YS Jagan: “151 సీట్లు.. 156 లక్షల ఓట్లు.. అన్నిటికీ మించి 21 మంది ఎంపీలు.. వారి కంటే ప్రభావితంగా ఉండే ఆరుగురు రాజ్యసభ సభ్యులు.. ఈ చివరి సంఖ్య చాలు జగన్ చేతిలో కేంద్రం ఉండడానికి.., జగన్ కి వెంట్రుక వాసి హాని కూడా లేకుండా బీజేపీ చూసుకోడానికి.. జగన్ కి అన్నివిధాలా బీజేపీ రక్షణగా ఉందనడానికి..” ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలను సాకుగా చూపి రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలనను టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ నేతల బృందం ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కలిసి ఓ వినతి పత్రాన్ని అందించారు. అలాగే ప్రధాన మంత్రి మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ లకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు.., దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే చంద్రబాబు బృందం ఢిల్లీకి వెళ్లడంతో వైసీపీకి, జగన్మోహనరెడ్డికి దడ పుడుతోందంటూ ఏపిలోని టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది. ఢిల్లీ పెద్దల నుండి జగన్ కి ముప్పు తప్పదంటూ వరుస కథనాలు వండి వారుస్తుంది.. కానీ జగన్ కళ్ళ రెప్ప.., కాళ్ళ గోరు కూడా చెదిరిపోకుండా బీజేపీ చూసుకోవాల్సిన అవసరం ఉంది..!
YS Jagan: రాజ్యసభలో జగన్ బలం/ బలగం..!!
బీజేపీ కేంద్రంలో బలంగా ఉన్నా.. పార్లమెంట్ వరకు మాత్రం పరిమితం. రాజ్యసభలో మాత్రం బీజేపీ ఇతర పార్టీలపై ఆధారపడాల్సిందే. అందులో మొదటి స్నేహితుడు జగన్… వాస్తవానికి చంద్రబాబు ఢిల్లీలో నేతల వద్ద మోకాళ్ల దండ వేసినా రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన రాదు, 2024 వరకూ జగన్మోహనరెడ్డి పరిపాలనకు ఎటువంటి ఇబ్బందులు ఉండదు అనేది సుస్పష్టం. ఎందుకంటే… ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డిఏ సర్కార్ కు టీడీపీ అధినేత చంద్రబాబుతో కంటే వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తోనే విపరీత అవసరం ఉంది. ఇటు జగన్ కు కేంద్రంలోని పెద్దలతో అవసరం ఉంది. అటు కేంద్రానికి జగన్ తో అవసరం ఉంది. అందుకే ఉభయ కుసలోపరిగా పరస్పర సహకారం అందిపుచ్చుకుంటున్నారు. వైసీపీకి రాజ్యసభలో ఉన్న బలమే జగన్ కు శ్రీరామరక్షగా నిలుస్తోంది.
* రాజ్యసభలో మొత్తం 245 మంది సభ్యులు ఉండగా.. ఏదైనా బిల్లు ఆమోదించాలంటే 123 మంది మద్దతు తప్పనిసరి. కానీ బీజేపీకి ప్రస్తుతం 92 మంది ఉండగా.., వచ్చే ఏడాది మే నాటికీ 75కి పడిపోతుంది. అంటే ఇప్పటికే బలం లేదని బీజేపీ ఆందోళనలో ఉండగా… వచ్చే ఏడాది మరింత తక్కువ కానుంది. బీజేపీ సభ్యుల పదవీకాలం పూర్తవ్వనుంది. బీజేపీ తర్వాత కాంగ్రెస్ ప్రస్తుతం 34 ఉండగా.., మరో ఆరునెలల్లో కాంగ్రెస్ బలం 45 కి పెరగనుంది. ఆ తర్వాత స్థానంలో అత్యధిక బలం ఉన్న పార్టీల్లో తృణమూల్ కాంగ్రెస్ కు 12, డీఎంకే పది, వైసీపీ ఆరు, టీఆర్ఎస్ ఏడు రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. టీఎంసీ, డీఎంకే పార్టీలు ఎట్టిపరిస్థితుల్లోనూ బీజేపీకి మద్దతు ఇవ్వరు. సో.. వైసీపీ, టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుల బలం కోసం కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ అవసరమైనప్పుడు వీరి కోర్కెలను తీర్చాల్సి ఉంటుంది. మరో కీలకమైన విషయం ఏమిటంటే త్వరలో జరగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికకు వైసీపీ బలం కీలకం కానున్నది. ఈ కారణాల రీత్యా కేంద్రంలోని బీజేపీ.. వైసీపీ అధికారం జోలికి వచ్చే పరిస్థితి లేదు. టీడీపీ నేతలు, ఆ పార్టీకి బాగా ఊదే పత్రికలు రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన అంటూ గొంతు చించుకుని అరిచినా ఏమీ ఉపయోగం ఉండదు. కేంద్రంలో జగన్ చక్రం తప్పితే మరో సారి టీడీపీకి రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా దక్కకపోవచ్చు. మరో విషయం ఏమిటంటే ఏపిలో వైసీపీ చాలా బలంగా ఉంది. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి సహకరించకపోయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగిస్తూ ఉన్నారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెద్దగా లేదు. ప్రజా బలం ఉన్న ప్రభుత్వంపై కేంద్రం కూడా ఏమీ చేయలేదు.