Union Budget 2022: బీజేపీ లేకపోతే దేశం ఏమైపోయేదో..!? బీజేపీ పాలకులు లేకపోతే ఈ దేశాన్ని ఆ పార్టీలోళ్లు ఏం చేసేసేవారో..!? మోడీ లాంటి పాలకుడు లేకపోతే ఈ దేశం ఏ నాడో అవినీతి మయం అయిపోయేది..!? అమిత్ షా, మోడీల ద్వయం లేకపోతే ఈ దేశంలో అంబానీ, అదానీ లాంటి సేవా తత్పరులు ఉద్భవించేవాళ్లే కాదు..! అసలు బీజేపీ పార్టీ కానీ.. ఆ పార్టీ నాయకులు కానీ లేకపోతే ఈ దేశ ఆర్ధిక వ్యవస్థ ఏ నాడో పతనమైపోయేది..! తలచుకుంటేనే భయం వేస్తుంది. దేవుడా.. ఈ బీజేపీ పార్టీని, ఈ నాయకులను దేశానికి బహుమతిగా ఇచ్చి దేశాన్ని నువ్వే బాగు చేస్తున్నావు..! గాడ్ ఈజ్ గ్రేట్..!!
జియోనీ ఎత్తి బీఎస్ఎనెల్ తీసి పారేసినా.., లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ప్రైవేట్ పరం చేసినా.., ఇప్పుడు అడవులను ప్రైవేటీకరణకు అప్పగిస్తున్నా.. ఏం చేయాలన్నా బీజేపీ లాంటి గట్స్ ఉండాల్సిందే. ఆ నేతలు ఉండాల్సిందే.. ఒకప్పుడు భారత దేశమంటే BSNL, LIC, Forest, Indian Railways, Indian Petroleum, VSNL, Air India, Hindustan Zinc లాంటివి ఎన్నో గుర్తొచ్చేవి. ఇప్పుడు వాటి స్థానంలో ఆదాయానికి పెరిగిన ఆస్తులు, అంబానీకి పెరిగిన కంపనీల షేర్లు గుర్తొస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు నష్టాల్లో ఉన్నాయని చూపించి.. ప్రైవేటీకరణను విజయవంతంగా చేస్తున్న మేరా బీజేపీ మహాన్ హై..!
ఈరోజు ప్రవేశ పెట్టిన బడ్జెట్ లెక్కలనే తీసుకుందాం. ఒక్క రాష్ట్రానికి ఒక్క రూపాయి ఆసరా అనే స్ఫష్టత లేదు. ఒక్క ప్రత్యేక ప్రాజెక్టు కేటాయింపు లేదు. ఒక్క నీటి పథకమో, విద్యకు, వైద్యానికో, రవాణాకు ఫలానా నిధులు అంటూ లెక్కలు లేవు. కనీసం వెనుకబడిన కొన్ని రాష్ట్రాలకు ఎంతో కొంత ఊరట లేదు. మూతబడుతున్న పరిశ్రమలకు రాయితీలు లేవు. కాలంగా దేశ వ్యాప్తంగా దాదాపు 2500 చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడిన లెక్కలు లేవు..! కేవలం 39.45 లక్షల కోట్లు లెక్కలు.. 22 లక్షల కోట్ల ఆదాయం.. 17 లక్షల కోట్ల అప్పులు.. రాష్ట్రాలకు వడ్డేలేని రుణాలు.. కొన్ని అంకెలు మాత్రమే కనిపించాయి. పైగా డిజిటల్ రూపాయి, అడవుల ప్రైవేటీకరణ వంటివి సైడ్ ఎఫక్టులు..!
Union Budget 2022: ఒక్క మీడియా/ పార్టీ గొంతెత్తదే..!?
