పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్ట్స్తో ఎంత బిజీగా ఉన్నారో ప్రత్యేకంగా వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈయన చివరిగా `రాధేశ్యామ్` చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది.
భాగ్యశ్రీ, జగపతి బాబు, కృష్ణం రాజు తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్, టి.సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదాలు కలిసి పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. ఇటలీ బ్యాక్డ్రాప్లో వింటేజ్ ప్రేమ కథగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మార్చ్ 11న ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంచనాల నడుమ విడుదలైంది.
కానీ, ఆ అంచనాలను ఈ సినిమా ఏ మాత్రం అందుకోలేకపోయింది. భారీ విజువల్స్ తప్పా సినిమాలో ఏం లేదని సాధారణ ప్రేక్షకులే పెదవి విరిచారు. థియేటర్స్లో రిలీజ్ అయిన కొద్ది రోజులకే ఓటీటీలోకి రాగా.. అక్కడా ఈ చిత్రం యావరేజ్ అనిపించుకుంది. అయితే తాజాగా బుల్లితెరపై సైతం ప్రభాస్ కు చేదు అనుభవమే ఎదురైంది. కొన్ని రోజుల క్రితం ఈ సినిమాను జీ తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ చేశారు.
దీనికోసం జీ సంస్థ ప్రమోషన్స్ కూడా చేసింది. దీంతో బుట్టితెరపై రాధేశ్యామ్ ఖచ్చితంగా రికార్డు స్థాయిలో టీఆర్పీ సంపాదిస్తుందని అభిమానులు ఆశ పడ్డారు. దాదాపు 15 నుండి 20 టీఆర్పీ వస్తుందని భావించారు. కానీ, అది జరగలేదు. వారి ఆశ ఆవిరైపోయింది. ఈ మూవీకి కేవలం 8.25 టీఆర్ఫీ మాత్రమే వచ్చింది. ఇది చాలా అంటే చాలా తక్కువ. పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న ప్రభాస్ సినిమాకు ఇంత తక్కువ టీఆర్పీ రావడం అభిమానులు ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.