YS Jahgan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి అద్భుతమైన అవకాశం వచ్చింది. దాన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడుకోవచ్చు, అదే విధంగా ఆయన రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవచ్చు. అయితే ఈ అద్భుతమైన అవకాశాన్ని ఆయన వాడుకోవాలంటే ఆయన కొంత రిస్క్ చేయాలి. కేంద్రంతో పోరాడాలి, ప్రజల్లోకి రావాలి. పోరాటానికి దిగాలి. కానీ సీఎం జగన్ కేంద్రంతో పోరాడతారా ? ఈ అద్భుతమైన అవకాశాన్ని వాడుకుంటారా ? ఇది మాత్రం నెరవేరితే 2024 ఎన్నికల్లో సునాయాశంగా గెలుస్తారు. నిన్న నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ ఓ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. “బీహార్ రాష్ట్రం బాగా వెనుకబడి ఉంది, ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశం పరిశీలిస్తున్నాం, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే బీహార్ చాలా ఇబ్బందుల్లో ఉంది. ఇతర రాష్ట్రాల స్థాయికి రావడానికి కొన్నాళ్ల సమయం పడుతుంది. ఆ రాష్ట్రానికి ఏ రకంగా సహకారం, ప్రోత్సాహం ఇవ్వాల్లో అన్నిరకాలుగా ఇస్తాము, ప్రత్యేక హోదా అంశం పరిశీలిస్తాము” అని ఆయన కామెంట్స్ చేశారు. ఈ విషయాన్ని పక్కన పెడితే.. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాకముందు ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చింది. ఆనాడు వెంకయ్యనాయుడు అన్నారు. అమిత్ షా, నరేంద్ర మోడీ కూడా హామీ ఇచ్చారు. ఇప్పుడు కీలక పదవుల్లో ముగ్గురికి ఏపికి ప్రత్యేక హోదా హామీ ఇచ్చిన సంగతీ తెలుసు.
YS Jahgan: ప్రత్యేక హోదా అంశాన్ని వదిలివేశారు
ఇప్పుడు ఏపిలో సీఎం గా ఉన్న వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉండగా అయిదేళ్ల పాటు ప్రత్యేక హోదా కోసం రాజకీయ పోరాటం చేశారు. 25కి 25 మంది ఎంపీలను గెలిపించండి, కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా సాధిస్తామని అన్నారు. కానీ సీఎం అయిన తరువాత ప్రత్యేక హోదా అంశాన్ని వదిలివేశారు. పీఎం అయిన తరువాత నరేంద్ర మోడీ, రాజ్యసభ చైర్మన్ అయిన తరువాత వెంకయ్య నాయుడు ఈ అంశాన్ని వదిలివేశారు. 14వ ఆర్ధిక సంఘం సిఫార్సుల కారణంగా ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి వీలులేదని కేంద్రం ఇప్పటి వరకూ చెబుతూ వస్తుంది. మరి నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు బీహార్ విషయంలో ఈ వ్యాఖ్యలు ఎలా చేశారు. బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సి వస్తే బీహార్ కంటే ముందు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలికదా. ఏపి ఏ పరిస్థితుల్లో ఉందో అందరికీ తెలుసు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల కోసం ప్రతి నెలా అప్పుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది. ఇటీవల వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా కేంద్రం వద్ద తమకు అప్పులు తెచ్చుకునే మార్గం చూపించండి అని అడిగారు. ఎంపి మిథున్ రెడ్డి లోక్ సభ సాక్షిగా అందరి ముందు దారుణంగా మాట్లాడారు. మా రాష్ట్రం దీవాలా పరిస్థితిలో ఉంది. రాష్ట్రంలో ఆర్ధిక సంక్షోభం ఎక్కువ అయ్యింది. కాపాడండి అంటూ వేడుకున్నారు.
జగన్ ఒక ట్వీట్ చేస్తే బాగుండేదికదా..!
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బేరీజు వేసుకోకుండా ఇబ్బడి ముబ్బడిగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కారణంగా కావచ్చు. ఆర్ధిక క్రమశిక్షణ లోపించడం వల్ల కావచ్చు రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టివేయబడింది. దీనికి రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకపోవడం, రాష్ట్రానికి ప్రత్యేక గ్రాంట్ రాకపోవడం, రాయితీలు రాకపోవడం, పెట్టుబడులు రాకపోవడం, కేంద్రం కరుణించకపోవడం ఇలా చాలా కారణాలు ఉన్నాయి. సో.. తప్పులు ఎవరివన్నా కానీ పాపం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం, ఏపి ప్రజలు భరిస్తున్నారు. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు బీహార్ కు ప్రత్యేక హోదా పరిశీలిస్తామని అనడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంటనే స్పందించి కనీసం ఒక ట్వీట్ చేస్తే బాగుండేది. బీహార్ కు ప్రత్యేక హోదా పరిశీలిస్తున్నామని అంటున్నారు ముందుగా మా రాష్ట్రం గురించి పరిశీలించండి అంటూ నిన్ననే ఒక ట్వీట్ చేయాల్సి ఉంది. దాంతో కేంద్రం కళ్లు తెరిచేది. వీళ్లు రెడిగా ఉన్నారు అంటూ కొంత జాగ్రత్తపడేది. లేకుంటే ఢిల్లీకి వెళ్లి 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది పార్లమెంట్ సభ్యులతో ఢిల్లీలో దర్నా చేస్తే కశ్చితంగా కేంద్రం దిగివస్తుంది కదా, కానీ ఇవి ఏమీ చేయడం లేదు, ఎందుకంటే ఆయనకు రిస్క్. ఎందుకు రిస్కో అందరికీ తెలుసు.