దేశం ఒక ప్రత్యేక స్ట్రాటెజీలో ఇరుక్కుపోయింది. బీజేపీ చేస్తున్న చారిత్రిక తప్పులను విశ్లేషించి.., ప్రజలకు వివరించే బాధ్యత ఏ ఒక్కరూ తీసుకునే సాహసం చేయడం లేదు. ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న కాంగ్రెస్ లో అంత ఆకట్టుకునేలా చెప్పగలిగే నాయకులు కరువయ్యారు. రాహుల్, ప్రియాంక లాంటి వారు చెప్పినా వైన్ వారు కరువయ్యారు..! అక్కడక్కడా తృణమూల్ కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ, ఎంఐఎం, టీఆరెస్ లాంటి పార్టీలు చెప్తున్నప్పటికీ.. కొన్ని రాష్ట్రాలకే ఆ వాదన పరిమితమవుతుంది తప్ప జాతీయస్థాయిలో బీజేపీ పై వ్యతిరేక భావన క్రియేట్ చేయడంలో ఈ పార్టీలన్నీ విఫలమవుతున్నాయి.. మరి బీజేపీ విధానాలను తప్పు పట్టె వ్యవస్థలేమున్నాయి..!? బీజేపీ ఒక వ్యవస్థీకృతంగా చేస్తున్న తప్పులను దేశం మొత్తం అర్ధమయ్యేలా చెప్పే వ్యవస్థలేమున్నాయి..? దీనికి సమాధానం మీడియా. జాతీయ మీడియా..! కానీ..
జాతీయ మీడియా ఇలా ఏడుస్తుంది..!
ప్రాంతీయ పార్టీలను కొన్ని మీడియా చానెళ్లు, పత్రికలూ ఎంతో కొంత మోస్తున్నాయి.. శాసిస్తున్నాయి.. ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి.. వైసీపీకి అనుకూలంగా సాక్షి ఉన్నట్టే అన్ని రాష్ట్రాల్లో ఆయా పార్టీలకు అనుకూల/ ప్రతికూల మీడియాలున్నాయి. అలాగే జాతీయస్థాయిలో కూడా బీజేపీకి అనుకూల/ వ్యతిరేక మీడియాలున్నాయి. కానీ.. అనుకూల మీడియాలు యాక్టీవ్ గా పని చేస్తుంటే.. వ్యతిరేక మీడియాలు మిణుకుమిణుకుమంటున్నాయి. దేశంలో బాగా పేరొందిన ఎన్డీటీవీ, ఇండియా టుడే లాంటివి పుట్టుక బీజేపీకి వ్యతిరేకమే.. కానీ ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క సరైన కథనం ఇవ్వలేకపోతన్నాయి.. ఇక బీజేపీకి అనుకూలమైన మీడియా చానెళ్లు ఈ ఆరేళ్లలో పదుల పుట్టుకొచ్చాయి. రిపబ్లిక్ టీవీ ఈ ఏడేళ్లలో 12 రాష్ట్రాల్లో విస్తరించింది. స్టార్ న్యూస్ వారి అబీపీ న్యూస్ కూడా ఇటీవల దేశం మొత్తం ప్రాంతీయ చానెళ్లు ఆరంభించింది. ఇండియా టీవీ, ఆజ్ తక్ వంటివి బాగా విస్తరిస్తున్నాయి. అంటే.. బీజేపీ అనుకూల చానెళ్లు నెట్వర్క్ పెంచుకుంటుంటే.., వ్యతిరేక చానెళ్లు ప్రాభవం కోల్పోతున్నాయి. అందుకే ఆ భయంతో కొన్ని చానెళ్లు నడపడమే కష్టంగా మారింది.
అంచేత.. అడిగే వారు లేరు. ప్రశ్నించే వారు లేరు.. గట్టిగా మాట్లాడే వారు లేరు.. ఏపీలో వైసీపీ లాంటి పరిస్థితే దాదాపు చాలా ప్రాంతీయ పార్టీలది కూడా.. మింగలేక, కక్కలేక బడ్జెట్ కి జేజేలు కొడుతున్న ప్రాంతీయ పార్టీల ఎంపీలు ఎందరో ఉన్నారు..! అందుకే “దిక్కుమాలిన బడ్జెట్.. దిక్కుమాలిన బీజేపీ.. అనకూడదు”..!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?