేతికి రావడంలో కీలక వ్యూహాలు వేసిన ఒక పెద్ద. అదే పెద్ద ఇప్పుడు మళ్ళీ రంగంలోకి దిగాల్సి వచ్చింది. తప్పలేదు. ఆయన వయసు 84 . మరో నాలుగైదేళ్లు మాత్రమే కొంచెం ఆలోచించగలరు. ఈ లోగా పార్టీకి కష్టకాలం వచ్చింది. తన పార్టీకి, తన కులానికి తన అవసరం పడింది. తన బుర్రలో ఉండే అనేక ఆలోచనలతో ఏదో ఒకటి ఇటు పడేసి పార్టీని, కులాన్ని గట్టు ఎక్కించగల సమర్ధత రామోజీకి మాత్రమే ఉంది.
అందుకే ఏపీలోని ఆ కుల పెద్దలు, హైదరాబాద్ లో స్థిరపడిన ఆ కుల పెద్దలు, విదేశాల్లో ఉన్న ఆ కుల పెద్దలు అందరూ రామోజీ కోతలు కలిశారు. ఇప్పటికి రెండు దశల్లో మంతనాలు జరిగాయి. అదేమిటి అంటే టీడీపీలో ఎన్టీఆర్ ని దించడం. చంద్రబాబే స్వయంగా వెళ్లి ఎన్టీఆర్ తో మాట్లాడి, వచ్చే ఏడాది నాటికి రంగంలోకి దించడం. అది కూడా కేవలం ప్రచారానికి కాకుండా పూర్తిగా యాక్టీవ్ గా పార్టీలో కీలకంగా ఉండేలా..! ఎన్టీఆర్ ని ఒప్పించడం. ఇప్పుడు రామోజీ కోటలో జరుగుతున్న మంతనాలు ఇవే. అయితే ఎన్టీఆర్ వస్తే తన కుమారుడు భవిష్యత్తు ప్రస్నార్ధకం అవుతుంది. అందుకే చంద్రబాబు ఆలోచిస్తుండగా.., ఎన్టీఆర్ కూడా ఒప్పుకోరేమో అని ఆ పెద్దల్లో అనుకుంటున్నారు. కానీ ఈ బాధ్యతని రామోజీనే తన నెత్తిన వేసుకున్నారు.
లోకేష్ – ఎన్టీఆర్ కలిసేలా..!!
వచ్చే ఎన్నికల వరకు చంద్రబాబు యాక్టీవ్ గా ఉంటారు. సో.. వారసుడి అవసరం అప్పుడే రాదు. అందుకే ప్రస్తుతానికి “అటు నారా లోకేష్ – ఇటు ఎన్టీఆర్ ఇద్దరూ పార్టీ కోసం కలిసి పని చేస్తారు. ఎవరి పనుల్లో, ఎవరి బాధ్యతల్లో వారు ఉంటారు. ఎన్టీఆర్ కి ఉన్న ఛరిష్మా, రూపు పార్టీకి బాగా ఉపయోగపడతాయి. లోకేష్ చేయగలిగినంత చేస్తారు. 2029 నాటికి వారసుడి అవసరం ఉంటుంది. అప్పటికి ఈ ఇద్దరిలో ఒకరికి ఇద్దాం. ప్రస్తుతానికి మన పని ప్రత్యర్థి(జగన్)ని దించడమే కాబట్టి… ఆ పనిలో ఉందాం, అందరం కలుద్దాం” అని అనుకుంటున్నారు. దీనికి కర్త, కర్మ, క్రియ రామోజీనే వ్యవహరిస్తున్నారు. రెండు దశల్లో చర్చలు జరిగాయి. మరో రెండు, మూడు సిటింగులు వేసుకుని ఈ విషయంపై ఒక స్పష్టతకు రానున్నారు అనేది ఒక సమాచారం..!!