ఎస్పీ బాలసుబ్రమణ్యం.. లెజండరీ సింగర్ ఈరోజు మధ్యాహ్నం మృతి చెందిన సంగతి తెలిసిందే. దాదాపు 50 రోజులుగా కరోనా వైరస్ తో పోరాడుతున్న అయన ఈరోజు మధ్యాహ్నం కన్నుమూసి అభిమానుల తీరని శోకాన్ని మిగిల్చిపోయారు. అయన మృతి వార్త విన్న పలువురు సెలబ్రెటీలు భావోద్వేగానికి గురవుతున్నారు.
ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణవార్త విన్న ఏఆర్ రెహమాన్ భావోద్వేగానికి గురయ్యాడు. బాలు మరణంతో సర్వం నాశనమైపోయిందన్న ఫీలింగ్ కలుగుతోందని రెహమాన్ ట్వీట్ చేశారు.
ఇక బాలసుబ్రమణ్యం మృతిపై కొన్ని మీడియాలు ఇకలేరు అని రాయడంపై కొరటాల సీరియస్ అయ్యారు. ”బాలు గారు ఇక లేరు అనటం తప్పు. పాట ఉన్నంత కాలం ఆయన మన మధ్యే ఉంటారు. కాని ఆయన ఇక పాట పాడరు అనే విషయమే జీర్ణించుకోలేని నిజం. గానగంధర్వుడికి శోకతప్త హృదయంతో అశృనివాళులు” అంటూ కొరటాల శివ ట్వీట్ చేశారు.
ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణవార్త విన్న ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ”తెలుగు వారి ఆరాధ్య స్వరం మూగబోయింది. భారతీయ సంగీతం తన ముద్దు బిడ్డను కోల్పోయింది. ఐదు దశాబ్దాలకు పైగా,16 భాషల్లో 40 వేలకు పైగా పాటలకు జీవం పోసిన గాన గాంధర్వ , పద్మ భూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరు అనే వార్త తీవ్రం గా కలచివేసింది. ఈ భువి లో సంగీతం ఉన్నంత కాలం మీరు అమరులే” అంటూ ట్విట్ చేసారు.