ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానుల విషయంలో రాజకీయ ప్రత్యర్థుల నుంచి ఎన్ని సవాళ్లు ఎదురైన ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఉన్న సంగతి తెలిసిందే. మూడు రాజధానుల బిల్లు విషయలో ఏపీ ప్రభుత్వాన్ని విపక్షాలు కూడా ఓ రేంజ్లో టార్గెట్ చేస్తున్నాయి.
ఇదే సమయంలో రాజధాని రైతుల నుంచి సైతం ప్రతిఘటన ఎదురవుతోంది. మూడు రాజధానుల బిల్లుకు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపడంతో రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించగా బిల్లులపై హైకోర్డు ఈ స్టే విధించింది. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకొని సుప్రీంకోర్టు మెట్లు ఎక్కుతోంది.
రాజధాని విషయంలో హైకోర్టులో పిటిషన్ దాఖలైన సందర్భంగా మూడు రాజధానుల బిల్లుకు, సీఆర్డీఏ రద్దు బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. ప్రభుత్వం దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్డు ఆదేశించింది. అయితే, కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వం తరపు న్యాయవాది 10 రోజుల గడువు కోరారు. దీంతో తదుపరి విచారణను ఈ నెల 14కు హైకోర్టు వాయిదా వేసింది. మరోవైపు, హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ విచారణకు రాకపోవడంతో అత్యవసరంగా విచారించాలంటూ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్కు లేఖ రాసింది. తద్వారా సుప్రీంకోర్టులో తేల్చుకునేందుకు సిద్ధమైంది.
ఇదిలాఉండగా, ఏపీ సీఎం వైఎస్ జగన్ సన్నిహితుడు, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి రాజధాని విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. 2014 ఎన్నికలకు ముందు అమరావతిలో రాజధాని పెడతానని మేనిఫెస్టోలో చంద్రబాబు పెట్టారా ? అని సజ్జల ప్రశ్నించారు. మూడు రాజధానులపై గందరగోళం చేయడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. విశాఖ ప్రజలను రెచ్చగొట్టి వారితో రాజధాని వద్దని చెప్పించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కర్నూలు, వైజాగ్ ప్రజలు తమకు రాజధాని వద్దని ప్రజలు అన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.
శివరామ కృష్ణన్ కమిటీ కూడా అమరావతిలో రాజధాని పెట్టమని చెప్పలేదని సజ్జల స్పష్టం చేశారు. అమరావతిలో రాజధాని పెట్టమని నారాయణ కమిటీ మాత్రమే చెప్పిందని, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే చంద్రబాబు అమరావతి రాజధానిగా పెట్టారని సజ్జల విమర్శించారు. చంద్రబాబు తన పాలనలో అమరావతి పూర్తి చేయకుండా ఏ గుడ్డి గుఱ్ఱనికి పళ్ళు తోముతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు, ఆయన తాబేదార్లుకు అమరావతి కామధేనువు వంటిదని సజ్జల ఆరోపించారు.
వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు ప్రాంతాల వికేంద్రీకరణ అని మేనిఫెస్టోలో పెట్టారని సజ్జల స్పష్టం చేశారు. ఏడాది పాటు మూడు రాజధానులపై కసరత్తు జరిగిందన్న అయన మూడు రాజధానులపై చంద్రబాబే ప్రజాభిప్రాయం కోరాలని అన్నారు. చంద్రబాబు 48 గంటలకు ఒక సారి మీడియా సమావేశం పెట్టి అసందర్భ ప్రేలాపణలు పేలుతున్నారని మండిపడ్డారు.