YSRCP: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి ఊహించని కష్టాలు వచ్చి పడుతున్నాయి. ఒక దాని వెంట ఒకటి వచ్చి పడుతూ తలనొప్పి తెప్పిస్తున్నాయి. ఓ పక్క వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వ్యవహారం తలనొప్పిగా మారిన విషయం తెలిసిందే. ఈ అంశంలో జగన్ ను, వైసీపీని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సంధిస్తున్నాయి. మరో పక్క ఉగాది నుండి ప్రారంభించాలనుకున్న కొత్త జిల్లాల విషయంలోనూ అటు ప్రతిపక్షం నుండి ఇటు స్వపక్షం నుండీ ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాల విభజనపై వస్తున్న విమర్శలను పక్కన పెట్టి ఎలాగోలా ఉగాది నుండి కొత్త జిల్లాలు ప్రారంభించాలంటే జిల్లాకు రూ.200 కోట్లు చొప్పున నిధులు కేటాయించాల్సి ఉంటుంది. ప్రస్తుత రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిలో సుమారు రూ.5వేల కోట్లకు పైగా నిధుల సమీకరణ కష్టమే. నూతన జిల్లాల్లో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం ఇలా అన్ని ప్రభుత్వ కార్యాలయ భవనాల ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒక్కో జిల్లాకు తక్కువలో తక్కువ రూ.50కోట్లు చొప్పున అయినా సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి ఉగాది నుండి ఇది ఒక తలనొప్పి.
Read More: YS Jagan: జగన్ మైండ్ లో ప్లాన్ బీ..! హైకోర్టు తీర్పుపై వైసీపీ రివర్స్ గేమ్ సిద్ధం..!?
YSRCP: బీజేపీ డబుల్ గేమ్..?
మరో వైపు పార్టీ లో రాజ్యసభ స్థానాల ఎంపిక వ్యవహారం. త్వరలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాలను అభ్యర్థులను ఎంపిక చేయడం, అదే విధంగా మంత్రి వర్గ ప్రక్షాళనలో లాబీయింగ్ లు, సిఫార్సులతో తలమునకలై ఉన్నారు. ఇవన్నీ ఎలాగొలా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. అయితే ఇప్పుడు అమరావతి విషయంలో బీజేపీ ఏమైనా గేమ్ స్టార్ట్ చేసిందా అన్న కొత్త అనుమానాలు మొదలు అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ నిధులు కేటాయించింది. బడ్జెట్ లోనే ఈ అంశాన్ని పెట్టారు. అమరావతి లో ఉద్యోగుల క్వార్టర్స్ నిర్మాణానికి సుమారు రూ.1200 కోట్లు, సచివాలయ నిర్మాణానికి రూ.1120 కోట్లు మొత్తం కలిపి సుమారు రూ.2300 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. గత ఏడాది కూడా నిధులు ఇస్తే సక్రమంగా ఖర్చు పెట్టలేదని కూడా పేర్కొంది. అమరావతినే రాజధానిగా గుర్తిస్తున్నాము, అందుకే నిధులు ఇస్తున్నాము అని కేంద్రం చెబుతోంది. మరో వైపు ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు. రాజధాని వికేంద్రీకరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం అని చెబుతోంది. ఇక్కడే బీజేపీ డబుల్ గేమ్ ఇబ్బందికరంగా మారింది. బీజేపీ నాయకులు కూడా ఇక్కడ ఒకలా మాట్లాడుతున్నారు. ఢిల్లీ స్థాయి నాయకులు మరోలా మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా డీల్ చేయాలని అనుకుంటుంటే…
YSRCP: రాజధానిని అభివృద్ధి చేయాల్సిందే
అమరావతి విషయంలో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా రాజధానిని అభివృద్ధి చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఇలా ఒకదాని తరువాత ఒకటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పావులు కదులుతున్నాయి. ఈ పజిల్స్ అన్నీ కూడా జగన్ ఒకదాని తరువాత ఒకటి పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలి. వీటన్నింటికీ తోడు ఎమ్మెల్యేలపై అసంతృప్తుల వ్యవహారం. ఎమ్మెల్యేల పట్ల, పార్టీ పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని వార్తలు వినబడుతున్నాయి. వీటికి తోడు ఆర్ధికపరమైన ఇబ్బందులు వెంటాడుతున్నాయి. జూన్ నెల అమ్మఒడి పథకాన్ని అమలు చేయాలి.
YSRCP: నిధుల సర్దుబాటు ఎలా..?
అలానే రైతు భరోసా డబ్బులు కొంత మందికి వేయాలి. విద్యాకానుక, విద్యా దీవెనలు ఇవ్వాలి. వీటికి సుమారు రూ.75వేల కోట్లు కావాలి. హైకోర్టు ఆదేశాల మేరకు ఉపాధి హామీ పనులు చేసిన కాంట్రాక్టర్ లకు బిల్లులు ఇవ్వాలి. రాబోయే ఆరు నెలల కాలంలో ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు కావాలి. ఈ నిధులను ఎలా సర్దుబాటు చేయాలో ప్రభుత్వానికి అర్ధం కావడం లేదు. ఈ పరిస్థితిలో కేంద్రంలో ఏమైనా రాష్ట్రాన్ని ఆదుకుంటుందా అంటే కేంద్రంలోని బీజేపీ ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలోనే చూస్తోంది. జగన్మోహనరెడ్డి ఈ సమస్యలను ఎలా పరిష్కరించుకుని బయటపడతారో వేచి చూడాలి.