ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం లో జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం చెలరేగుతున్న తీరు చూస్తుంటే విపక్షాలు హడలిపోతున్నాయి. అవినీతి ఆరోపణలు ఉన్న మాజీ మంత్రులు మరియు ఎమ్మెల్యేలను అవినీతి నిరోధక శాఖ మరియు సిబిఐ అధికారులు చీల్చి చెండాడుతున్న తీరు చూస్తుంటే…. తర్వాత ఎవరని ప్రజల్లో ఆసక్తి… మా దగ్గరికి ఎప్పుడు వస్తారో అని ప్రతిపక్ష నాయకుల్లో భయం రెండూ మొదలైపోయాయి. సరే చిన్న బండరాళ్లను ఏం పెకలిస్తాం…. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్లు జగన్ చివరికి నిర్ణయించుకున్నాడని వార్తలు బయటకు వస్తున్నాయి.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి కష్టకాలము దాపురించినట్టు ఉంది. ఈఎస్ఐ కేసులో అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసిన తరువాత చింతమనేని ని అదుపులోకి తీసుకోగా ఉదయాన్నే జెసి ప్రభాకర్ రెడ్డి మరియు అతని తనయుడు అశ్మిత్ రెడ్డి లను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే “ఇదంతా వటవృక్షాన్ని పెకలించేందుకు జరుగుతున్న సన్నాహాల్లో భాగం” – అని వైసిపి వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇప్పటికే నారా లోకేష్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది అని అతను మంత్రిగా ఉన్నప్పుడు చేపట్టిన కాంట్రాక్తుల విషయమై లోతుగా తవ్వుతున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు జగన్ అదే పనిగా చంద్రబాబు పైకి తన ఫోకస్ ను షిఫ్ట్ చేశారని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. ఎందుకంటే మొన్ననే క్యాబినెట్ సమావేశంలో జగన్ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీములు పై సిబిఐ ద్వారా సమగ్ర విచారణ జరిపించేందుకు ఆదేశించగా అందులో చంద్రన్న కానుక కూడా ఒకటి. దీంతో ఒక్కసారిగా హెరిటేజ్ సంస్థ లో కలవరం మొదలైంది. ఎందుకంటే.. చంద్రబాబు హాయంలో చంద్రన్న కానుకల ప్యాకెట్లలో నెయ్యిని హెరిటేజ్ సంస్థ నుంచే కొనేవారు.
హెరిటేజ్ నెయ్యే కాకుండా… హెరిటేజ్ పాలు, పెరుగు, మజ్జిగ వంటి వాటిని కూడా ఏపీ సర్కారు గతంలో కొనుగోలు చేసింది. అయితే సర్కారు మనదే అన్న భరోసాతో చంద్రబాబు ఈ హెరిటేజ్ ఉత్పత్తులను మార్కెట్ రేటు కంటే చాలా ఎక్కువ ధరలకు కొనేవారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇప్పుడు ఆ లెక్కలన్నీ తవ్వి తీస్తున్న ప్రభుత్వం చంద్రబాబు, లోకేశ్ లను ఇరుకునపెట్టే అవకాశం కనిపిస్తోంది.
ఇన్నాళ్లు చంద్రబాబు కి కాసుల వర్షం కురిపించిన ఈ హెరిటేజ్ కంపెనీ ఇప్పుడు అతని చావుకు వచ్చినట్లు అనిపిస్తోంది అని రాష్ట్ర ప్రజానీకం మాట్లాడుకుంటున్నారు. సర్కార్ విచారణలో ఏవైనా అక్రమాలు జరిగినట్లు తేలితే మాత్రం జగన్ చంద్రబాబు ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మరి చంద్రబాబు లాంటి నాయకుడిని చుట్టూ సంకెళ్లు వేసి కదలనివ్వకుండా బంధించాలి అంటే అంత తేలికైన విషయం కూడా కాదు. ఇక్కడే ఈ రాజకీయ చదరంగం అందరినీ ఎంతో ఉత్కంఠకు గురి చేస్తుంది. మరి చివరికి చెక్ పెట్టేది ఎవరు? పతనమయ్యేది ఎవరు?
Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!