ఫేక్ టీఆర్పీలు..! ఫేక్ ర్యాంకులు..! ఇదిప్పుడు ఇండియన్ మీడియా కొత్తగా వింటున్న బ్రహ్మ పదార్ధాలు ఏమి కాదు..! టీవి ఛానళ్ళు తమ ఆధిపత్యం కోసం..తమ అడ్డగోలు సంపాదన కోసం టీఆర్పీలను సృష్టించి మాయ చేసి ర్యాంకులు కొట్టేస్తున్నాయని, టీఆర్పీ అనేదే ఓ పెద్ద కుంభకోణం అని ముంబాయి పోలీసులు తాజాగా గుర్తించారు. దీనిపై రిపబ్లికన్ టీవీ, ఇండియా టుడే వంటి పెద్ద ఛానళ్ళపై కేసులు కూడా నమోదు చేశారు. ఇది దేశ వ్యాప్తంగా మీడియా ఎదురుగా కూర్చునే ముఖాలకు ఓ పెద్ద వింత..! విశేషం..! అని అనిపిస్తే అనిపించవచ్చు గాక. కానీ మీడియా గురించి బాగా తెలిసిన “మీడియా”కు మాత్రం ఏ మాతం వింత, విశేషం కానీ కాదు..!!
పోలీసులు గుర్తించింది పెద్ద సంచలనం కాదు..!
టీఆర్పీ ఉంటేనే వ్యూస్ వస్తాయి. యాడ్స్ వస్తాయి. బాగా చూస్తే టీఆర్పీ రేటింగ్ లు వస్తాయి. అంటే “కోడి గుడ్డు” సామెత గుర్తుకు రావాలి. కోడి ముందా?, గుడ్డు ముందా? అంటే ఇదే తరహాలో ఉంటుంది. అందుకే టీఆర్పీల కోసం, రేటింగ్ ల కోసం న్యూస్ ఛానళ్లు నానా తంటాలు పడుతుంటాయి. ఇదీ ఓన్లీ ముంబాయికో,. ఢిల్లీకో పరిమితం కాదు. ఒక రకంగా దేశంలో మీడియా ఛానళ్ళు టీఆర్పీలను అడ్డగోలుగా కొనుగోలు చేయగలవని, మయా మంత్రం చేయగలవని నిరూపించింది తెలుగు మీడియానే. సుమారుగా దశాబ్దంన్నర నుండి తెలుగునాట వెలుగొందుతున్న ఛానళ్ళు టీఆర్పీలను అడ్డగోలుగా ఆక్రమించేసి, బార్క్ రేటింగ్ లను పెద్ద మాఫియాగా మార్చేసి తెలుగు జనాలకు తామే ముందు ఉన్నాం అనే ఒక అద్దం లాంటి అబద్దాని చూపాయి.
అందుకే తెలుగునాట ఒక ఛానల్ కి విపరీతంగా జనం తిడుతున్నా సరే టీఆర్పీ రేటింగ్స్ లో మాత్రం అదే పైన ఉంటుంది, ఇలా తెలుగులో నాలుగైదు ఛానళ్ళు ఆరితేరిపోయాయి. సరే..ముంబాయిలో గొడవైతే తెలుగు ఛానళ్ళ మాట ఎందుకు గానీ, ఒక సారి ముంబాయికి, రిపబ్లికన్ టీవీకీ, అర్నబ్ గో స్వామికి, ముంబయి పోలీసులకు మధ్య యుద్ధం ఎందుకు అన్న విషయానికి వెళ్లి వద్దాం.
ముంబాయి గొడవ ఏమిటనుకుంటున్నారు..?
రిపబ్లికన్ టీవీ అంటే బీజెపీకీ తొత్తు. అందులో అర్నబ్ గోస్వామి అంటే బీజెపీకి గొంతు. శివసేనకు బీజేపీకి అగ్గి రగులుతోంది. అందుకే శివసేనను టార్గెట్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ముంబాయి పోలీసులను ఒక ఆట ఆడుకుంటున్నారు అర్నబ్ గోస్వామి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు తన ఆయుధంగా మార్చుకుని దేశ వ్యాప్తంగా డ్రగ్స్ ర్యాకెట్ మొత్తం ముంబాయిలోనే ఉంది అంటూ ముంబాయి పోలీసులు అన్నీ తెలిసి ఇలా చేస్తున్నారంటూ వారిని టార్గెట్ చేశారు. దీంతో ముంబాయి పోలీసులకు బాగా మండింది. దామోదో పెద్ద సంచలనాన్ని వెలికి తీసినట్లు టీఆర్పీ రేటింగ్ల వ్యవహారాన్ని బయటకు తీసుకువచ్చారు. దీనిలో రిపబ్లికన్ టీవీని, అర్నబ్ గో స్వామిని కూడా పిలిపించి విచారించారు.
దీనితో పాటు ఈ ఛానల్ పైనే కేసు పెడితే బాగోదని ఇండియా టుడే వంటి వేరే ఛానళ్లపై కూడా కేసు పెట్టారు. అయితే ఇది కాస్త బెడిసి కొట్టింది. రిపబ్లికన్ టీవీ పోలీసులను టార్గెట్ చేయకముందు పోలీసులు ఈ టీఆర్పీ రేటింగ్ వ్యవహారాన్ని బయటకు తీస్తే నిజంగా దేశ వ్యాప్తంగా సంచలనం, మంబాయి పోలీసులు ధైర్యవంతులు అనేటట్లు ఉండేది. కానీ ఈ గొడవ మొత్తం జరిగిన తరువాత పోలీసులను రిపబ్లికన్ టీవీ టార్గెట్ చేయడం తరువాత టీవీని ఎక్కడో ఒక చూట అదుపుచేయాలి, పట్టుకోవాలి అంటే తమ చేతిలో ఒక ఆయుధం ఉండాలి కాబట్టి టీఆర్పీని పోలీసులు బయటకు తీశారు. కానీ ఇది దేశం మొత్తం జరుగుతున్న పెద్ద మాఫియా. ముంబాయిలో స్విచ్ వేస్తే హైదరాబాదులో లైట్ వెలుగుతుంది. హైదరాబాద్ లో స్విచ్ వేస్తే ఢిల్లీలో వెలుగుతుంది. ఢిల్లీలో వేస్తే చెన్నైలో వెలుగుతుంది. అలా దేశంలోని అన్ని నగరాలకు టీఆర్పీల మాఫియా పాకిపోయింది. అన్ని రాష్ట్రాలు, అన్ని జిల్లాలలోనూ దీనికి సంబంధించిన నెట్ వర్క్ , అడ్డగోలు వ్యవహారాలు నడుస్తూనే ఉన్నాయి. సో..ముంబాయి పోలీసులు కనిపెట్టింది పెద్ద విషయం కాదు. రిపబ్లికన్ టీవీ చేస్తున్నది మీడియా వాళ్ళకు తప్పుకాదు.