YSRCP: ఏపిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సాధారణంగా పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలపై వ్యతిరేక స్వరాలు ఎక్కువగా వినబడుతూ ఉంటాయి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులకు కోరికలు అధికం అవుతాయి. తమకు ఆ పదవి కావాలి, ఈ పదవి కావాలీ, ఆ పనులు అప్పగించాలి, ఈ పనులు అప్పగించాలి అంటూ ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకుని వస్తుంటారు. ఈ ధోరణి అన్ని పార్టీల్లోనూ ఉంటుంది. వారి కోరికలను ఎమ్మెల్యేలు నెరవేర్చనప్పుడు ఆ ఎమ్మెల్యేపై వ్యతిరేక స్వరాలు పెరుగుతుంటాయి. ఉదాహారణకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలానే జరిగేది. పాయికారావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత, కొవ్వూరు ఎమ్మెల్యే జవహార్ తో పాటు సుమారు 30 మంది ఎమ్మెల్యేల మీద గ్రూపులు అధికం అయ్యాయి. కార్యకర్తలే ఆ ఎమ్మెల్యేలపై తిరిగబడి సీటు ఇవ్వవద్దంటూ ఆందోళనలు కూడా చేశారు. 2019 ఎన్నికలకు ముందు ఈ సమస్యను పరిష్కరించుకోవడమే టీడీపీకి పెద్ద సమస్యగా మారింది. చివరకు ఆ 30 మందిలో 20 మందికి అటు వాళ్లను ఇటు, ఇటు వాళ్లను అటు సీట్లు మార్చేశారు చంద్రబాబు. ఎక్కువగా రిజర్వుడ్ నియోజకవర్గాల్లో ఈ సమస్య వచ్చింది.
Read More: Jagan Strategy: జగన్ ప్లాన్ లో టీడీపీ చిక్కకుంటే ..!? కోటి ఓట్లపై జగన్ గురి..!?
YSRCP: ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి
అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ ఇప్పుడు అదే రకమైన సమస్య వచ్చింది. వైసీపీలోనూ ఆయా నియోజకవర్గాల్లో తమకు పార్టీ కావాలి, కానీ ఎమ్మెల్యే వద్దు అన్న ధోరణి వ్యక్తం అవుతోంది. ఎమ్మెల్యే పనితీరు బాగాలేదు. ఎమ్మెల్యే మమ్మల్ని పట్టించుకోవడం లేదని క్యాడర్ ఆరోపిస్తుంది. ఎమ్మెల్యే వర్గాలను ప్రోత్సహిస్తున్నారనీ, గతంలో టీడీపీకి పని చేసిన వాళ్లను ఎమ్మెల్యే దగ్గరకు తీసుకుని వాళ్లకే పనులు ఇచ్చి వారి కోరికలే తీరుస్తున్నారని మొదటి నుండి వైసీపీలో పని చేసిన కార్యకర్తలు కొన్ని నియోజకవర్గాల్లో గళం విప్పుతున్నారు. 25 నియోజకవర్గాల్లో ఆ పరిస్థితి ఉంది. ఉదాహరణకు పాయికారావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు వ్యతిరేకంగా ఒక పెద్ద ర్యాలీ నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వవద్దంటూ ర్యాలీ చేశారు. ఆ తరువాత నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజాకు వ్యతిరేకంగా ఓ పెద్ద గ్రూపు తయారైంది. మండలానికి ఒక నాయకుడు వ్యతిరేక గ్రూపుగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో రోజాకు టికెట్ ఇవ్వవద్దంటూ ఇప్పటి నుండి లాబీయింగ్ లు మొదలు పెట్టారు.
పార్టీ పెద్దలకు ఫిర్యాదులు, లాబీయింగ్ లు
అలానే పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులోనూ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి వ్యతిరేకంగా ఇప్పుడిప్పుడే ఒక గ్రూపు తయారు అవుతోంది. వీళ్లు కూడా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పార్టీ పెద్దలను కలుస్తున్నారు. ఫిర్యాదులు చేస్తున్నారు. వీళ్లు కూడా మొదటి నుండి పార్టీలో పని చేస్తున్న వాళ్లే. సత్తెనపల్లి లో ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు ఒక వ్యతిరేక గ్రూపు ఉంది. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు వ్యతిరేకంగా రెడ్డి సామాజికవర్గం నాయకులు పార్టీ మారే పరిస్థితి వచ్చింది. అలానే కనిగిరిలో మధుసూధన్ యాదవ్ కు వ్యతిరేకంగా చాలా మంది నాయకులు పార్టీ మారుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో ఇటువంటి నియోజకవర్గాలు 20 వరకూ ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లలోనే ఇన్ని ఉన్నాయి అంటే ఎన్నికలు వచ్చే నాటికి 35 – 40 నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి వస్తుంది. ఈ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నాయకులు, కార్యకర్తలు తమకు పార్టీ ముఖ్యం, కానీ ఈ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వవద్దు, ఇతనికే టికెట్ ఇస్తే తాము వ్యతిరేకంగా పని చేస్తాము అన్న కాన్సెప్ట్ లో చాలా మంది నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి పెద్ద సవాల్ గా మారిన ఈ సమస్యను పార్టీ అధిష్టానం, సీఎం వైఎస్ జగన్ ఏ విధంగా పరిష్కరిస్తారు అనేది వేచి చూడాలి.