YSRCP: ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో రాజ్యసభ సభ్యుల ఎంపికకు సంబంధించి హడావుడి మొదలైందని చెప్పుకోవచ్చు. ఏపి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న సుజనా చౌదరి, టీజీ వెంకటేష్,, సురేష్ ప్రభు. విజయసాయిరెడ్డి ల పదవీ కాలం జూన్ మాసంతో ముగియనుంది. సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ లు టీడీపీ తరపున రాజ్యసభ కు నామినేట్ అయినప్పటికీ ఆ తరువాత బీజేపీలో విలీనం కావడంతో వారు బీజేపీ రాజ్యసభ్యులుగానే రిటైర్ అవుతున్నారు. నాడు ఎన్డీఏతో టీడీపీ భాగస్వామ్యంగా ఉన్నందున బీజేపీ పెద్దల సూచనల మేరకు ఆ పార్టీకి చెందిన సురేష్ ప్రభు టీడీపీ తరపున రాజ్యసభకు ఎన్నికైయ్యారు. విజయసాయిరెడ్డి వైసీపీ నుండి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఖాళీ అవుతున్న ఈ నాలుగు స్థానాలకు ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి నెలలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఏపి అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న సంఖ్యా బలం కారణంగా ఖాళీ అవుతున్న ఈ నాలుగు రాజ్యసభ స్థానాలు వైసీపీనే కైవశం చేసుకుంటుంది. టీడీపీకి అసెంబ్లీలో తగినంత సంఖ్యాబలం లేనందున ఒక్క స్థానం కూడా గెలుచుకునే అవకాశం లేదు. ప్రస్తుతం టీడీపీకి ఒకే ఒక రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ఉన్నారు. వైసీపీకి ప్రస్తుతం ఆరుగురు రాజ్యసభ సభ్యులుగా ఉండగా త్వరలో ఎన్నిక కానున్న నాలుగు స్థానాలతో వైసీపీ బలం తొమ్మిదికి చేరనుంది.
YSRCP: విజయసాయిరెడ్డికి మళ్లీ రెన్యువల్
ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో వైసీపీ నుండి విజయసాయిరెడ్డికి మళ్లీ రెన్యువల్ అవకాశం ఉంది. మిగిలిన మూడు రాజ్యసభ స్థానాలు వైసీపీ ఎవరెవరికి కేటాయించనుంది అంటే.. ఒక రాజ్యసభ స్థానాన్ని మాత్రం కార్పోరేట్ సంస్థకు కేటాయించినట్లు వార్తలు వినబడుతున్నాయి. ఏడాదిన్నర క్రితం కూడా కేంద్రంలోని పెద్దలు, రిలయన్స్ అధినేత అంబానీ సిఫార్సు మేరకు రిలయన్స్ సంస్థలో నెంబర్ 2 పొజిషన్ లో ఉన్న పరిమళ్ నత్వానీ వైసీపీ రాజ్యసభకు నామినేట్ చేసింది. ఆయన రాజ్యసభకు ఎన్నికైన ఏడాదిన్నర కాలంలో ఒక్క సారి కూడా రాష్ట్రానికి రావడం కానీ, రాజ్యసభలో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై మాట్లాడటం గానీ చేయలేదు. కరోనా విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన వ్యక్తిగతంగా పెద్ద ఎత్తున విరాళం ఇచ్చింది లేదు. అయితే ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఢిల్లీ పర్యటనలో కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ లు ఖరారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని వార్తలు వినబడుతున్నాయి. కార్పోరేట్ శక్తులకు రాజ్యసభ సభ్యత్వాలు ఇవ్వడం వల్ల రాష్ట్రానికి ఏమి లాభం ఉండటం లేదన్న పేరు ఉంది. ఇదే రాజ్యసభ సభ్యత్వాలను ప్రజల్లోని ఎదిగిన నేతలకు ఇస్తే ప్రజా సమస్యలనైనా రాజ్యసభలో ప్రస్తావించే అవకాశం ఉంటుంది అంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడు కూడా మరో కార్పోరేట్ కంపెనీ ప్రతినిధికే రాజ్యసభ స్థానం ఇచ్చేందుకు వైసీపీ ప్రాధమికంగా నిశ్చయించినట్లు తెలుస్తోంది. ఇది కూడా బీజేపీ, వైసీపీకి ఉన్న లోపాయికారీ ఒప్పందంతో ఆదానీ సంస్థ గానీ మరో సంస్థ ప్రతినిధికి గానీ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.
YSRCP: బీసీ కోటాలో బీదా మస్తాన్ రావుకు..?
మరో రెండు రాజ్యసభ స్థానాలకు వైసీపీ నుండి దాదాపు ఏడు ఎనిమిది మంది పోటీ పడుతున్నారు. నెల్లూరు జిల్లాలో టీడీపీ నుండి వైసీపీలోకి చేరిన పారిశ్రామిక వేత్త బీదా మస్తాన్ రావుకు రాజ్యసభ ఇస్తామన్న హామీ ఉంది. ఆయనకు బీసీ కోటాలో రాజ్యసభ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఆయనతో పాటు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఎప్పటి నుండో రాజ్యసభ సభ్యుడుగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. వాస్తవానికి 2019లో వైవీ సుబ్బారెడ్డికి ఒంగోలు పార్లమెంట్ కు పోటీ చేయడానికి అవకాశం ఇవ్వనప్పుడే రాజ్యసభకు పంపిస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి కూడా ఈ ఏడాది జూన్ తో ముగియనుంది. ఆయన ఎమ్మెల్సీ ద్వారా మంత్రి పదవి కూడా అడిగారు. కానీ అది ఇవ్వలేదు. ఇప్పుడు ఆయనకు రాజ్యసభ ఇచ్చే అవకాశం ఉంది. ఒక వేళ వైవీ కాకపోతే గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ కు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
వినబడుతున్న వైవీ సుబ్బారెడ్డి, మర్రి రాజశేఖర్ పేర్లు
చిలకలూరిపేట ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన సమయంలోనే వైఎస్ జగన్ ఆయనకు బహిరంగంగానే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. ఈ రెండున్నరేళ్లలో ఆయనకు సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేకపోయారు. అయితే ఇప్పుడు ఆయనకు రాజ్యసభ ఇస్తారు అనే ప్రచారం జరుగుతోంది. సామాజిక వర్గ కోణంలో, ఆర్ధిక కోణంలో చూసుకుంటే ఆయనకు ఇచ్చే అవకాశం లేదని సమాచారం. అందుకే ఆయన క్రియాశీల రాజకీయాల నుండి పక్కకు జరిగి మళ్లీ నల్లకోటు వేసుకుని మర్రి రాజశేఖర్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలు పెట్టారని అంటున్నారు. ఈ తరుణంలోనే ఒక మైనార్టీకి గానీ ఎస్సీకి గానీ ఒక రాజ్యసభ స్థానాన్ని ఇవ్వాలనేది వైసీపీ ప్లాన్ గా ఉందని అంటున్నారు. బీసీ కోటాలో బీదా మస్తాన్ రావు కి ఇస్తున్నందున మరో రాజ్యసభ స్థానం వైవీకి కాకపోతే ఎస్సీ లేదా మైనార్టీలకు ఇస్తారు అనే టాక్ వినబడుతోంది. ఈ రెండు రాజ్యసభ స్థానాలకు నాలుగైదు పేర్లు వినబడుతుండగా జగన్మోహనరెడ్డి చల్లని చూపు ఎవరిపై ఉందో ఎవరూ చెప్పలేరు. కాకపోతే మరో నెల రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.