తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన కే చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య ఎంతటి సఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే,
గత కొంతకాలంగా వీరి మధ్య ఊహించని గ్యాప్ సైతం తెరమీదకు వస్తోంది. ముఖ్యంగా జలవివాదాల విషయంలో అయితే ఏకంగా విమర్శలు చేసుకునే స్థాయికి పరిస్థితి చేరిపోయింది. తెలంగాణ సీఎం కేసీఆర్ అయితే బహిరంగంగానే ఏపీ సీఎం తీరును తప్పుపట్టారు. ఇప్పటికే ఇలా రగిలిపోతున్న తెలంగాణ సీఎం కేసీఆర్కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో చురక అంటించారనే ప్రచారం జరుగుతోంది.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజాగా రైతుల సంక్షేమం కోణంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, వారి ఉత్పత్తులను సరైన విధంగా మార్కెటింగ్ చేయడం తెలియకపోవడం వంటి అనేక అంశాల వల్ల నష్టపోతున్నారనేది మనందరికీ తెలిసిన విషయమే. అయితే, దీన్ని గుర్తించిన జగన్ ప్రభుత్వం ఓ టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. వ్యవసాయ ఉద్యాన ఉత్పత్తులు గిట్టుబాటు ధర మార్కెటింగ్ ఇతర అంశాలపై రైతులకు టాస్క్ ఫోర్స్ కమిటీ సేవలు అందించనుంది.
వ్యవసాయ శాఖ, పరిశ్రమల శాఖ, వాణిజ్య శాఖ, సహకార శాఖల సమన్వయంతో జాయింట్ టాస్క్ ఫోర్స్ కమిటీని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటితో పాటుగా మొత్తం 11 శాఖల ఉన్నతాధికారులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఆహారశుద్ధి, విలువ జోడింపు వంటి అంశాలపై ఈ కమిటీ రైతులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటుంది. తద్వారా రైతుల ఉత్పత్తులకు తగిన ధర అందించడం సాధ్యం అవుతుంది.
అయితే, ఏపీ సీఎం తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ సీఎం కేసీఆర్కు చురక అంటించడం వంటిదేనని పలువురు విశ్లేషిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ వీటికి సంబంధించిన నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందనే అభిప్రాయం గత కొంతకాలంగా రైతుల్లో వ్యక్తమవుతోందని వివిధ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఏపీ సీఎం తీసుకున్న నిర్ణయం తెలంగాణ ముఖ్యమంత్రికి చురక అంటించమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.