మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15వ చిత్రాన్ని ప్రముఖ స్టార్ డైరెక్టర్ శంకర్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. `ఆర్సీ 15` వర్కింగ్ టైటిల్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ప్రముఖ బడా నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.
ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంటే.. ఎస్.జే సూర్య, శ్రీకాంత్, సునీల్, అంజలి, నవీన్ చంద్ర, సముద్రఖని తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడనే టాక్ ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ వైరల్ గా మారింది.
అదేంటంటే ఈ సినిమాలోని ఓ పాట కోసం ఏకంగా రూ.8 కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నారట. వాస్తవానికి మొదటి నుంచి ఈ సినిమా బడ్జెట్ లెక్కలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమాలోని ఒక సాంగ్ ను న్యూజిలాండ్ లో చిత్రీకరించబోతున్నారట. రామ్ చరణ్, కియారాలపై సాగే సాంగ్ ఇదట.
దాదాపు పది రోజుల పాటు షూటింగ్ ఉంటుందని.. న్యూజిలాండ్ లోని అందమైన ప్రదేశాల్లో ఈ పాటను చిత్రీకరించబోతున్నారని అంటున్నారు. అంతేకాదు ఈ పాట కోసం రూ. 8 కోట్ల బడ్జెట్ కేటాయించబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.