ఎలాంటి రచయిత కు అయినా ప్రశంసను మించిన బహుమానం ఉండదు. అతను ఏ రంగంలో నిష్ణాతుడైనా అవతల వారి నుంచి మెప్పు పొందితే చాలు అతని పెన్ను మరింత చురుగ్గా పని చేస్తుంది. అయితే దశాబ్దాల కాలంగా చాలామంది రచయితలు వార్తాపత్రికలో ఎంతో మంచి కాలమ్స్ వేస్తున్నా వారికి అంత ఆదరణ లేదు. అందరూ సైలెంట్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగని వారి ప్రశంసలు కోసమే రాయడం లేదు కానీ వారు ఏ విషయంలో మెరుగుపడాలి… లేదా రోజు రోజుకి అప్డేట్ అవుతున్న ప్రపంచంలో ఎలాంటి కొత్తదనం కోరుకుంటున్నారో రచయితలకు తెలియకుండానే పోతుంది. ఇప్పుడు ఉన్న ఈ బిజీ లైఫ్ లో సంపాదకులకు ఉత్తరాలు రాయడం, వ్యాసం కింద కామెంట్ పెట్టడం లేదా కనీసం ఈ–మెయిల్ చేసే తీరిక కూడా జనాలకు లేకుండాపోతుంది.
కానీ వెబ్సైట్స్ వచ్చాక ఓ సౌలభ్యం వచ్చింది. ఒక రచనను ఎంతమంది ఎంతసేపు చదువుతున్నారో.. వారికి ఎంత నచ్చి మిగిలిన వారికి కూడా షేర్ చేస్తున్నారు అన్న విషయంపై ఒక అవగాహన ఏర్పడుతుంది. ప్రింట్ మీడియాలో ఆ సౌకర్యం లేక అంతా ఎడిటర్ ఇష్టం, టేస్ట్, జడ్జిమెంట్ మరియు ఊహ పై ఆధారపడి ఉంటుంది. గట్టిగా చెప్పాలంటే ప్రింట్ మీడియాలో వైవిద్యం మాట పక్కన పెడితే మనిషి ఎదుగుదలకు అవసరమైన అన్నీ అంశాలను కవర్ చేయడం లేదు. దాదాపు అంతా లోకల్ గోల మరియు రాష్ట్ర రాజకీయాలు. ఇక ఏదైనా ‘సంచలనం‘ ఉంటేనే జాతీయ రాజకీయాలైనా.
కానీ వెబ్ సైట్స్ లో మాత్రం అలా కాదు. ఎక్కడో అమెరికాలో నల్లజాతీయుడు పైన వివక్ష జరిగితే రెండు క్షణాల్లో మీ ఫోన్ లో బెల్ మోగుతూ నోటిఫికేషన్ వస్తుంది. అంతర్జాతీయంగా మరియు హెల్త్ పరంగా ఇంకా టెక్నాలజీ పరంగా పూటకొక అప్డేట్ వస్తుంది. ఈ ఈఎంఐ లు, హోమ్ లోన్ లు, జీవిత బీమా లు, లైఫ్ ఇన్సూరెన్స్ లపై కావలసినంత సమాచారాన్ని రీసెర్చ్ చేసి మరీ అందిస్తున్నారు. ఇక ఇప్పుడు వస్తున్న వార్తాపత్రికల్లో కనీసం నిండుగా పేపర్లు కూడా రావడం కష్టం అయిపోయింది. కానీ ఈ లాక్డౌన్ సమయంలో వెబ్ సైట్స్ ఆఫర్స్ అందరూ ఇళ్ల దగ్గరే ఉండి గంటకు వందల సంఖ్యలో ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తున్నారు.
ప్రింట్ మీడియా పాతదే. ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్‘ అన్న బిరుదుని సార్థకం చేస్తుందా అన్న మాటను పక్కన పెడితే…. గంటకు ఒకలా మారుతున్న గోల్డ్ రేట్ ని ఎప్పటికప్పుడు పాత్రికేయుదికి అందించగలుగుతుందా..? అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. వారికి ఉండవలసిన పరిమితులు వారికి ఉన్నాయి. ఇక కరోనా లాంటి సంక్షోభం వచ్చి మీడియా అంతా కుదేలు అయిపోతే సగానికి సగం మంది ఉద్యోగాలు లేకుండా గడపాల్సిన పరిస్థితి. మళ్లీ పరిస్థితి బాగుంటే వారి ఊపు వేరే అనుకోండి కానీ వైవిధ్యభరితమైన కథనాలు… పక్షపాతం లేని హెడ్డింగులు…. ఒకే టాపిక్ పై నాలుగు రకాల ఆర్టికల్స్ రాయగల సౌలభ్యత వారికి ముమ్మాటికీ లేకుండా పోతుంది అనే చెప్పాలి.
సరిగ్గా వెబ్సైట్స్ ఫాలో అయ్యే వారికి పక్క రోజు పేపర్ చూస్తుంటే ఇదంతా ఎప్పుదో జరిగింది కదా అన్న ఫీలింగ్ వస్తుంది. ఇక తెలుగు వారి మీడియా, ఇళ్ళకు వచ్చే దినపత్రికలు, వారపత్రికలు, టీవీ ఛానల్స్ ఏదైనా సరే ఎప్పుడు లోకల్ గోల. ఇతర రాష్ట్రాల గురించి, విదేశాల గురించి సాంస్కృతిక వార్తలు గురించి పెద్దగా ఊసే ఉండదు. సరే ఆ రాజకీయాలపైనా పూర్తిగా కవర్ చేస్తున్నారు అంటే ఫలానా దేశంలో ఎన్నికలు జరిగి అధికారం చేతులు మారిందని పొడిగా చెప్పి ఊరుకుంటారు. కానీ రాష్ట్ర రాజకీయాలు అలవాటైపోయి బోర్ కొట్టేసిన ప్రజలకు విదేశీ రాజకీయాల్లో వారి గెలుపోటములు మరియు ఆయా పార్టీల విధివిధానాలు ఏమిటో వంటి విషయాలపై అసలు అప్డేట్ ఉండవు.
అయితే తెలుగు పాఠకుల విషయానికి వస్తే మాత్రం ఇలా పరిచితం కాని అనేక అంశాలపై రాసిన రచనలను ఎందుకో పెద్దగా ఆచరించడం లేదు. ఈ మధ్యకాలంలో కొద్దిగా మార్పు వస్తుంది కానీ వారిని అలా కొత్తవాటి జోలికి పోనివ్వకుండా చేస్తున్న విద్యా విధానాన్ని మరియు పత్రికా రంగాన్ని తప్పుపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్కూళ్లల్లో లైబ్రరీలు ఉండవు. ఎక్స్ట్రా–కరికులర్, కో–కరికులర్ యాక్టివిటీస్ వుండటం లేదు. టీచర్లు రాష్ట్రాల, దేశాల విషయాలు విద్యార్థులకు పరిచయం చేయటం లేదు. ఎంతసేపూ మార్కుల, ర్యాంకుల గోలే. లెక్కలు, సైన్స్ తప్ప తక్కిన సబ్జక్టులకు, అవి చెప్పే టీచర్లకు విలువే లేదు. దాంతో ఆ సబ్జక్టులను ఆస్వాదించే శక్తి కోల్పోతున్నారు.
ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో…. మరెన్నో కానీ సగటు పాఠకుడికి సంపూర్ణమైన రీడింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్న మీడియం ఏది అన్న విషయం పై ఇంతకన్నా క్లారిటీ అవసరం లేదనుకుంటున్నాం.
Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!