టలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్స్లో `ఖుషి` ఒకటి. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్వకత్వంలో రూపుదిద్దుకున్న రొమాంటిక్ ప్రేమ కథా చిత్రమిది. శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న మొత్తం ఐదు భాషల్లో గ్రాండ్గా విడుదల చేయనున్నామని మేకర్స్ ప్రకటించారు.
కానీ, లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ఆ తేదీకి ఖుషి రావడం లేదు. ఈ సినిమా షూటింగ్ కొంతభాగమే బ్యాలెన్స్ ఉన్నప్పటికీ.. పోస్ట్ ప్రొడెక్షన్ పనులు, ప్రమోషన్స్ను హడావిడి చేయడం ఇష్టంలేక వచ్చే ఏడాది జనవరి ఆఖరిలో రిలీజ్ను ఫ్లాన్ చేస్తున్నట్లు తాజాగా ఓ టాక్ బయటకు వచ్చింది. అయితే ఈ సినిమా వెనక్కి తగ్గడం అక్కినేని అఖిల్కి కలిసొచ్చే అంశంగా మారిందని అంటున్నారు.
`మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్` వంటి డిసెంట్ హిట్ తర్వాత అఖిల్ నుండి రాబోతున్న చిత్రం `ఏజెంట్`. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో సాక్షివైద్య హీరోయిన్గా నటిస్తే.. మలయాళ స్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రను పోషించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై సుంకర రామబ్రహ్మం, సురేందర్ రెడ్డి సంయుక్తంగా పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.
స్పై థ్రిల్లర్ కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం.. ఆగస్టు 12న విడుదల కావాల్సి ఉంది. కానీ, ఆ తేదీకి వచ్చే అవకాశాలు లేవు. ప్రస్తుతం ఏజెంట్ మేకర్స్ హాలిడేస్ కలిసొచ్చేలా ఓ సోలో డేట్ కోసం వెతుకుతున్నారు. ఇలాంటి తరుణంలో విజయ్-సమంతల `ఖుషి` వెనక్కి తగ్గడంతో.. ఆ స్టాట్ను అఖిల్ బుక్ చేసుకుంటున్నాడట. డిసెంబర్ 23నే ఏజెంట్ను రిలీజ్ చేయాలని భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.