‘టీమ్ ఇండియా క్రికెట్ క్లిష్ట దశలో ఉన్నప్పుడు పగ్గాలు అందుకాన్నాడు గంగూలీ. తర్వాత ఇండియన్ క్రికెట్ ను ఉన్నత స్థానంలో నిలిపేందుకు ఎంతో కృషి చేశాడు. నైపుణ్యం ఉన్న ఆటగాళ్లను గుర్తించి అద్భుతమైన ఆటగాళ్లుగా తయారు చేయడంలో గంగూలీ చాలా స్పెషల్. అలా గంగూలీ గుర్తించిన మేటి ఆటగాడే ధోనీ. 2004లో బంగ్లాదేశ్ టూర్ కు వెళ్తూ ధోనీని చూపిస్తూ.. ‘ఇండియాకు ఓ విధ్వంసకర బ్యాట్స్మన్ రాబోతున్నాడు.. భవిష్యత్తులో గొప్ప స్టార్ అవుతాడు’ అని విమాన ప్రయాణంలో నాతో చెప్పాడు. ఆ మాటలు నాకింకా గుర్తున్నాయి’ అని కోల్ కతా నైట్ రైడర్స్ మాజీ డైరక్టర్ జాయ్ భట్టాచార్య గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. గౌరవ్ కపూర్ యూట్యూబ్ షో లో జాయ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.
ఇంకా జయ్ మాట్లాడుతూ.. ‘భారత్ ఏ, పాకిస్తాన్ ఏ, బంగ్లాదేశ్ ఏ త్రైపాక్షిక సిరీస్ ల తర్వాత 2004లో బంగ్లాదేశ్తో జరిగిన సీరీస్కు ధోనీ తొలిసారిగా ఆడాడు. ధోనీ ఆ టూర్లో విఫలమైనా గంగూలీ మలి అవకాశం ఇచ్చాడు. విశాఖలో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో ధోనీ 123 బంతుల్లో 148 పరుగులు చేసి భవిష్యత్ ఆశాదీపంగా మారాడు.
‘గంగూలీలో ఉన్న గొప్ప లక్షణం ఇదే. ఆటగాళ్ల ప్రతిభను గుర్తిస్తాడు ఆటగాడు ఓసారి విఫలమైనా అండగా నిలుస్తాడు. టాలెంట్ ఉన్న ఆటగాగడు రాణిస్తారనేది గంగూలి నమ్మకం’ అని జాయ్ చెప్పుకొచ్చాడు. సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, ఆశిష్ నెహ్రా, జహీర్ ఖాన్ వంటి ఆటగాళ్లను గంగూలీనే పరిచయం చేసి భారత్ బలమైన జట్టుగా ఎదిగడంలో కీలకపాత్ర పోషించాడు.