వైసీపీ ఆవిర్భావం నుంచి కీలకంగా వ్యవహరిస్తున్న ఆ ముగ్గురు ఇప్పుడు పార్టీలో అఫీషియల్ గా చక్రం తిప్పబోతున్నారు. ఇక పార్టీలో వారి కిందే ఎవరైనా… అవును ఇది అఫీషియల్ పార్టీలో కీలక స్థానాల్లో త్రిమూర్తులకు జగన్ పట్టం కట్టారు. పాలనలో దూకుడు పెంచి సంక్షేమ కార్యక్రమాల అమలుతో దూసుకుపోతున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టారు.
విజయసాయిరెడ్డి త్వరలో రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించాలన్న ఆలోచనలో ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అక్కడ పనిచేస్తున్న విజయసాయిరెడ్డి నాయకత్వానికి జై కొట్టారు. పార్టీలో మొదట్నుంచి నెంబర్ 2గా వ్యవహరిస్తున్న సాయిరెడ్డి ఇప్పుడు ఉత్తరాంధ్ర పగ్గాలను నిర్వహించనున్నారు. అనఫిషియల్ గా ఇప్పటికే పార్టీ పగ్గాలు చూస్తున్న విజయసాయిరెడ్డి ఇకపై పూర్తి బాధ్యతలూ నిర్వర్తించబోతున్నారు. వైజాగ్ కేంద్రంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి కీలక విషయాల్లో సహకారం అందిస్తున్న సాయిరెడ్డి త్వరలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లోనూ కీలక భూమిక పోషించే అవకాశం కన్పిస్తోంది. ఢిల్లీ పెద్దలను ప్రసన్నమయ్యేలా చేయడంలో విజయసాయిది ముఖ్య భూమిక. అక్కడ వ్యవహారాలను చక్కబెడుతూనే… ఏపీలోనూ ఆయన చక్రం తిప్పుతారన్నమాట. అంటే టీడీపీ సర్కారు ఏలుబడిలో చక్రం తిప్పిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తరహాలో ఇప్పుడు సాయిరెడ్డి వ్యవహరిస్తారనుకోవచ్చు. ఇద్దరిదీ సేమ్ టు సేమ్ రోల్ అనుకోవచ్చు. ఇప్పటికే విజసాయికి కీలక బాధ్యతలు అప్పగించినా… జోడు పదవుల లెక్కన వాటిని వదులుకోవాల్సి వచ్చింది. అయితే త్వరలో వైసీపీ, ఎన్డీఏలో భాగస్వామిగా మారుతుందని కూడా చెబుతున్నారు. అలాంటప్పుడు కేంద్ర మంత్రిగానూ విజయసాయిరెడ్డికి అవకాశమూ లభించవచ్చు. అలా కానిపక్షంలో పార్టీలో అఫిషియల్ గా, ఇటు ప్రభుత్వంలో అనఫిషియల్ గా విజయసాయి యాక్టివ్ రోల్ పోషించడం ఖాయం.
వైవీ సుబ్బారెడ్డిఒంగోలు ఎంపీగా పోటీ చేయాల్సిన తరుణంలో ఆయనను తప్పించి మాగుంట శ్రీనివాసులు రెడ్డిని రంగంలోకి దించిన జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత… వైవీని పూర్తిగా పక్కనబెట్టారన్నట్టుగా ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా టీటీడీ ఛైర్మన్ పదవితో బాబాయ్ ను బుజ్జగించారు జగన్. ఛైర్మన్ గిరి ఇచ్చినా… అక్కడ కూడా ఆయన తన ముద్ర వేయలేకపోయారన్న అభిప్రాయం ఉన్నప్పటికీ… స్వయాన బాబాయ్ కావడం, కుటుంబం నుంచి ఒత్తిడి కూడా ఎక్కువవడంతో… వైవీకి కీలక బాధ్యతలు తప్పక లభించాయని తెలుస్తోంది. పార్టీలో విజసాయి తర్వాత స్థానం సుబ్బారెడ్డికేనని తాజా ఎంపికతో రుజువయ్యింది. ప్రస్తుతానికి వైవీ పెద్దగా యాక్టివ్ పాత్రలో కన్పించకపోయినా… తాజా నిర్ణయం తర్వాత ఆయన జోరు పెరగడం ఖాయం. గోదావరి జిల్లాల్లో ముందుగా ఎదురవుతున్న రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ వ్యవహారాన్ని పార్టీ అధినేతకు తలనొప్పిగా లేకుండా చేయాల్సిన బాధ్యత ఆయనది. టీటీడీ భూముల వ్యవహారాన్ని వైవీ సరిగా డీల్ చేయలేదన్న విమర్శ ఉన్న రాజు గారి ఎపిసోడ్ ఎలా చేస్తారన్న ఉత్కంఠ పార్టీ వర్గాల్లో ఉంది.
సజ్జల రామకృష్ణారెడ్డిమొదట్నుంచి వైఎస్సార్ ఫ్యామిలీతో కలిసి ప్రయాణిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి… సాక్షి మీడియా గ్రూపులకు నాయకత్వం వహించి మంచి ఫలితాలను రాబట్టారు. నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్న సజ్జల… అటు చానెల్ ను… ఇటు పార్టీని రెంటిని సమన్వయపరుస్తూ జగన్మోహన్ రెడ్డి దగ్గర మంచి ఫలితాలు రాబట్టారు. వ్యక్తిగతంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉంటూ వచ్చిన సజ్జల జగన్ పాదయాత్రలో కీలకంగా వ్యవహరించారు. 2014లో జరిగిన లోపాలను సరిదిద్దుకుంటూనే…. జగన్మోహన్ రెడ్డి అడుగులో భాగమయ్యారు. ప్రస్తుతం పాలనలో జగన్మోహన్ రెడ్డికి తోడుగా నిలుస్తూ ప్రభుత్వ వ్యూహాలను, లక్ష్యాలను మీడియా ముందుకు తీసుకొస్తున్నారు. 2019 ఎన్నికల్లో రాయలసీమ జిల్లాలో టికెట్ల పంపిణీ సత్ఫలితాలనిచ్చింది. కర్నూలు, కడప స్వీప్ చేయడంతోపాటు, టీడీపీని కేవలం నాలుగు సీట్లకే పరిమితం చేయడంలో సజ్జల వ్యూహం పనిచేసిందంటారు. తాజాగా సజ్జలకు రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల బాధ్యతలు జగన్ అప్పగించి పెద్ద పీటవేశారు.
రాష్ట్రంలో 20 ఏళ్ల పాలన సాగించాలని… అందుకు తగిన విధంగా వ్యవహారాలను చక్కబెట్టేందుకు అటు బ్యూరోక్రసీతోపాటు, సొంత మనుషుల అవసరాన్నిగుర్తించిన జగన్… అందుకు నాలుగేళ్ల ముందే కార్యాచరణ మొదలుపెట్టారు. అటు ఢిల్లీ… ఇటు గల్లీ రెంటిలోనూ పట్టు సాధించాలంటే తనకు అత్యంత విశ్వసనీయమైన వ్యక్తుల టీం అవసరం. ఆ టీంలో ఇప్పుడు ముగ్గురు అతిరథులకు బాధ్యతలు అప్పగించేశారు జగన్మోహన్ రెడ్డి. ఐతే దేశానికి రక్షణ కవచంలా ఉన్న త్రివిధదళాల తరహాలోనే జగన్మోహన్ రెడ్డి ముగ్గురిని రంగంలోకి దించారు.
Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!