AP Cabinet: ఆంధ్రప్రదేశ్ లో మంత్రి వర్గ విస్తరణ అంశంపై అనేక రకాలుగా చర్చలు జరుగుతున్నాయి. వైసీపీలో అంతర్గతంగా ఏ ఇద్దరు నాయకులు కలుసుకున్నా.. ఎవరికి మంత్రి పదవి ఇస్తారు..? అనే చర్చ జరుగుతోంది. అందులో జిల్లాల వారీగా చూస్తున్నారు..! సామాజికవర్గాల వారీగా చూస్తున్నారు..! ప్రాంతాల వారీగా చూస్తూ అంచనాలు వేసుకుంటున్నారు..! అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక కమ్యూనిటీగా భావిస్తున్నది కమ్మ సామాజికవర్గం. ఈ సామాజికవర్గంలో ఎవరికి కొత్తగా మంత్రి పదవి ఇవ్వబోతున్నారు..? ఇప్పుడు ఉన్న కొడాలి నానిని కొనసాగిస్తారా..? లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా డిస్కషన్ జరుగుతోంది.
AP Cabinet: టీడీపీని, చంద్రబాబును వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంలో
కొడాలి నాని వైసీపీలో ఉన్న కమ్మ నాయకులందరికీ ఒక పెద్ద. చంద్రబాబుకు, టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న కమ్మ సామాజికవర్గం వారిని వైసీపీకి దగ్గర చేయడంలో కొడాలి నాని చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కమ్మ సామాజికవర్గం నాయకులు ఎవరైనా సీఎం జగన్ ను కలవాలన్నా, వైసీపీలో పెద్దలను కలవాలన్నా ముందుగా కొడాలి నానిని కలిసి ఆయన ద్వారా మాత్రమే వెళుతుంటారు. ఇప్పుడు ఆ సామాజికవర్గంలో కొత్తగా మంత్రి పదవులు ఊరిస్తున్నాయి. కొడాలి నానిని మంత్రి పదవి నుండి తప్పించి ఆయనకు పార్టీలో కీలక బాధ్యతలు ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తోంది. మరో వైపు కొంచెం ధాటిగా మాట్లాడుతున్నారు కాబట్టి ఆయనను కొనసాగిస్తే బెటర్ అన్న భావన కూడా పార్టీలో ఉంది. టీడీపీని, చంద్రబాబును వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంలో ఆయన దూకుడు పనికి వస్తుందన్న భావన ఉంది. అయితే కొడాలి నానిని కొనసాగించే అవకాశాలు లేవు అని అంటున్నారు. ఆయన స్థానంలో ఇద్దరు ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి.
AP Cabinet: తలశిల రఘురామ్ కు దాదాపు మినిస్టర్ కన్ఫర్మ్..?
అందులో తలశిల రఘురామ్ కు దాదాపు మినిస్టర్ కన్ఫర్మ్ అని అంటున్నారు. ఎందుకంటే తలశిల రఘురామ్ వైసీపీ ఆవిర్భావం నుండి జగన్మోహనరెడ్డితో కలిసే ఉన్నారు. జగన్మోహనరెడ్డి పాదయాత్ర చేసిన నప్పుడు, వైఎస్ జగన్ జైలులో ఉన్న సమయంలో షర్మిల పాదయాత్ర చేసిన సమయంలో, అంతకు ముందు ఓదార్పు యాత్రలోనూ తలశిల రఘురామ్ రూట్ మ్యాప్ ఇవ్వడం, స్థానికంగా కోఆర్డినేషన్ చేసుకుంటూ ఏర్పాట్లు పర్యవేక్షించడం తదితర కీలక బాధ్యతలను నిర్వహించారు. జగన్మోహనరెడ్డికి పార్టీ ఆవిర్భావం నుండి పూర్తి స్థాయిలో వ్యక్తిగతంగా, పార్టీ పరంగా సహాకరించారు తలశిల రఘురామ్. అందుకే ఆ కమ్యూనిటీ నుండి తలశిల రఘురామ్ కు మంత్రిపదవి ఇస్తే బాగుంటుంది అని జగన్ ఆలోచన చేస్తున్నారట. ఆ క్రమంలో భాగంగానే నాలుగు నెలల క్రితం ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారని అంటున్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కూడా చాలా సీరియస్ గా మంత్రి పదవి కోసం ట్రై చేశారు. ముందుగా ఆయనకు కూడా అవకాశాలు ఉన్నాయని అందరూ భావించారు.
వసంత కు కొండపల్లి దెబ్బ
అయితే వసంత కృష్ణ ప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న మైలవరం నియోజకవర్గంలోని కొండపల్లి మున్సిపాలిటీ వైసీపీ కోల్పోయింది. ఆ ప్రభావం వసంత కృష్ణ ప్రసాద్ పై బాగా పడింది. అక్కడ మున్సిపాలిటీ ఓడిపోవడంతో వైసీపీ ఆ నియోజకవర్గంలో ఆత్మరక్షణలో పడింది. ఓటమి, పార్టీలో ఆరోపణలు, మరో వైపు వివాదాలు చుట్టుముట్టడంతో వసంత కృష్ణప్రసాద్ పేరు పరిశీలనలో నుండి తీసేసారు అని అంటున్నారు. మరో పక్క దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పేరు ప్రచారంలోకి వచ్చినప్పటికీ అది ఒక పుకారు మాత్రమే. ఆయన రాజకీయంగా పూర్తి స్థాయిలో పరిపక్వత లేదు. పెద్ద గా సబ్జెట్ కూడా లేదు. రాజకీయంగా ప్రాధమిక దశలో ఉన్నారు దానికి తోడు అనేక ఆరోపణలు కూడా రావడంతో ఆయనకు అవకాశాలు లేవు అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొడాలి నానిని కొనసాగిస్తే కొనసాగించవచ్చు. ఒక వేళ ఆయనను కొనసాగించని పక్షంలో తలశిల రఘురామ్ కే నూటికి నూరు శాతం మంత్రి పదవి వరిస్తుంది అనేది పార్టీ వర్గాల నుండి అందుతున్న సమాచారం.