YS Jagan in Delhi: ఏపీ సీఎం వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. నిన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో, నేడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అయితే సీఎం జగన్మోహనరెడ్డి ఢిల్లీకి ఎందుకు వెళ్లారు..? ప్రధానంగా చర్చించిన అంశాలు ఏమిటి..? బయటికి ఏమి చెబుతారు..? లోపల ఏమి జరుగుతుంది..? జగన్ ఢిల్లీకి ఎప్పుడెప్పుడు వెళ్లారు..? అనే విషయాలను ఒక సారి పరిశీలిస్తే.. 2019 లో గెలిచిన తరువాత సీఎం జగన్ ఒక సారి వెళ్లారు. ఆ తరువాత 2020 ఆగస్టు, అక్టోబర్, 2021 ఫిబ్రవరి, జూలై, డిసెంబర్, ఈ ఏడాది ఏప్రిల్ లో జగన్ ఢిల్లీకి వెళ్లారు. జగన్మోహనరెడ్డి ఢిల్లీకి వెళ్లి వచ్చిన ప్రతి సారి ఏదో ఒక సెన్సేషన్ జరుగుతూనే ఉంది. ప్రస్తుత సూప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై అప్పటి ప్రధాన న్యాయమూర్తికి గత ఏడాది సీఎం జగన్ లేఖ రాశారు. అక్టోబర్ నెలలో జగన్ ఢిల్లీకి వెళ్లిన తరువాత ఆ లేఖ బయటకు వచ్చింది. ఇలా అనేక అంశాలు ఉంటాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
YS Jagan in Delhi: ప్రతి సారి అవే అంశాలపై ప్రకటన
జగన్మోహనరెడ్డి ఢిల్లీకి వెళ్లిన ప్రతి సారి పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని, ప్రత్యేక హోదా, ఆర్ధికంగా రాష్ట్రాన్ని ఆదుకోవాలని, విభజన చట్టంలోని హామీలు అన్నీ నెరవేర్చాలని ఇలా రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలు కోరినట్లు ప్రకటన విడుదల అవుతుంటుంది. గత మూడేళ్లుగా సీఎం జగన్మోహనరెడ్డి ఢిల్లీకి వెళ్లి వచ్చిన ప్రతి సారి ఈ అంశాలపై మాట్లాడినట్లుగా ప్రకటన వస్తుంటుంది. అయితే కేంద్ర పెద్దలతో చర్చించిన అంశాల్లో 5 నుండి పది శాతం వరకూ మాత్రమే బయటకు తెలియజేస్తుంటారు. మిగతా రాజకీయ పరమైన అంశాలకు సంబంధించిన వివరాలు బయటకు రావు. ప్రధానంగా ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి మద్దతుపై చర్చ జరుగుతుంది. ఎందుకంటే.. మరో నెల రోజుల్లో రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్ధి గెలవాలంటే వైసీపీ మద్దతు ఆ పార్టీకి అవసరం. అందుకే ఈ అంశంపై ప్రధాని మోడీతో చర్చ జరుగుతుంది. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, ప్రత్యేక హోదా ఇవన్నీ గతం నుండి చేస్తున్న విజ్ఞప్తులే. వీటి కోసం ప్రత్యేకంగా ఇప్పుడు సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేదు.
రాష్ట్రపతి ఎన్నికలకు వైసీపీ మద్దతు
ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలు ఉన్నందున దీనిపైన వైసీపీ మద్దతు గురించి ప్రధానితో తప్పనిసరిగా చర్చ జరుగుతుంది. ఈ అంశంతో పాటు రాష్ట్రానికి అప్పుల పరిమితి పెంచాలని కోరారు. ఈ ఆర్ధిక సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు పూర్తి అయింది. మే నెలలో 9500 కోట్ల అప్పు తీసుకుంది ఏపి. అంతకు ముందు ఏప్రిల్ నెలలో కూడా దాదాపు 8వేల కోట్లకు పైగా అప్పు తీసుకుంది. అయితే ఈ ఏడాది మొత్తం అప్పు పరిమితి రూ.55వేల కోట్లు మాత్రమే. దానిలో ఇప్పటికే సగంపైగా తీసుకుంటే రాబోయే కాలంలో ఇబ్బంది పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే అప్పు పరిమితి పెంపు కోసం జగన్ ప్రయత్నం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలు అప్పుల కోసం ప్రయత్నిస్తున్నా కేంద్రం అనుమతి ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతోంది. ఓ పది సార్లు కోరితే ఒకటి రెండు సార్లు అవకాశం ఇస్తొంది కేంద్రం.
YS Jagan in Delhi: రాష్ట్రానికి రుణ పరిమితి పెంపు
అయితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అనేక మార్లు కేంద్రం అప్పు తీసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూనే ఉంది. కాకపోతే అనుమతి మంజూరే ఒక్కోసారి ఆలస్యం అవుతూ వస్తొంది. ఈ నెలలో అమ్మఒడి తదితర పథకాలకు నిధులు పంపిణీ చేయాల్సి ఉన్న సందర్భం కావడంతో రుణ పరిమితి పెంపు ప్రధాన అంశంగా ఉంది. మరో ప్రధాన అంశం జనసేన – బీజేపీ రోడ్ మ్యాప్. బీజేపీని రోడ్ మ్యాప్ అడిగాననీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంతకు ముందే ప్రకటించారు. అందుకే రాబోయే ఎన్నికల్లో బీజేపీ స్టాండ్ పైనా చర్చ జరిగే అవకాశం ఉంది. వీటితో పాటు రాజ్యసభలో ప్రవేశపెట్టబోయే కీలక బిల్లులు, వైసీపీ మద్దతుపైనా ప్రధాని మోడీతో జగన్ చర్చ జరుగుతాయి. ఇలాంటి రాజకీయ పరమైన అంశాలు చర్చ జరిగినా అవి బయటకు రావు. సీఎం జగన్మోహనరెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించి అంతర్గత చర్చనీయాంశాలు ఇవి.