టీడీపీ సీనియర్ నేత,మాజీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మరోమారు ఏపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ తరఫున వివిధ అంశాలపై సమగ్రంగా మాట్లాడే నేతల్లో ఒకరిగా పేరున్న
ఆయన తాజాగా ఏపీ సర్కారు తీరును తీవ్రంగా తప్పుపట్టారు. తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పారిశ్రామిక విధానంపై ధ్వజమెత్తారు. నూతన పారిశ్రామిక విధానంతో రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని ఎద్దేవా చేసిన ఆయన ఈ పాలసీ కోసమా 14నెలల విలువైన కాలం వృధా చేసింది అని ప్రశ్నించారు.
తయారీ రంగం, నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్ రంగాలన్నీ తిరోగమనంలోనే ఉన్నాయని యనమల అన్నారు. పోలవరం ప్రాజెక్టు గురించి ఏపీ సీఎం కామెంట్లు చిత్రంగా ఉన్నాయని యనమల పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం రూ.64 వేల కోట్లు సాగునీటి రంగానికి కేటాయించి, పోలవరం ప్రాజెక్టుని 70 శాతం పైగా పూర్తి చేసిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పునాదులు కూడా నిర్మించలేదని తమపై విమర్శలు చేసిన ఏపీ సీఎం ఇప్పుడు అదే పోలవరం ప్రాజెక్టుకు ఎక్కడ గేట్లు పెడుతున్నాడో సమాధానం చెప్పాలని యనమల డిమాండ్ చేశారు. తద్వారా తమ ప్రభుత్వం చేసిన పనిని జగన్ తన ఖాతాలో వేసుకుంటున్నారనే భావనను స్పష్టం చేశారు.
ఏపీకి గతంలో ఉన్న బ్రాండ్ ఇమేజ్ను వైసీపీ లీడర్స్ నాశనం చేశారని యనమల ఆరోపించారు. ముఖ్యమంత్రయ్యాక జగన్ మూడు రాజధానుల డ్రామాకు తెరలేపారని దీని వెనుక సొంత ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొన్నారు. విశాఖపట్నంలో దోచుకున్న 32 వేల ఎకరాలను అమ్ముకోవడానికే అక్కడ రాజధాని అంటున్నారని విరుచుకుపడ్డారు. ఓట్లు దండుకోవడానికే తాడేపల్లిలో ఆనాడు ఇల్లు నిర్మించుకున్న జగన్ నేడు రాజధాని మార్పుతో ప్రజలను తీవ్రంగా ఇరకాటంలో పడేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నిర్వాకాల వల్లే పారిశ్రామికరంగంలో మైనస్ 2.2 శాతం వృద్ధి సాధించారని ఎద్దేవా చేశారు. వైసీపీ 14 నెలల పాలనలో లక్షలాది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని, చివరికి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సగం జీతాలే అని మండిపడ్డారు.