Vangaveeti Radha: మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా తరచుగా గుడివాడ లో తరచుగా కాపు నేతలతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా ఉంది. అసలు వంగవీటి రాధా రాజకీయ ప్రణాళికలు ఏమిటి..? ఆయన ఎక్కడి నుండి పోటీ చేస్తారు అనేది చాలా మందికి సందేహాలు ఉన్నాయి. అసలు వంగవీటి రాధా గుడివాడలో కాపు నేతలతో సమావేశం అవ్వడం వెనుక అజెండా ఏమిటి..? రాధాకు అక్కడ పోటీ చేసే ఉద్దేశం ఏమైనా ఉందా..? లేదా.. ఆయన ఏ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుంటున్నారు..? .టీడీపీలో ఆయన పాత్ర ఏమిటి..? అనేది విశ్లేషించుకుంటే.. నాలుగైదు నెలల క్రితం కూడా వంగవీటి రాధా గడివాడ వెళ్లారు. కాపు నేతలతో మీటింగ్ పెట్టారు. నేను వస్తాను అంటూ సంకేతాలు ఇచ్చారు. రెండు నెలలు గడిచిన తరువాత విజయవాడలో కొడాలి నాని, వల్లభనేని వంశీలతో కలిసి వాళ్లతో పర్సనల్ గా భేటీ అయ్యారు. ఆ తరువాత తన తండ్రి రంగా విగ్రహావిష్కరణ సభలో తన హత్యకు కుట్ర జరుగుతోందనీ, కొందరు రెక్కీ కూడా నిర్వహిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఆ తరువాత రంగా రకరకాల కాపు నేతలతో సమావేశమవుతున్నారు.
Vangaveeti Radha: తన సామాజికవర్గ పెద్దలతో మీటింగ్ అందుకే..?
అటు విజయనగరం నుండి అనంతపురం వరకూ తన సామాజికవర్గ పెద్దలతో మీటింగ్ లు పెట్టారు. తాజాగా గుడివాడలో కాపునేతలతో సమావేశమైయ్యారు. ఈ పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయి. వంగవీటి రాధా గుడివాడ నుండి పోటీ చేయనున్నారు అంటూ వస్తున్న వార్తలు పుకారు మాత్రమే. ఆయన గుడివాడ నుండి పోటీ చేసే అవకాశం లేదు. ఎందుకు అంటే.. వైసీపీ నుండి గుడివాడకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొడాలి నాని, వంగవీటి రాధా మంచి స్నేహితులు అన్నది అందరికీ తెలిసిందే. పార్టీలు వేరు అయినప్పటికీ ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. వంగవీటి రాధ గుడివాడ నుండి పోటీ చేస్తే ఇద్దరి మధ్య స్నేహ బంధం చెడిపోయి శతృత్వం ఏర్పడే అవకాశం ఉంటుంది. గుడివాడను టీడీపి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ తరుణంలో వారి మధ్య ఫ్రెండ్లీ పోటీ అవకాశం ఉండదు. వంగవీటి రాధ మాట కొంత కఠినంగా ఉన్నా, ఆయన రాజకీయం మాత్రం అంత కఠినంగా ఉండదు అన్నది అందరికీ తెలిసిందే. ఆయన అంత దూకుడుగా వ్యవహరించే నాయకుడు కాదు. మీడియా ముందు ఎమోషన్ లో ఏదో మాట్లాడతారు కానీ రాజకీయంగా కఠిన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్లే స్వభావం కాదు. అందుకే ఆయనకు ఒక బ్రాండ్ ఉన్నప్పటికీ ఒక స్థాయికి వెళ్లలేకపోయారు.
Vangaveeti Radha: విజయవాడ సెంట్రల్ పైనే ఆలోచన
వంగవీటి రాధా గుడివాడలో తన సామాజికవర్గం వారిని టీడీపీ వైపునకు మళ్లించేందుకు ప్రయత్నం చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఎవరు పోటీ చేసినా టీడీపీకి మద్దతు ఇవ్వండి అని సూచన చేయగలరు గానీ తాను పోటీ చేస్తాను, తనకు పని చేయండి అని చెప్పే అవకాశం లేదు. ఇదే సందర్భంలో వంగవీటి రాధాకు వల్లభనేని వంశీతోనే అదే రకమైన స్నేహసంబంధం ఉంది. వంగవీటి రాధా విజయవాడ సెంట్రల్ కావాలని గతంలో అడిగారు. కానీ అక్కడ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా స్ట్రాంగ్ గా ఉన్నారు. గత ఎన్నికల్లో కేవలం 25 ఓట్ల తేడాతోనే మాత్రమే బొండా ఉమా ఓడిపోయారు. గుడివాడ, గన్నవరం, విజయవాడ సెంట్రల్ లో ఎవరు పోటీ చేసినా కాపు సామాజికవర్గ ఓటర్లను ఆకర్షించుకునేందుకు వంగవీటి రాధాను ఉపయోగించుకోవాలని టీడీపీ భావిస్తోంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనూ కాపు సామాజికవర్గ ఓట్లు అధికంగానే ఉన్నాయి. ఇది ఇవ్వడానికి టీడీపీ సిద్ధంగా ఉన్నప్పటికీ పొత్తులు, మార్పులు అంటున్నారు కావున రాధాకు అంత ఇంట్రెస్ట్ లేకపోవచ్చు.
Vangaveeti Radha: తెరవెనుక రాజకీయాలకు..?
విజయవాడ తూర్పు చూసుకుంటే అక్కడ గద్దె రామ్మోహన్ స్ట్రాంగ్ గా ఉన్నారు. పునర్విభజనకు ముందు ఆయన అక్కడ నుండే పోటీ చేశారు కాబట్టి అక్కడ నుండి పోటీ చేయడానికి వంగవీటి రాధా సుముఖత వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయి. గద్దె రామ్మోహన్ ను ఒక వేళ గన్నవరం పంపితే ఆ స్థానం వంగవీటి రాధాకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కానీ వంగవీటి రాధా మాత్రం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్నే అడుగుతున్నారని సమాచారం. మరో సమాచారం ఏమిటంటే వంగవీటి రాధ ఎక్కడ నుండి పోటీ చేయడం లేదనీ, ఆయనకు టీడీపీ ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉందని కూడా ఒక వాదన వినబడుతోంది. వంగవీటి రాధాను తెరవెనుక రాజకీయాలకు ఉపయోగించుకోవాలని టీడీపీ ఆలోచన చేస్తోందని టాక్. వంగవీటి రాధా పోటీ చేస్తారా..? చేయరా..? అనే దానిపై మరో ఆరు నెలల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?