Salim Durani: టీమిండియా మాజీ క్రికెటర్, స్పిన్ ఆల్ రౌండర్ సలీం దురానీ (88) కన్నుమూశారు. చాలా కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఈ వేళ ఉదయం గుజరాత్ లోని జామ్ నగర్ లో తుదిశ్వాస విడిచారు. 1971 లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ చారిత్రక విజయం అందుకోవడంలో దురానీ ప్రముఖ పాత్ర పోషించారు. భారత్ తరపున ఆయన మొత్తం 29 టెస్ట్ మ్యాచ్ లు ఆడారు. ఒక సెంచరీ, ఏడు అర్ధ సెంచరీలతో 1202 పరుగుల చేశారు. అదే విధంగా 75 వికెట్లు పడగొట్టారు.
దురానీ 1934 డిసెంబర్ 11న అఫ్గానిస్థాన్ లోని కాబుల్ లో జన్మించారు. తన ఎనిమిదవ ఏట ఆయన కుటుంబం కరాచీకి వలస వచ్చి స్థిరపడింది. 1947 లో భారత్ – పాక్ విభజన అనంతరం దురానీ కుటుంబం భారత్ కు వచ్చేసింది. 1960 లో ముంబాయి వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ తో భారత్ తరపున ఆయన అరంగేట్రం చేశారు. 1960 నుండి 70 దశకంలో భారత జట్టులో బెస్ట్ ఆల్ రౌండర్ గా గుర్తింపు పొందారు.
ఆయన చివరి సారిగా 1973 ఫిబ్రవరి లో ముంబాయి వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఆడారు. అనంతరం ఆయన క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. దురానీ మృతి పట్ల మాజీ క్రికెటర్, టీమ్ ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి సంతాపం ప్రకటించారు. ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు క్రికెట్ ప్రముఖులు దురానీ మృతికి సంతాపం ప్రకటించారు.
YS Sharmila: షర్మిల దారి ఎటు – పరీక్ష పెట్టిన బండి