దేశంలోని దిగ్గజ సంస్థతో ప్రపంచంలోని అగ్రశ్రేణి సంస్థ చేతులు కలుపనుందా.. అంటే అవుననే అంటున్నాయి వ్యాపార వర్గాలు. ఇందుకు సంబంధించి పలు వార్తలు మీడియాలో షికారు చేస్తున్నాయి. భారత్ అగ్రశ్రేణి వ్యాపార దిగ్గజం రిలయన్స్ తో ప్రముఖ ఆన్ లైన్ వ్యాపార దిగ్గజం అమెజాన్ చేతులు కలుపుతోందనేది ఆ వార్తల సారంశం. ఇందుకు తెర వనుక ప్రయత్నాలు జరుగుతున్నాయని పలు మీడియా వర్గాలు కూడా వెల్లడించడం విశేషం.
రిలయన్స్ సంస్థ ఇటివలే జియో మార్ట్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులోనే అమెజాన్ 9.9 శాతం వాటా కొనుగోలు చేసేందుకు అమెరికాకు చెందిన ఈ-కామర్స్ దిగ్గజం ఆమెజాన్ ఆసక్తి చూపుతోందని తెలుస్తోంది. ఈమేరకు పలు ఆంగ్ల చానెల్స్ లో వార్తలు కూడా వచ్చాయి. ఈ ఏడాది మేనెలలో వాల్మార్ట్, అమెజాన్ డాట్ కామ్కు పోటీగా రిలయన్స్ జియో మార్ట్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. కిరాణా వ్యాపార రంగంలో కూడా విస్తరించేందుకు ప్రణాళికలు వేసింది. వాట్సాప్ ఆర్డర్ల ద్వారా ఆర్డర్లు తీసుకునేందుకు వినియోగదారులకు సౌకర్యం కల్పించింది.
ప్రస్తుతానికి నవీ ముంబయ్, థానే, కల్యాణ్.. వంటి ప్రాంతాల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. త్వరలో దేశవ్యాప్తంగా ఈ సౌకర్యం అమలు చేయనుంది. ఇప్పటికే రిటైల్ రంగంలో అమెజాన్ కూడా పెట్టుబడులు పెట్టింది. స్మార్ట్ స్టోర్స్ సదుపాయాన్ని కూడా ప్రారంభించింది. ఈ రెండు దిగ్గజ కంపెనీలపై వస్తున్న వార్తల్లో త్వరలో క్లారిటీ రానుంది.