Viveka Murder Case: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు చివరిదశకు చేరుకుంది. ఈ హత్య కేసు నిందితుల్లో ఒకడైన వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారి వ్యాంగ్మూలం ఇవ్వడంతో నలుగురుని సీబీఐ ఇప్పటికే అరెస్టు చేసింది. ఇక వివేకా హత్య కేసులో పాత్రధారులపై సీబీఐ దృష్టి పెట్టగా సీబీఐకి సినిమా కష్టాలు ప్రారంభం అయ్యాయి. సీబీఐపైనే ఆరోపణలు ఇస్తూ ఇటీవల గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి అనంతపురం ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. తనను నేరం ఒప్పుకోవాలని బలవంతం చేస్తున్నారనీ, కొందరి పేర్లు చెప్పాలని ఒత్తిడి చేస్తున్నారు. పది కోట్లు ఇస్తామని ఆశపెట్టారంటూ సీబీఐపై ఆరోపణలు చేస్తూ తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరాడు. సీబీఐకి చుక్కలు చూపిస్తున్నా వాళ్లు మాత్రం పకడ్బందీగానే దర్యాప్తును కొనసాగిస్తున్నారు. హత్యకు గురైన వివేకానందరెడ్డి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి సోదరుడు, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ కు కావడంతో సీబీఐ కూడా ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ కేసు దర్యాప్తులో సీబీఐ ఏ చిన్న పొరపాటు చేసినా దేశ స్థాయిలో ఆ దర్యాప్తు సంస్థ పరువు పోతుంది. అసలే ఈ కేసును హైకోర్టు అప్పగించింది.
Viveka Murder Case: గోర్ల భరత్ యాదవ్ ను విచారించిన సీబీఐ
దీంతో సీబీఐ అన్ని కోణాల్లోనూ దర్యాప్తును కొనసాగిస్తూ వస్తోంది. దర్యాప్తులో భాగంగా తాజాగా జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్న గోర్ల భరత్ యాదవ్ ను సీబీఐ విచారించింది. ఇప్పుడు భరత్ యాదవ్ ను ఎందుకు పిలిపించారంటే..కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు శివశంకరరెడ్డిని సీబీఐ అరెస్టు చేసిన తరువాత గోర్ల భరత్ యాదవ్ మీడియా ముందుకు వచ్చి వివేకా హత్య కేసు విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. భరత్ యాదవ్ నవంబర్ 22న మీడియా ముందుకు వచ్చి ఏమి చెప్పారంటే..వివేకానంద రెడ్డి హత్యకు ప్రధాన సూత్రధారుడు ఆయన అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి అనీ, కేవలం ఆస్తి కోసమే వైఎస్ వివేకా హత్య జరిగిందనీ సునీల్ యాదవ్ తనతో చెప్పాడన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి సన్నిహితురాలు షమీం కు ఆస్తి వెళుతుందని ఉద్దేశంతోనే వివేకానందరెడ్డి హత్య జరిగినట్లు ఆయన తెలిపారు. హత్య గురించి వెల్లడించకపోవడానికి గల కారణం కేవలం ప్రాణభయం మాత్రమేననీ, మీడియాలో తనపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో తనకు తెలిసిన విషయాలను మీడియాతో నేడు చెప్పాల్సి వచ్చిందన్నారు. హత్యకు గల కారణాలను మొట్టమొదటగా సీబీఐకి అందించిన వ్యక్తిని నేనేనని భరత్ యాదవ్ వెల్లడించారు.
కొత్త ఆరోపణలు చేసిన వారిని విచారిస్తున్న సీబీఐ
ఇప్పుడు సీబీఐ .. శివశంకరరెడ్డి అరెస్టు తరువాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన వాళ్లను, ఎస్పీని కలిసి తమకు రక్షణ కావాలంటూ ఆరోపణలు చేసిన వాళ్లను విచారించేపనిలో పడింది. ఇందులో బాగంగా మొదట భరత్ యాదవ్ ను సీబీఐ విచారించారు. తరువాత గంగాధరరెడ్డి, ఆ తరువాత శంకరరెడ్డిలను విచారించనున్నది. వీళ్లను సీబీఐ విచారించడం వల్ల మరిన్ని విషయాలు వెల్లడి అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సీబీఐ వాళ్లపై వస్తున్న ఆరోపణలను చెరిపివేసుకోవడంతో పాటు హత్యకేసులో అసలైన పాత్రధారులకు ఉచ్చు బిగించేందుకు సన్నద్దం అవుతోంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తే కేసును పక్కదారి పట్టించేందుకు కొందరు వ్యక్తులను బయటకు తీసుకువచ్చి తమపై ఆరోపణలు చేయిస్తారని గ్రహించిన సీబీఐ రివర్స్ అటాక్ ఇచ్చేందుకు సన్నద్దం అయ్యిందన్న వార్తలు వస్తున్నాయి. మరో రెండు వారాల్లో సీబీఐ.. కోర్టుకు ఫైనల్ రిపోర్టు ఇచ్చే అవకాశం ఉందని సీబీఐ వర్గాల ద్వారా తెలుస్తోంది.