న్యాయవ్యవస్థ అవినీతికి.., లాబీయింగులకు.., భజనలకు.., అంతర్గత రాజకీయాలకు ఏమి అతీతం కాదు..! కాకపోతే అత్యున్నత స్థాయిలో ఉంది కాబట్టి ఇన్నాళ్లు ఎవరూ దాని జోలికి వెళ్ళలేదు. వెళ్లినా మధ్యలో సాకిలపడ్డారే తప్ప పోరాడలేదు. కానీ ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి సుప్రీమ్ కోర్టు సీనియర్ న్యాయమూర్తిపై అవినీతి ఆరోపణలు చేయడం.., కొన్ని ఆధారాలను జత చేస్తూ సుప్రీమ్ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం.., రాష్ట్రంలో హైకోర్టులో తీర్పుల వెనుక దురుద్దేశాలను చెప్పడం… సంచలనమే. ఏపీ సీఎం మూడు నెలల కిందటే దానికి తెరతీశారు. సుప్రీమ్ సీజేకి లేఖ రాశారు. ఆ లేఖ పరిణామాలు, పర్యావసానాలు, అంతర్గత వ్యవహారాలు చకచకా జరిగిపోతున్నాయి.
ఇప్పటి వరకు జరిగినవి ఇలా..!
సీఎం జగన్ లేఖ విషయంలో ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను ఇండియన్ ఎక్స్ ప్రెస్ తన కథనంలో పేర్కొంది. ఆ కథనంలో అంశాలను ప్రస్తావిస్తూనే.., ఇక జరగబోయే అంశాలను కూడా ఓ సారి చూద్దాం..!
“జగన్ లేఖని సుప్రీమ్ సీజే సీరియస్ గా తీసుకున్నారు. దాన్ని పిర్యాదు రూపంలో అఫడవిట్ లా పంపించాలని కోరారు, జగన్ కూడా అలాగే పంపించారు. ఈ లేఖలో అంశాలపై సీజే బొబ్దే జస్టిస్ రమణ, హైకోర్టు సీజే జేకే మహేశ్వరీల నుండి వివరణ కూడా తీసుకున్నారు. ఈ లేఖలో అంశాలపై తన సహచర న్యాయమూర్తులతో కూడా చర్చించారు. ఈ లేఖ నేపథ్యమే ఏపీ హైకోర్టు సీజే మహేశ్వరీ బదిలీ” అంటూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం సారాంశంగా ఉంది. అంటే లేఖ అంశంలో అంతర్గతంగా సైలెంట్ గా జరుగుతున్న వ్యవహారాలను ఈ కథనంలో ప్రస్తావించారు. కాకపోతే కొన్ని సందేహాల్ని అలాగే ఉంచారు. స్పష్టత ఇవ్వలేదు.
* జగన్ లేఖ వలనే ఏపీ హైకోర్టు సీజే బదిలీ జరిగితే దేశంలో ఒకేసారి పది రాష్ట్రాల హైకోర్టుల సీజేల బదిలీ జరిగింది. జగన్ లేఖ కారణంగానే బదిలీ జరిగితే కేవలం ఏపీ హైకోర్టు సీజే బదిలీ మాత్రమే జరగాలి..!
* ఎవరిపై అయినా పిర్యాదు అందినప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్న వారి నుండి వివరణ కోరడం న్యాయవ్యవస్థలో మొదటి అడుగు మాత్రమే. ఆ వివరణతో సీజే సంతృప్తి చెందితే అక్కడైతే వివాదం ముగిసినట్టే.., ఒకవేళా సంతృప్తి చెందకపోతే పూర్తిస్థాయి విచారణకు ఆదేశిస్తారు. అంటే జగన్ లేఖ విషయంలో సీజే మొదటి అడుగు వేసినట్టు ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనంలో రాసింది. కానీ ఈ వివరణపై సీజే సంతృప్తి చెందారా..? లేదా..? తదుపరి నిర్ణయం ఏమిటి..? అనే స్పష్టత ఇవ్వలేదు.
లోతుగా విచారణకు ఆదేశిస్తే..!!
ఆ కథనంలో అంశాలు పక్కన పెట్టి ఈ వ్యవహారాన్ని ఓ సారి పరిశీలిస్తే… సాధారణంగా ఇటువంటి పిర్యాదులు, లేఖలపై సుప్రీమ్ ప్రధాన న్యాయమూర్తి మూడు విధాలుగా స్పందిస్తారు. న్యాయవృత్తికి సంబంధం లేకపోతే వదిలేస్తారు. ఇది వృత్తిపరమైన ఆరోపణలు అయితే సదరు న్యాయమూర్తుల నుండి వివరణ తీసుకుంటారు. ఈ వివరణతో సంతృప్తి చెందకపోతే చివరి దశగా “ఇన్ హౌస్ కమిటీ విచారణ”కు ఆదేశిస్తారు. విశ్రాంత న్యాయమూర్తి, మరో ఇద్దరు న్యాయమూర్తులతో కమిటీ వేసి విచారణకు ఆదేశిస్తారు. దీనిలో ప్రస్తుతం జస్టిస్ రమణ, హైకోర్టు సీజేల వివరణ వరకు జరిగింది. ఆ తర్వాత ఏమి జరగలేదు. ఈ అంశంపై ఒకవేళ లోతుగా విచారణకు ఆదేశిస్తే మాత్రం దేశంలో న్యాయవ్యవస్థలో ఒక పెద్ద సంచలనమే. ఏం జరిగినా ఈ మార్చి లోగా ఒక స్పష్టత వచ్చేయాలి. ఏప్రిల్ నెల 23 న ప్రస్తుత సీజే బొబ్ధి రిటైర్ అవ్వనున్నారు. ఆయన తర్వాత సీనియారిటీ జాబితాలో జస్టిస్ రమణ ఉన్నారు. రమణ ఆ స్థానానికి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో సీఎం జగన్ లేఖ రాశారు కాబట్టి.., మర్చి నెలాఖరులోగా దీనిపై ఒక స్పష్టత రావాల్సి ఉంది. లేకపోతే రమణకి లైన్ క్లియర్ అయినట్టే. ఆ ఒక్క నెలలో జరిగేది ఏమి ఉండదు. ఈ మొత్తం అంశంలో “రాజకీయం, బీజేపీ పెద్దల ఆలోచన, కొన్ని అంతర్గత లాబీయింగులు, సంప్రదింపులు” ముడిపడి ఉన్నాయి. సో.., ప్రస్తుతానికి విచారణకు ఆదేశించకపోయినప్పటికీ.., విచారణ చేయిస్తారా..? లేఖని వదిలేస్తారా..? అనేది మాత్రం ఈ నెలలో ఒక స్పష్టత రానుంది..!!