అమరావతి అంశం రాజకీయంగా అన్ని పార్టీల్లోనూ ప్రకంపనలు రేపుతోంది. అన్ని పార్టీల్లోని నాయకులు ప్రాంతాలకు తగ్గట్టుగా మట్టాడే పరిస్థితులు ఏర్పడ్డాయి. పవన్.. అమరావతికి అనుకూలమా.. మూడు రాజధానులకు అనుకూలమా అనేది అధినేత నుంచి కార్యకర్తకు కూడా క్లారిటీ లేదు. అమరావతికి అనుకూలమంటూనే సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. నిజానికి పవన్ కు బీజేపీ పెద్దలతో ఉన్న పరిచయంతో బిల్లును గవర్నర్ వద్ద ఆపేయగలిగే సత్తా ఉంది. కానీ.. బీజేపీకి వైసీపీకి మధ్య ఉన్న సఖ్యతతో ఆ పని చేయలేకపోయారు.
జనసేన సీనియర్ నాయకుల్లో తలో మాట..
తోట చంద్రశేఖర్, మాదాసు గంగాధర్, నాదెండ్ల మనోహర్, నాగబాబు జనసేనలో కీలక నాయకులు. వీరిలో తోట, నాదెండ్ల రాజధాని ప్రాంతానికి చెందినవారే. అమరావతికి అనుకూలంగా పోరాడాలని వీరు అభిప్రాయపడుతున్నారు. విజయవాడలో కృష్ణా వంతెనపై రైతుల కోసం ర్యాలీ చేయాలని భావించారు. బీజేపీ నుంచి అనుమతి రాని కారణంగా జరగలేదు. దీంతో పార్టీ స్టాండ్ ఏమిటో వీరికే అర్ధం కావడంలేదని సమాచారం. అమరావతి పోరాటంలో పార్టీ వెనుకబడుతందని వీరి భావన అని.. పవన్ కు వ్యతిరేకంగా వెళ్లలేని పరిస్థితుల్లో ఉంటున్నారని అంటున్నారు.
టీడీపీ స్టాండ్ అమరావతి వైపే ఉంది. అమరావతి పేరుతో రైతుల నుంచి భూములు తీసుకోవడంతో పూర్తి బాధ్యత ఆ పార్టీ తీసుకోవాల్సిందే. అయితే ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ నాయకులు మాత్రం విశాఖ రాజధానికి అంతర్గతంగా జై కొడుతున్నారని తెలుస్తోంది. తమ ప్రాంతానికి వ్యతిరేకంగా మాట్లాడితే మొదటికే మోసం వస్తుందని వీరు అమరావతి విషయంలో పెద్దగా స్పందించడం లేదు.
వైసీపీలో కూడా ఇదే తరహా స్వరాలు వినిపిస్తున్నాయి. వీరికి కృష్ణా, గుంటూరు జిల్లాలతో ఇబ్బంది ఏర్పడింది. ముఖ్యంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి, శ్రీదేవి, విజయవాడ నగర ఎమ్మెల్యేలు.. తదితరులు ఈ విషయంపై ఏమీ స్పందించడం లేదు. జనసేన పార్టీ పరిస్థితి కూడా ఇంచుమించు ఇలానే ఉంది.